కాశ్మీరు కాదు, కాశ్మీరీలు మన సంపద

“దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్”, అన్నాడు మహాకవి గుఱజాడ. ఈ మహాసత్యం గుర్తుచేసుకుని ఆచరిద్దాం. కాశ్మీరులో జరుగుతున్న అత్యాచారాలకు స్వస్తి చెబుదాం. అక్కడి మన సోదరులకి సరైన గౌరవం ఇద్దాం.

ఏమిటి మనకి కాశ్మీర్ భూమిపై ఉన్న హక్కు ? అక్కడే పుట్టి, బ్రతుకుతున్న కాశ్మీరీలకంటే ఎక్కువ హక్కు ఉందా మనకి ? వాళ్ళకి కావలసింది ఏమిటొ వాళ్ళు నిర్ణయించుకుంటారు. అక్కడికి సైనికులని పంపి, కర్ఫ్యూలని పెట్టి, వాళ్ళ ముక్కు పిండి మనం ఏమి సాధించాలి ? ఇదా మన భారత ప్రజాస్వామ్యం ?

అరవై ఏళ్ళుగా సగం భూమి భారత్ లో సగం భూమి పాకిస్తానులో వుండి కుటుంబాలు చెల్లాచెదురయ్యి వాళ్ళు ఏడుస్తుంటే ఎప్పుడు పట్టించుకున్నాం మనం ?

సొంత గొప్ప చెప్పుకోవడం తప్ప అసలు కాశ్మీరులో ఒక్కసారైనా నిఖార్సైన ప్రజాస్వామ్యం ఏర్పాటు చేసామా ?

ఇప్పుడు అక్కడ టీవీ చానెళ్ళు బందు చేసారు. రేపు ఇంటర్నెట్టు బందు చేస్తారు. ఎవ్వరికి కావాలి కాశ్మీరీల గోడు ?

మన తప్పుని మర్యాదగా ఒప్పుకుని, సరిచేసుకుందాం. లేకపొతే, యుగోస్లావియా దేశం వలే మనదేశం ముక్కచెక్కలయ్యిపోతుంది. మారణహోమం జరిగి లక్షలకొద్ది ప్రజలు చస్తారు. న్యూక్లియర్ యుద్ధం జరగవచ్చు. మూర్ఖత్వం వీడకపోతే అమూల్యమైన మన సంస్కృతిలో ఇక మిగిలేది ఏమీ ఉండదు.

మన భారతదేశం ఒక సంధి దశలో ఉంది. మన భవిష్యత్తు రక్షించుకోవాలంటే మనం కొంత తెలివిగా ఆలోచించి మార్గాలు వెతుక్కోవాలి.

10 responses to “కాశ్మీరు కాదు, కాశ్మీరీలు మన సంపద

  1. ముందు మాకు ప్రత్యేక తెలుగు దేశం ఇవ్వండి

    అంతకంటే ముందు ప్రత్యేక తెలంగాణా దేశం ఇవ్వండి.

    తరువాత ఆలోచిద్దాం వాళ్ల సంగతి.

  2. మరి ప్రత్యేక మహబూబ్‌నగర్ దేశమో?………. తరువాతే తెలంగాణా.

  3. “అక్కడే పుట్టి, బ్రతుకుతున్న కాశ్మీరీలకంటే ఎక్కువ హక్కు ఉందా మనకి ? ” – ఇక్కడ మనమంటే ఎవరు?

  4. చావా కిరణ్ గారు, మురళి గారు :

    ఆంధ్ర ప్రదేశ్ సగం ఇండియా లోను, సగం పాకిస్తాను లోను లేదు. బంధువుల మధ్య అడ్డుగోడలు లేవు. ఏడాదికి 200 రోజులు కర్ఫ్యూ లేదు. లక్షల మంది ప్రజలు ఎంకౌంటర్లు, లాకప్ డెత్ కాలేదు.

    కాశ్మీరీలకి ఇండియా అంటే ఎందుకు లవ్వు లేదో అర్థం చేసుకోవడం చాలా సుళువు.

    అయినా, ఆంధ్ర ప్రదేశ్ కి ఏమి కావాలో ఇక్కడి ప్రజలు నిర్ణయించుకుంటారు. అలాగే, కాశ్మీరుకి ఏమి కావాలో అక్కడి ప్రజలు నిర్ణయించుకుంటారు. ఇది మానవ హక్కు. మీ వాదన ఎలాగ ఉంది అంటే “నువ్వంటే నాకిష్టం కాబట్టి, నేనంటే నువ్వు కూడా ఇష్టపడాలి”, అని బలవంతంగా ఒక అమ్మాయిని లొంగదీసుకోవాలన్నట్టు ఉంది.

    చదువరి గారు :

    “మనం” అంటే మిగతా భారతీయులు అని నా ఉద్దేశ్యం..

    కాశ్మీరమే కాదు, భారత్ అంతా అధికార వికేంద్రీకరణ జరగాలి అని నా అభిమతం. నా ఇంగ్లీషు బ్లాగులో దీనిపై మరింతగా వివరించాను.

    యూరోపియన్ యూనియన్ వలే ఇండియన్ యూనియన్ కూడా వికేంద్రీకృతమై ఉండాలి.

  5. సినిమాల్లో పెద్ద టెండరు – విలను – సీను గుర్తుకొస్తోంది. అందులో నిజంగా పార్టిసిపేట్ చెయ్యాల్సిన వాళ్ళనందరినీ విలను బెదిరించో – చంపో టెండరు వెయ్యనివ్వడన్నమాట. అప్పుడు కలెక్టరు లేచి – విలనుకి వర్క్ ఆర్డరు ఇస్తాడన్నమాట.
    అక్కడ ఉన్నది భారతదేశంలో ఉండడానికి ఇష్టపడని కొందరు వేర్పాటువాదులే కాదండి. అంతకుమించి భారతదేశంలో ఉందామనుకున్న చాలామంది జాతీయవాదులు ఉన్నారు. వాళ్ళ గొంతు మీకు వినపడటం లేదు కాబోలు. ఇంటిలో పది మంది ఉంటే – 7 గురు కలిసి ఉందామని అంటూ,ముగ్గురు విడిపోదామని అన్నారు – సరే అని ఆ ఏడుగురిలో నలుగురిని చంపేసి – ఇప్పుడు విడిపోదాం అని అంటే అది న్యాయమా!
    ఆంధ్రప్రదేశ్ కి ఏమి కావాలో ఇక్కడి ప్రజలు నిర్ణయించుకుంటారు.కృష్ణా జిల్లాకి ఏమి కావాలో జిల్లా ప్రజలు నిర్ణయించుకుంటారు. విజయవాడకి ఏమి కావాలో ఆ ప్రజలు నిర్ణయించుకుంటారు. గవర్నరుపేటకి ఏమి కావాలో ఆ ప్రజలు నిర్ణయించుకుంటారు. రెండోవీధికి ఏమికావాలో ఆ ప్రజలు నిర్ణయించుకుంటారు. మూడో ఇంటికి ఏమికావాలో ఆ ప్రజలు నిర్ణయించుకుంటారు. అందులో నాకేమి కావాలో నేను నిర్ణయించుకుంటాను. నాకు నా స్వతంత్ర దేశం కావాలి. – ఇలా అంటే కుదరదండి.
    ప్రతీ స్థాయిలో కొంత స్వతంత్రం, కొంత బాధ్యత ఉంటేనే సమాజం బట్టకడుతుంది సార్. హాస్యంగా చెప్పాలని ప్రయత్నించాను. మిమ్మల్ని కించపరచడం నా ఉద్దేశ్యం కాదు.

  6. అందుకోసం పరిశీలనాత్మకత కలిగిన భాద్యతయుతమయిన పౌరులు …దానికి తగ్గ ఖటిన కార్యాచరణ ప్రణాళిక రావాలి …. దాన్ని ఆమోదించే సాహసం కలిగిన ప్రజానాయకులు .. (రాజకీయ నాయకులు కారు)… ఇలా లెక్కలేసుకుంటే పోతే ఒక పెద్ద సామజిక ఫిక్షన్ అవుతుంది …..

    ఆలోచించగలరు …

    మరోక్కసారి … అక్కడ జరుగుతుంది భూవివాదం కాదు … మత చాందసం ..భూ వివాదం ఒక పేరు మాత్రమే …. ..ఒక్కసారి మీరు నా అభిప్రాయ ప్రామణికత సరిచూసుకోవాలంటే సల్మాన్ రష్దీ గారీ రచనలు చూడండి …

    ఇక పొతే …. వేరుకుంపటి అనేదాన్ని సమర్ధించటం అంటే … (మన సమాజ పరిస్థితి ద్రుష్ట్య …) శిక్షణ ఇవ్వని సింహం నోట్లో తల దూర్చినట్టే …

  7. కిరణ్: కానీ కాశ్మీరులో ఒక మతాన్ని తుడిచేసారు (ఎథ్నిక్ క్లెన్సింగ్). మూడున్నర లక్షల మంది (ఇది కనీస మాత్రపు అంచనా అట!) ముస్లిమేతరులను రాష్ట్రపు పొలిమేరల నుండి పారద్రోలాకే, అది ముస్లిములు మాత్రమే ఉండే రాష్ట్రమైంది. వాళ్ళకు స్వయం నిర్ణయాధికారాన్ని ఇచ్చేముందు, పారిపోయిన ఆ అభాగ్యులను వెనక్కి, వాళ్ళ స్వస్థలాలకు పంపించాలా అక్కర్లేదా చెప్పండి.

    కాశ్మీరుల్లో ఇప్పుడుంటున్న వాళ్ళ బాధలు గమనించాలి, నిజమే. కానీ వాళ్ళు వెళ్ళగొట్టగా ఢిల్లీ, హర్యానా, పంజాబు, ఉత్తరప్రదేశ్ మొదలైన చోట్లకు పారిపోయి, దుర్భర దారిద్ర్యాన్ని (పాపం అడుక్కుంటూ జీవిస్తున్నారు వాళ్ళు) అనుభవిస్తున్న మిగతా కాశ్మీరీలను గురించి కూడా అలోచిద్దాం.

  8. కృష్ణమోహన్ గారు

    కాశ్మీర్లో ఎంతమంది వేర్పాటువాదులో, ఎంతమంది జాతీయవాదులో మనకి ఏమన్నా తెలుసా ? వాళ్ళని ఒక్కసారన్నా అడిగామా ? ఈ రిఫరెణ్డం పెట్టండి మొర్రో అని వాళ్ళు మొత్తుకుంటుంటే మనం ఎందుకు పెట్టలేదు ? నిజం మనకి తెలుసు : అందరూ తీవ్రవాదులు కాకపోవచ్చు, కానీ అక్కడ చాలా స్వేచ్ఛ కోరుకుంటున్నారు. ఈ స్వేచ్ఛ రాజకీయ స్వాతంత్ర్యం కాకపోవచ్చు, కానీ ఒక పద్ధతైన అటానమీ అయినా అవసరం.

    ప్రతి మనిషి సర్వ స్వతంత్రుడిగా ఉండటమే మన ఆధునిక ప్రజాస్వామ్య ఆశయం. మహాత్మా గాంధీ కల ప్రతి గ్రామం సర్వ సంపత్తిగా స్వాతంత్ర్యంగా ఉండగలగాలని. గ్రామ పంచాయతీకి అన్నింటికన్నా ఎక్కువ అధికారాలు ఉండాలి. అప్పుడే పౌరులు ప్రజాస్వామ్యంలో పాల్గొనగలరు. మన రాష్ట్ర/దేశ ప్రభుత్వాలు ఈ అధికారాలని అన్నింటినీ తగ్గించివేసాయి.

    చదువరి గారు

    కాశ్మీర్ పండితుల సమస్య చాలా జటిలమైనది. వీళ్ళు కాశ్మీర్లో తిరిగి అడుగుపెట్టాలని అక్కడి ముస్లింలలో చాలా మంది కోరుకుంటున్నారు (వేర్పాటువాదులే తిరిగిరమ్మని అడుగుతున్నారు). ఈ పండితుల సమస్యని కాశ్మీర్ స్వయం అధికారానికి ముడిపెట్టడం సరైనది కాదు. కాశ్మీర్లో ఇస్లాం చాలా మృధువైనది. సూఫీ యోగుల ఆదర్శాలతో మిళితమైనది. మన భారతదేశ విధానాలు ముస్లింలలో తీవ్రవాదం పెంచుతున్నాయి – ఇది చాలా ప్రమాదకరం.

    చంద్రమౌళి గారు

    కాశ్మీర్లో ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారో తెలుసుకోవడానికి మనం కాశ్మీరు వెళ్ళాలి. ఇక్కడి నుండి తెలుసుకోలేము. ముందు వారికి సరైన సమాచార సాధనాలు కల్పించాలి (టివీలు, ఇంటర్నెట్టు ..) వారి ప్రజలతో తరుచుగా మాట్లాడాలి. అక్కడ కర్ఫ్యూ పెట్టి, సైనికులతో నిర్బంధించి (ప్రతి 5 కాశ్మీరీలకు 1 భారత సైనికుడు కాపలాగా పనిచేస్తున్నాడు ప్రస్తుతం) పబ్బం గడుపుకోలేము.

    ఈ బ్లాగును చదవండి. కోషుర్ అని ఈయన కాశ్మీరీల బ్లాగులను సంకలనం చేస్తున్నాడు. అక్కడి నాయకులు (ఒమర్ అబ్దుల్లా, తన్వీర్ సాదిక్ ..) స్వయంగా బ్లాగులను వ్రాస్తున్నారు. చదివి ప్రత్యక్షంగా వాళ్ళ మాటలు విందాం.

  9. పింగుబ్యాకు: పొద్దు » Blog Archive » ఆగష్టు నెల బ్లాగ్వీక్షణం

  10. Oh, Hi
    Can you tell me what is your font?
    southeast of Asia?
    good luck

Leave a reply to Reza స్పందనను రద్దుచేయి