లేదు అసలేదీ లేదు లేదు నాకు పరితాపం లేదు వాళ్ళు నాకు చేసిన మంచిని కాని కీడుని కాని, అదంతా నాకు సమానమే
లేదు అసలేదీ లేదు లేదు నాకు పరితాపం లేదు అదంతా భరించాను, తుడిచిపెట్టేసాను, మరిచిపోయాను గతమంటే వెఱ్ఱి, నాకు లెక్కలేదు
నా జ్ఞాపకాలతో నిప్పు రాజేస్తాను నేను నా దుఃఖాలతో, నా సుఖాలతో వాటిమీద అవసరంలేదు నాకు తుడిచిపెట్టేసి ప్రణయాలన్నీ వాటి అలజడులన్నీ ఎప్పటికీ తుడిచిపేట్టేసి సున్నాపై మొదలౌతాను నేను
లేదు అసలేదీ లేదు లేదు నాకు పరితాపం లేదు వాళ్ళు నాకు చేసిన మంచిని కాని కీడుని కాని, అదంతా నాకు సమానమే
లేదు అసలేదీ లేదు లేదు నాకు పరితాపం లేదు ఎందుకంటే నా జీవితం, నా ఆనందం ఈరోజు మొదలౌతోంది నీతోనే
ఎదిత్ పియాఫ్ అను మహాగాయని 1956వ సంవత్సరంలో ఫ్రెంచిభాషలో పాడిన “నోన్, జ న రెగ్రెత రియాన్” (లేదు, నాకు పరితాపమేదీ లేదు) అను ఈ పాట ఫ్రాన్సుదేశంలోనేకాదు, విశ్వవ్యాప్తంగా అతిప్రాచుర్యంలోకి వచ్చిన గీతాలలో ఒకటి. ఈ పాటని చార్ల్ ద్యుమోన్ అను సంగీతకారుడు ఎదిత్ పియాఫ్ కోసమనే కృతిచేశాడు. అప్పటికే ఆమె బాగా పేరొందిన గాయని. మొదట్లో ద్యుమోన్ ని కలవడానికి సమయంలేదని, శరీరం నీరసపడివుందని నిరాకరించిన పియాఫ్ ఈ పాటని ఆయన పియానోపై వాయిస్తే ఒకసారి విని, “మహాద్భుతం, కచ్చితంగా ఈ పాటని పాడతాను. కచ్చితంగా ఈ పాటతోనే ప్రజలందరి మనసుల్లోను గుర్తుండిపోతాను” అని అందట. ఆమె గొంతుతో, లోలోపల నుండి వచ్చిన శక్తితో నిజంగానే ఈ పాటని మధురాతిమధురంగా ఆలపించింది. ఫ్రెంచిభాషలో రెగ్రెత్ అంటే పశ్చాత్తాపం. కానీ, “జె న రెగ్రెత్ రియాన్” (నేను పశ్చాత్తాపపడట్లేదు) అంటే పదాల వెనుక ఇంకో భావం ఉంది. నేను తప్పుచేసాను అనిగాక, ఇతరులు చేసిన పనులు నాకు ఇబ్బంది కలిగించవు అని. అందుకని “పరితాపమేదీ లేదు” అను నేను తెలుగులో అనువదించాను.
ఎదిత్ పియాఫ్ జీవితంపై ‘ల మోమ్” (కుర్రది) అను ఒక సినిమా కూడా 2007వ సంవత్సరంలో విడుదలయ్యింది. పియాఫ్ పాత్రని మారియోన్ కోతియార్ అను ప్రముఖమైన ఫ్రెంచి అభినేత్రి పోషించింది. ఎదిత్ పియాఫ్ జీవితంలో ఎన్నెన్నో ఒడిదుడుకులను, బాధలను, ఉల్లాసాలను, అలల్లాంటి అలజడిగా సాగిన వైనాలను హృద్యంగా చిత్రీకరించారు ఈ చిత్రికలో. పాటలు కూడా ఆవిడే పాడింది. ఈ సినిమాలో “నోన్ రియాన్ ద రియాన్” అను పాటను ఆవిడ తిరిగి జీవంపోసిన వైనం క్రింద చూడవచ్చు.
రాత్రి బాధలన్నీ కమ్ముతుండగా గుండెనిండుగా ప్రేమిస్తాం ఎప్పటికీ మాయమైపోవనివి నల్ల సీతాకోకచిలుకలు నల్ల సీతాకోకచిలుకలు నల్ల సీతాకోకచిలుకలు
వేరే అమ్మాయిలు నిన్ను కవ్విస్తున్నారు వేల దివ్వెలతో, జిగేలుమనే నగలతో రాత్రినడుమన ఆకర్షిస్తున్నాయి నల్ల సీతాకోకచిలుకలు నల్ల సీతాకోకచిలుకలు నల్ల సీతాకోకచిలుకలు
మసకగా ప్రొద్దుటి వేకువ వెలుగున అద్దంలో కదలాడే అలజడి జలాన ఆకస్మికంగా నిన్ను నువ్వు కలిసినప్పుడు మొత్తమంతా నల్లగా మొత్తమంతా నల్లగా మొత్తమంతా నల్లగా
ఆపై నీ చొక్కాపై చూశావు నువ్వు నీ గుండెకి దగ్గరగా పెట్టిన చొక్కాపై కోటు వేసుకునే ముందున జేబుపై నల్ల సీతాకోకచిలుకని నల్ల సీతాకోకచిలుకని నల్ల సీతాకోకచిలుకని
సార్జ్ గేన్స్బూర్ అను ఫ్రెంచి గాయకుడు, కవి వ్రాసిన “లే పాపియ్యోన్ నువార్” (నల్లటి సీతాకోకచిలుకలు) అను ఈ పాట 1966వ సంవత్సరంలో విడుదలయ్యింది. ఈ పాటని గేన్స్బూర్తో కలిసి ఆలపించింది మిచేల్ ఆర్నో అను గాయని. ఈమె మునుపు ఫ్రాన్సుదేశం తరుపున యూరోవిజన్ అను ఐరోపాస్థాయి గానస్పర్ధాకార్యక్రమంలో పాల్గొంది. ఈ పాట ఈ గాయనీగాయకులిద్దరికీ ఎంతో పేరు తెచ్చిపెట్టింది. గేన్స్బూర్ అప్పటికే పేరొందిన సంగీతకారుడిగా, కవిగా గుర్తింపులోకి వచ్చాడు. ఇతని పాటలు పొరలుపొరలుగా నిమిడిన గూఢమైన సాహిత్యంతో, వివిధ ప్రాసాలంకారాలతో ఫ్రెంచిభాష పాటవ్యాన్ని ప్రదర్శిస్తుంటాయని అభిమానుల ప్రశంస. ఈ నల్లటి సీతాకోకచిలుకలు అన్న పాట వివాహేతర రంకుసంబంధాన్ని నిగూఢంగా వర్ణిస్తోంది. సీతాకోకచిలుకలు ప్రణయానికి, వైవాహికబంధానికి ఐరోపాసంస్కృతిలో చిహ్నం. అటువంటిది నల్లటి సీతాకోకచిలుకలు అంటే ఏదో తప్పు పని చేస్తున్న సమయానికి కలిగే భావనలకు చిహ్నంగా గేన్స్బూర్ సూక్ష్మంగా సూచిస్తున్నాడు.
ఇదే పాట “బిజూ” (మణి, ప్రేమికుడు) అను ఒక సంగీతబృందం కూడా గేన్స్బూర్ తో కలిసి పాడింది. ఆ ఆలాపనని క్రింద చూడవచ్చు.
నా వయసులోని అందరు అమ్మాయిలు అబ్బాయిలు వీధిలో నడిచిపోతున్నారు కలిసి ఇద్దరిద్దరు నా వయసులోని అందరు అమ్మాయిలు అబ్బాయిలు ఆనందంగా ఎట్లుండాలో వారికి బాగా తెలుసు ఆ కళ్ళల్లో కళ్ళుంచి, ఆ చేతిలో చేయుంచి కలిసి పోతున్నారు, ప్రేమికులై, మర్నాడంటే భయంలేక ఔను, కానీ నేను ఒంటరిగా పోతాను ఆ వీధుళ్లో, గుండెదిగులుగా ఔను, కానీ నేను ఒంటరిగా పోతాను, నన్ను ప్రేమించేవాడు లేడుగనుక
నా రోజులు ఎలాగో నా రాత్రులు అలాగే రెండూ అన్నివిధాలా ఒకటే రెండూ ఉల్లాసంలేక ఎంతో విసుగెత్తి నా చెవిలో “నిన్ను ప్రేమిస్తున్నా” అని గుసగుసలాడరు ఎవరూ
నా వయసులోని అందరు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి కడుతున్నారు భవిష్యత్తుకి పథకాలు నా వయసులోని అందరు అమ్మాయిలు అబ్బాయిలు తెలుసు వారికి బాగా, ప్రేమించడం అంటే ఏమిటో ఆ కళ్ళల్లో కళ్ళుంచి, ఆ చేతిలో చేయుంచి కలిసి పోతున్నారు, ప్రేమికులై, మర్నాడంటే భయంలేక ఔను, కానీ నేను ఒంటరిగా పోతాను ఆ వీధుళ్లో, గుండెదిగులుగా ఔను, కానీ నేను ఒంటరిగా పోతాను, నన్ను ప్రేమించేవాడు లేడుగనుక
నా రోజులు ఎలాగో నా రాత్రులు అలాగే రెండూ అన్నివిధాలా ఒకటే రెండూ ఉల్లాసంలేక ఎంతో విసుగెత్తి నాకోసం ఎప్పుడు ప్రకాశిస్తాడు, దిండుగా మరి సూరీడు?
నా వయసులోని అమ్మాయిల్లాగ అబ్బాయిల్లాగ తెలుసుకుంటానా మరి ప్రేమంటే ఏమిటో? నా వయసులోని అమ్మాయిల్లాగ అబ్బాయిల్లాగ అనుకుంటున్నా ఎప్పుడు వస్తుండా ఆ రోజని ఆ కళ్ళల్లో కళ్ళుంచే, ఆ చేతిలో చేయుంచే గుండే నిండుగా ఆనందంగా, మర్నాడంటే భయంలేక నా గుండె దిగులుగా అసలు ఉండనే ఉండని రోజు నన్ను కూడా నిండుగా ప్రేమించే ఎవరో కలిగుండే రోజు
1962వ సంవత్సరంలో ఫ్రాన్సువాజ్ హార్డీ అనే గాయని పాడి విడుదల చేసిన “తూ లె గార్సోంజె లె ఫియ్ ద మోనాజ్” (నా వయసులోని అందరు అబ్బాయిలు అమ్మాయిలు) అన్న ఫ్రెంచిపాట ఇది. ఆ 60వ దశకంలో ఫ్రాన్సుదేశంలో వచ్చిన ఈ సంగీతాన్ని యే-యే సంగీతం అంటారు. పడుచు అమ్మాయిలు పాడిన ఈ యే-యే పాటలు అమెరికాదేశం నుండి వస్తున్న సంగీతపద్ధతులను, జావళీలను ఫ్రెంచిభాషలో ఫ్రెంచి సంస్కృతికి అన్వయించాయి. ఎందరో మంచి గాయనులు అప్పుడు వెలుగులోకి వచ్చినా, అందులో ఫ్రాన్సువాజ్ హార్డీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈమె ఎన్నెన్నో దశాబ్దాలుగా మధురమైన పాటలు ఆలపించి ఎందరో అభిమానులను చేగొంది.
ఓం వజ్రసత్వ సమయమనుపాలయ వజ్రసత్వత్వేన ఉపతిష్ఠదృఢో మే భవ సుతోష్యో మే భవ సుపోష్యో మే భవ అనురక్తో మే భవ సర్వసిద్ధిం మే ప్రయచ్ఛ సర్వకర్మసు మే చిత్తశ్రేయః కురు హూం హ హ హ హ హోః భగవాన్ సర్వతథాగత వజ్ర మా మే మూంచ వజ్రీ భవ మహాసమయసత్వ ఆః
సర్వకర్మసుచ మే చిత్తశ్రేయః కురు హూం హ హ హ హ హోః భగవాన్ సర్వతథాగత వజ్ర మా మే మూంచ వజ్రీ భవ మహాసమయసత్వ ఆః
తెలుగులో అన్వయం:
ఓం వజ్రసత్వ సమయమనుపాలయ ఓం వజ్రశక్తినిగలవాడా (ఇంద్రుడా) సాధకునికి దేవునికి మధ్యన గల యజ్ఞబంధమనే ఒప్పందాన్ని అనుపాలించు (పాటించు)
వజ్రసత్వత్వేన ఉపతిష్ఠదృఢో మే భవ నీ వజ్రశక్తినిగలిగిన తత్వంతో నాతో దృఢంగా కలిసివుండు
సుతోష్యో మే భవ నాయందు సంతుష్టుడై ఉండు
సుపోష్యో మే భవ నాయందు సుపోషకుడివై ఉండు
అనురక్తో మే భవ నాయందు అనురాగివై ఉండు
సర్వసిద్ధిం మే ప్రయచ్ఛ అన్ని సిద్ధులు నాకు కల్పించు
సర్వకర్మసు మే చిత్తశ్రేయః కురు అన్ని కర్మలయందు నాయందు శ్రేయస్సు (నిర్మలత్వము) కలిగిన చిత్తము (మనస్సు) కల్పించు
హూం హ హ హ హ హోః
భగవాన్ సర్వతథాగత వజ్ర మా మే మూంచ ఓ భగవంతుడా, అన్ని స్థితులయందు తఠస్థతతో నిండిన బౌద్ధతత్వం కల్పించు వజ్రతత్వముగలవాడా, నన్ను విడనాడకు
వజ్రీ భవ మహాసమయసత్వ యజ్ఞబంధమనే ఒప్పందము ద్వారా వజ్రతత్వము కలిగి నాకు ప్రత్యక్షమవ్వు
ఆః
సర్వకర్మసుచ మే చిత్తశ్రేయః కురు అన్ని కర్మలయందు నా చిత్తము నిర్మలముగా చేయి
హూం హ హ హ హ హోః
భగవాన్ సర్వతథాగత వజ్ర మా మే మూంచ భగవంతుడా, సర్వ తథాగత గుణంతో వజ్రతత్వం కలిగినవాడా, నన్ను విడనాడకు
వజ్రీ భవ మహాసమయసత్వ మహాసమయసత్వముతో (యజ్ఞబంధముని అనుసరించిన తత్వముతో) వజ్రతత్వముగలవాడై నన్ను అనుగ్రహించు
ఆః
చీనేయగాయని సా-డింగ్-డింగ్ 2007వ సంవత్సరంలో విడుదలచేసిన “వాన్వూషెంగ్” (జీవించి ఉండడం: ఆంగ్లంలో “ఎలైవ్”) అను సంగీతముద్రణలోని ఒక సంస్కృతశ్లోకం ఇది. ఈ శ్లోకం శతాక్షర వజ్రసత్వమంత్రం అను బహుప్రసిద్ధమైన బౌద్ధమంత్రం. దీనిని గానరూపంలో ఈమె పాడి అలరించింది. ఈ మంత్రంలో వజ్రతత్వంకలిగిన ఇంద్రుని అనుగ్రహం సాధకుడు అడుగుతున్నాడు. వజ్రం ఇంద్రుని ఆయుధం కదా. ధ్యానచింతనలో ఈ “వజ్రం” అంటే ప్రగాఢమైన జ్ఞానాన్ని మనసులోకి ప్రత్యక్షింపజేసే అంతర్దృష్టి. అజ్ఞానాన్ని ఛేదించి మనోపలకాలపైన దివ్యమైన కాంతిరూపంలోని జ్ఞానాన్ని మెరుపులా ప్రత్యక్షింపజేసేదే ఈ వజ్రాయుధం. బౌద్ధమతంలో ఈ వజ్రశక్తిని కలిగిన దేవతను వజ్రసత్త్వుడని పిలుస్తారు. తనని ఒక ఉత్కృష్ఠమైన బుద్ధావతారంగా కొలుస్తారు. అటువంటి దేవతను సాధకుడు యజ్ఞబంధం అనుసరించి, నిష్ఠగా ధ్యానంచేసిన భక్తునిపై కచ్చితంగా అనుగ్రహించు అను వేడుతున్నాడు. బౌద్ధమతంలో అత్యున్నత ధ్యానతత్వాన్ని “తథాగత” అంటారు. “తఠత” అంటే ఎట్లు ఉన్నదో తఠస్థంగా అట్లే మనసులో అంగీకరించడం అని, మనోవికారాలు ఏమీ లేకుండా అన్నింటిపైన వైరాగ్యంతో కూడిన నిర్మలతత్వంతో ఉండడం అన్నమాట. మరి “గత” అంటే కదులుతూ ఉండడం, ఈ స్థితి నిదానంగా ఉండేది కాదు. ఋతుక్రమంలో కదులుతూ సమయం ముందుకువెళ్తున్నా మనస్చిత్తం మాత్రం నిర్మలంగా అట్లే ఉంటూ కదలడం అన్నమాట. అందుకని బుద్ధుడిని “తథాగతుడు” అని కూడా పిలుస్తారు.
చీనేయగాయని పాడిన స్వరాలలో సహజంగానే సంస్కృతోచ్ఛారణలో అపస్వరాలు దొర్లుతాయి, కానీ వాటికి ఇబ్బందులు పడకుండా పాటని, అనుబంధమైన చిత్రికను ఆస్వాదించండి.
ఎడమచేయి భూమిని పట్టుంది కుడిచేయి ఆకాశాన్ని పట్టుంది నా అరచేతిరేఖలపై బద్దలయ్యింది అన్నివైపులా మెరుపులాడుతూ కాలమనే కెరటాన్ని ఏరుకుని సంవత్సరాలుగా ఇట్టే పూతపోసి మూడువేల జన్మలు సాంతం గడిచినా ఇంకా మనం కలుసుకోలేదన్నట్టుగా
ఎడమచేయి ఒక పువ్వుని త్రెంచింది కుడిచేయి ఒక ఖడ్గాన్ని ఆడించింది ఆ కనుబొమ్మలకి మధ్యన జారింది ఓ వేయి సంవత్సరాల మంచురేఖ ఒక అశ్రుబిందువు ఆహా ఆహా నేను అవతరించాను ఆహా ఆహా
ఎడమచేయి తాళం మ్రోగించింది కుడిచేయి వీణాస్వరాలని మీటింది మరుపు అనే ఓ మహానది జలాలపై ఒక నావ తేలుతూ వెళ్తోంది దుఃఖపులోతుల్లోనుండి కూడా ఒక అరుణపద్మం పుట్టగలదు ఆగవద్దు, నా మనసును కదుపు లోలోపల పెనవేసుకున్న భావాలని
ఎడమచేయి చంద్రునివైపుకు చూపిస్తోంది కుడిచేయి విధి యొక్క ఎర్రటిదారాలని చుడుతోంది మనం కోరుకున్న ప్రేమని దేవతలు నీకూ నాకూ వరమందించుగాక మిణుకులాడుతున్నా ఈ వెన్నెలలో ఆహా ఆహా నువ్వూనేనూ ఒకటై కలిసిపోగా ఆహా ఆహా
ఎడమచేయి ఒక ఈకలాగ మారింది కుడిచేయి ఒక చేపమొప్పులాగా కొన్ని జీవితాలు ఆకాశంలో మబ్బులవాటున కొన్ని జీవితాలు కారడవుల్లోని నీడలచాటున సంతోషంగా నిన్ను అనుసరిస్తాను ఒక చిన్నటి మట్టినలకలా మారుతాను ఈ మనుష్యలోకపు సంసారంలో అన్ని అంచులనా తేలుతూ సాగుతూ
ఎడమచేయి నిన్ను గట్టిగా పట్టుంది కుడిచేయి నిన్ను వదిలివేసి పోనిచ్చింది నా చేతులు గుప్పిట్లో బిగిస్తే నీ రూపం తిరిగి నా హృదయంలోకొస్తుంది ఒక సాంబ్రాణి ధూపంలా ఆహా ఆహా నువ్వూ నేను ఐక్యమయ్యాం అవిచ్ఛిన్నంగా అనంతంవరకూ
సా-డింగ్-డింగ్ అను చీనేయ గాయని పాడిన “జువోషు జీ యువే” (ఎడమచేయి చంద్రునివైపుకి) అన్న ఈ పాట “షియాంగ్మీ చెంచెన్ జిన్రూ షువాంగ్” (ప్రేమయొక్క భస్మాలు) (ఆంగ్లంలో: ఏషెస్ ఆఫ్ లవ్) అనే చీనాదేశపు టివీ కథా కార్యక్రమంలో ప్రచురిచతమయ్యింది. ఈ కథలో అమరలోకంలో ఒక దేవతాకన్యగా జన్మించిన జిన్మీ అనే పూలదేవతకి షుఫెంగ్ అను ఒక అగ్నిదేవతాకుమారునికి మధ్యన ప్రణయగాథ నడుస్తుంది. పదివేల ఏళ్ళవరకూ ఈ ఇద్దరూ అనేకానాక ఘట్టాల నడుమ ప్రేమని ఐక్యంచేసుకోలేకపోతారు. వివిధ దేవదానవమానవరూపాలలో జన్మనెత్తుతారు. చివరికి విధినిక్షేపితమైన ప్రేమని అందుకొని ఐక్యం అవగలుగుతారు. మన భారతదేశపు సంస్కృతివలనే చీనా సంస్కృతిలో కూడా ప్రాకృతికదేవతా ప్రభావం, కర్మసిద్ధాంతము, జన్మ-పునర్జన్మలతో నిండిన సంసారము, అంతిమంగా మోక్షసాధన .. వీటన్నింటిపైనా నమ్మకాలు ఉన్నాయి. ఇటువంటి పోలికలు అనాదికాలం నుండీ ఈ రెండు సంస్కృతులలోనూ ఉన్నా, బౌద్ధమతం చీనాలో వ్యాపించిన తరువాత అనేక భారతీయ సాంస్కృతిక చిహ్నాలు కూడా అక్కడ నెలకొన్నాయి.
చంద్రుడు అనగా అమరత్వానికి, మోక్షప్రదమైన పరమానందానికి చిహ్నం. ఈ చిహ్నం చీనా సంస్కృతిలో ఉన్నట్టే, మన భారతదేశంలో కూడా ఉంది (సోమరూపంలో చంద్రుడిని చూసినప్పుడు). మన భారతదేశం యొక్క అసలు పేరు “ఇందు” అని, ఈ పేరు కొన్నిచోట్ల పలకలేక “హిందు” అంటారని, కానీ ఈ అసలు పేరు యొక్క అర్థం “చంద్రుడు” అని షువెన్ ఝాంగ్ (హ్యువెన్ త్సాంగ్) అను భారతదేశంలో పన్నెండేళ్లు గడిపిన చీనా బౌద్ధయాత్రికుడు పేర్కొన్నాడు. ఈ “ఇందు” అన్న పదం వైదికక్రతువులలో సోమరసం పట్టే యూపపాత్ర ద్వారా వచ్చిందని కొందరి విజ్ఞుల అభిప్రాయం. ఈ వైదిక యజ్ఞం ద్వారా ఆకాశంలో నక్షత్రాల గమనాన్ని లెక్కించి, సంవత్సరంలో తిరిగి కాలం పునరారంభం అయ్యే నూతన యుగాది ఘడియను మన జ్యోతిషశాస్త్రం గణిస్తుంది. ఇటువంటి ఖగోళ పరిశీలనలు, నక్షత్రాలు గ్రహాల యొక్క చలనకక్ష్యావిశేషాలు భారతీయశాస్త్రజ్ఞులు అనాదికాలం నుండి గణిస్తూవున్నారు. ఈ నక్షత్రపరిశీలనము కాలగణనము ద్వారానే వ్యవసాయవృత్తిని నడుపుకుని ఆర్థికవృద్ధిని సాధించడము నావికా అన్వేషణం ద్వారా వ్యాపారార్జన చెయ్యడము సాధ్యమయ్యింది. అదే భారతీయ సంస్కృతి, అందువలన “ఇందు” (అనగా చంద్రుని గమన గణనం) మన దేశానికి పేరునే ఇచ్చిపెట్టింది. చీనేయులు మనుష్యులు ఎంతో పుణ్యం సంపాదించిన తరువాతే భారతదేశంలో మానవజన్మనెత్తుతారని, ఈ “ఇందు” దేశం అమరలోకమైన స్వర్గం తరువాత అత్యున్నతమైన లోకమని నమ్మేవారు. ఈ నమ్మకాలు ఇటివలి శతాబ్దాలలో మనదేశం పరాయిపాలనలో బానిసత్వంపాలైన తరువాత లేచిపోయాయనుకోండి, అది వేరే విషయం. పై పాటలో “చంద్రుడు” అని వర్ణించిన చోట వెనుక మోక్షసాధన అన్న అర్థం ఉందని మాత్రం మనం గమనించాలి.
సా-డింగ్-డింగ్ అను చీనేయగాయని పాడిన అనేక పాటలు అక్కడ మహత్ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈమె ఒక సంస్కృతశ్లోకాన్ని కూడా పాటగా మునుపు పాడింది. ఆ పాట రేపు అనువదిస్తాను.
ఈ క్రింద చిత్రికలో టివీ కార్యక్రమంలోని కథలోని కొన్ని అంశాలను ఒక అభిమాని గ్రహించి పాటకు తోడుగా పెట్టాడు. అది కూడా చూడండి.
చీనాభాషను ఇతరదేశాలవాళ్లు పలకడానికి వీలుగా రోమకలిపిని ఆధారంచేసుకుని పిన్యిన్ అను లిపి ఉపయోగిస్తారు. ఆ లిపిలో ఈ పాట సాహిత్యం క్రింద చూడవచ్చు. రోమకలిపిని వారి భాషకి అనుగుణంగా మలుచుకుని, గుణింతాలని పోలిన వివిధ సుడికారాలను ఏర్పరుచుకున్నారు. మన భారతీయభాషలలో కూడా అంతర్జాతీయ సంస్కృతలీపీకరణం (ఐ.ఏ.ఎస్.టి) అను ఒక రోమకలిపి ఉన్నది. ఆ సుడికారాలను (ఏక్సెంట్) మనం తరుచుగా వినియోగించుకుంటే మన భాషలలోని పదాలకు కూడా ఆంగ్లంలో వ్రాసినప్పుడు సందిగ్ధం ఉండదు. దురదృష్టవశాత్తూ భారతీయులు ఈ లిపిని వినియోగించక, మూర్ఖులైన ఆంగ్లేయులు మనపై రుద్దిన బండలిపి అయిన ఆంగ్లలిపిలోనే మనుష్యుల నగరాల పేర్లను వ్రాస్తున్నాము. చీనా మొదలైన అనేక దేశాలవలనే మనం కూడా మనకు సమ్మతమైన రోమకలిపిని త్వరలోనే వినియోగించుకుంటామని నా ఆశ.
అరుగునీడలో సేదతీరుతుండగా మధురమైనక్షణంలో.. నువ్వూనేను ఇద్దరు వ్యక్తులు ఇద్దరి ముఖాలు, కానీ ఒకటే మనసు.. నువ్వూనేను మాయావ్యామోహాలనుండి విముక్తులై బ్రహ్మానందంతో.. నువ్వూనేను నువ్వూనేను, ఈ రెండిటీ అవతల పరమానందంలో ఐక్యమయ్యాము
ఫార్సీ భాషలోని “మన్ ఓ తో” (నువ్వూనేను) అను ఈ కవిత ఎలెక్ట్రానిక్ సంగీతంతో మేళవించి అనూష్ అరాష్ అను ఇద్దరు పారసీక (ఫార్సీ) యువకులు జర్మనీలోని బెర్లిన్ నగరంలో విడుదల చేశారు. ఈ ముద్రణ “ను” అన్ డీజే సంగీతం సమకూర్చగా బెర్లిన్ నగరంలోను, ఆపై ప్రపంచవ్యాప్తంగాను విపరీతమైన ప్రాచుర్యం పొందింది. ఎలెక్ట్రానిక్ సంగీతంపై మమకారంతో ఇరాన్ దేశంలో ప్రభుత్వం చేస్తున్న కట్టడిని తట్టుకోలేక తెగించి దేశం విడిచి జర్మనీకి పలాయనం చేశారు ఈ యువకులు. ఈ కవిత సాహిత్యం ముందుగా ఇరానుదేశపు కవి జలాలుద్దీన్ రూమీ రచించాడట. అతని “దివాన్-ఎ-షంస్” అను కవితాసంపుటినుండి స్వీకృతమయ్యింది. ఈ రూమీ సూఫీ సాహిత్యం విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చిన విషయం అందరికీ విదితమే.
పూర్తి కవితను క్రింద అనువదించుతున్నాను.
అరుగునీడలో సేదతీరుతుండగా మధురమైనక్షణంలో.. నువ్వూనేను ఇద్దరు వ్యక్తులు ఇద్దరి ముఖాలు, కానీ ఒకటే మనసు.. నువ్వూనేను తోటలోని సడి పక్షుల కిలకిల మనకి ప్రాణం నింపుతున్నాయి ఇలా ఈ తోటలోకి అడుగిడగా.. నువ్వూనేను ఆకాశంలో నక్షత్రాలు వస్తున్నాయి, మనల్ని చూద్దామని వారికి ప్రేమబింబమైన చంద్రుడిని చూపిస్తున్నాం.. నువ్వూనేను నువ్వూనేను, ఈ రెండిటీ అవతల పరమానందంలో ఐక్యమయ్యాము మాయావ్యామోహాలనుండి విముక్తులై బ్రహ్మానందంతో.. నువ్వూనేను స్వర్గంలో చిలుకలన్నీ పలకడం మొదలుపెట్టాయి ఈ విధంగా మనం ఒకరితోఒకరు కలిసి నవ్వుతుండగా దానికన్నా విలువైనది నువ్వూనేను ఈ ఏకాంతపు చోట ఒకే క్షణంలో ఇరాక్ లోను ఖొరాసాన్ లోను.. నువ్వూనేను ఇలా ఈ భూమిపై ఈ వ్యక్తిరూపంలో ఉన్నాము, ప్రతివ్యక్తిరూపంలోనూ అనంతమైన స్వర్గంలో ఆనందం నిండిన తలంలో.. నువ్వూనేను
మారో, క్రోకీనామామయ్య కూతురా, మొదటిచూపులోనే మనసిచ్చాను నీకు చెప్పు మరి, నువ్వు లేకుండా ఆనందంగా ఎలా ఉండగలను నేను ఓయి, దుగ్లి దగ్లి దలాలో, పిల్లా, నువ్వూనేను దుగ్లి దగ్లి దలాలో, నా సూరీడూ, నిన్ను ప్రేమిస్తున్నానే
నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమిస్తున్నావు, ఇంక ఇక్కడెలా ఉండేది మనము? పద పోదాం తిబిలీసీకి, అక్కడ కాలేజీకి పోయి చదువుకుందాం ఓయి, దుగ్లి దగ్లి దలాలో, పిల్లా, నువ్వూనేను దుగ్లి దగ్లి దలాలో, నా సూరీడూ, నిన్ను ప్రేమిస్తున్నానే
తిబిలీసీకొచ్చాక, అక్కడొక వాటా అద్దెకి తీసుకుందాం ఎన్నెన్నో జోళ్ళు జిగేళుమనే గాజు దీపాలు కొనుక్కుందాం ఓయి, దుగ్లి దగ్లి దలాలో, పిల్లా, నువ్వూనేను దుగ్లి దగ్లి దలాలో, నా సూరీడూ, నిన్ను ప్రేమిస్తున్నానే
నువ్వు కాలేజీకి పోతే, నేను ఇంటిదగ్గరుంటా సాయంత్రంపూట ప్లెఖానోవ్స్కీ పార్కులో సరదాగా నడుద్దాం ఓయి, దుగ్లి దగ్లి దలాలో, పిల్లా, నువ్వూనేను దుగ్లి దగ్లి దలాలో, నా సూరీడూ, నిన్ను ప్రేమిస్తున్నానే
జార్జియాదేశానికి చెందిన జానపదగీతం “ఎర్తీ నఖ్విత్” (మొదటిచూపులోనే ప్రేమించాను) అన్న పాట ఇది. ఈ పాట పైన వాయించింది చ్వేనేబురేబి అను సంగీతబృందం. చిత్రిక మధ్యలో వచ్చిన అమ్మాయి “త్రియో మందిలి” అనే వేరొక గాయనీబృందంలో ఒకతె. ఈ గాయనీబృందం కూడా ఈ పాటను ఆలపించారు. క్రింద చూడండి. త్రియో మందిలి బృందం పాడిన మరికొన్ని పాటలను నిన్న అనువదించాను.
జార్జియా సంస్కృతిలో చర్చిలో అందరూకలిపి బృందగానం పాడడం ఆనవాయితీ. క్రైస్తవసన్యాసుల మఠాలలో ఈ సంయుక్తగానం పాడే సంస్కృతి మొదలయ్యింది. ఇదే సంస్కృతి జానపదులలో కూడా వ్యాప్తిచెందింది.
ఆకాశంచూడు అపారేకా, చంద్రుడు ఎలుగుదాటులోవపైన నించున్నాడు ఎందుకు నన్ను ఆ నల్లటి కళ్ళతో చూస్తున్నావు, పిల్లా? అటకపైకి నిన్ను వెంబడించేటట్టు చేస్తున్నావెందుకు? ఈరోజు నేను నీ పిల్లగాడినవుతాను రాత్రంతా సరసమైన కబుర్లు చెబుతూ గడుపుదాము నా బుర్రపాడుచెయ్యాలని చూడకు పిల్లా వదిలెయ్యి, విను చెప్పేది
రాత్రిపూట ఆకాశం చుక్కలతో నిండిన కంబళీలా ఉంది చంద్రుడు కొండల్లో ఎలుగుదాటులోవపైకి పోతున్నాడు ఎక్కడున్నావు పిల్లోడా, నువ్వు కనపడట్లేదు మరి నీ పిల్లదానికోసం నువ్వు వేచిచూస్తే బాగుండేది రాత్రంతా వారి కబుర్లతో గడిచింది మంచు కురిసిన ప్రొద్దుగూకింది.
ఈ ప్రొద్దుటకి ఒక గుక్క అరాకీ బావుంటుంది సరైన పానీయమున్న ఒక సీసా పిల్లది ఆ సీసా అరాకీ తెచ్చింది ప్రొద్దుటకాస్తా మధ్యాహ్నం అయ్యింది పిల్లవాడు పానీయమంతా ఓ కొమ్ములో పోసుకుని త్రాగాడు చిలిపినవ్వు నవ్వాడు
ఆ పిల్ల తనకి భోజనంపెట్టి తలవంచింది “మరి చెప్పు ఖెసుర్వేతిలో జనాల గురించి” అని అడిగింది తాగిన పానీయం తన బుర్రకి మత్తుపట్టించింది ఆ పిల్ల తన పక్కన కూర్చిని ఉంది “ఓ ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, దేవుడు కోపగించుకుంటాడు” సిగ్గుపడి కుర్రవాడు మొహంపై తెల్లబారాడు ఎలుగుదాటులోవపైకి ప్రయాణంకట్టాడు ఖఖ్మాతీ ఊరికి బయలుదేరాడు
అపారేకా అంటే జార్జియా దేశంలో ఒక మగవాడి పేరు. ఈ జానపదగీతం అపారేకా అనే కుర్రవాడు ప్రయాణంలో ఉండగా ఒకచోట ఆగి, అక్కడ స్నేహితురాలిని కలుసుకుని, రాత్రంతా సరసమైన కబుర్లు చెప్పినవైనం వివరిస్తోంది. పిల్లవాడికి అమ్మాయిపై మనసుపుట్టినా, సిగ్గుపడి ముందడుగు వెయ్యడు. ఈ యువతీయువకుల నిర్మలమైన ప్రేమవిశేషాలని ఈ పాటలో అలా కథలా చెప్పారు. పాట పాడింది “త్రియో మాందీలీ”అను ఒక గాయనీబృందం. ఈ అమ్మాయిలు సరదాగా వారి ఊరిప్రక్కన పాడుతూ ఈ పాటను యూట్యూబులో విడుదలచేసిన తరువాత విపరీతంగా ప్రాచుర్యంలోకి వచ్చారు. జార్జియాదేశపు టివీలో కూడా వీరు ఈ పాటను ఆలపించారు. పాందూరీ అను తంత్రీవాయిద్యాన్ని మీటుతూ, గళంకలిపి పాటను పాడుతూ జానపదగేయాల కమ్మదనం చూపుతున్నారు.
ఓ సుందరీ సుందరీ, నేను చుట్టూ అంతా తిరుగుతున్నాను నాకవి మనశ్శాంతినివ్వట్లేదు, కనికరించట్లేదు దహించే నీ కళ్ళు, నీ కళ్ళు నాకవి మనశ్శాంతినివ్వట్లేదు, కనికరించట్లేదు దహించే నీ కళ్ళు, నీ కళ్ళు
సుందరీ, నీ గుండె రాతైవుండవచ్చు నన్నెందుకు వేదిస్తున్నావు? పశ్చాత్తాపం లేదా? నేను కూడా, దహించే అగ్ని కప్పెడుతోంది నన్ను నీ కళ్ళదే పూచీ, నీ కళ్ళు నాకవి మనశ్శాంతినివ్వట్లేదు, కనికరించట్లేదు దహించే నీ కళ్ళు, నీ కళ్ళు
నా తలపులు నీకు అందవు, నా పలుకులు నీకు అందవు, దూరంగా ఉన్నావు నేనీ ప్రపంచం ఇలా వదలాలనుకోవట్లేదు నేనెంతగా నిన్ను ప్రేమిస్తున్నానో నీకు తెలియకుండా ఎంతగా, ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నానో!
ఓ సుందరీ సుందరీ, నేను చుట్టూ అంతా తిరుగుతున్నాను నాకవి మనశ్శాంతినివ్వట్లేదు, కనికరించట్లేదు దహించే నీ కళ్ళు, నీ కళ్ళు నాకవి మనశ్శాంతినివ్వట్లేదు, కనికరించట్లేదు దహించే నీ కళ్ళు, నీ కళ్ళు
“అఖ్ తుర్పావ్ తుర్పావ్” అనే ఈ జార్జియాదేశపు జానపదగీతాన్ని పాడింది “త్రియో మందిలీ”అనే గాయనీబృందం. ఈ ముగ్గురు అమ్మాయిలు యూట్యూబులో పందూరి అనే వాయిద్యసహితంగా జానపదగీతాలను ఆలపించి ఎందరో అభిమానులను చేగొన్నారు.
ఎటునుండి వీస్తే ఏమిటి గాలి మా ఇంట్లో ఆహ్లాదం తెస్తోంది ఎటునుండి వీస్తే ఏమిటి గాలి మా ఇంట్లో ఆహ్లాదం తెస్తోంది
యువెన్ గ్వెర్నిగ్ అను బ్రెతాజ్ఞ్ గాయకుడు బ్రయిఝ్ భాషలోపాడిన “ఏ క్రైజ్ అన్ నోజ్” అను జానపదగీతం ఇది. ఫ్రాన్సుదేశానికి వాయువ్యదిశలో ఉన్న బ్రెతాజ్ఞ్ ప్రాంతంలో సముద్రపుగాలి విపరీతంగా వీస్తూ ఊలవేస్తూ ఉంటుంది. రాత్రిపూట కిటికీలకు వారగా ఇలా గాలి ఊలవెయ్యడం సహజంగా వినపడుతూ ఉంటుంది. నేను బ్రెతాజ్ఞ్ ప్రాంతంలో నివశించిన రోజుల్లో చాలా గాఢమైన జ్ఞాపకం అది. అక్కడి ప్రజలకు గాలితోను, సముద్రంతోను అతిదగ్గర సంబంధం ఉంటుంది. ఈ జానపదగీతం అది నెమరువేసుకుంటూ, గాలి ప్రజలకి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు తేవాలని చెబుతోంది.పాట