తేనెటీగల ఝమ్ నాదాన్ని ముస్తాబుగా సంబరం చేస్తూ చిన్నపిల్లలు ఆడి పాడే ఈ పాటను జర్మనభాషలో తరుచుగా పాడుకుంటారు. అదే సడితో తెలుగులో కృతి చేసాను, మీకు చిన్న పిల్లలుంటే పాడి ఆడించండి. 😀
గత సంవత్సరం నుండి కేంద్రప్రభుత్వం వారి చొరవ వలన వివిధ వృత్తివిద్యలను భారతీయభాషలలో విద్యార్థులకు అందించాలని గొప్ప ఉద్యమం మొదలైనది. బెనారస హైందవ విశ్వవిద్యాలయం వంటి కొన్ని ఉన్నతవిద్యాసంస్థలు సాహసాత్మకంగా యంత్రనిర్మాణ (ఇంజనీరింగ్) విద్యావిభాగాలను హిందీ భాషలో అందించడానికి మొదటి అడుగు వేసాయి. వృత్తివిద్యలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను అనువదించడము, క్రొత్త పుస్తకాలను భారతీయభాషలలో రచించడము, ఉపన్యాసాలను చిత్రికామాధ్యమంగా అభిలేఖించడము ఇత్యాది కార్యవిశేషాలను కేంద్రీకృతముగా నడుపుటకు, భారతీయభాషామాధ్యమంలో విద్యాబోధనను అభివృద్ధి చేయుటకు క్రొత్త క్రొత్త ప్రభుత్వసంస్థలు ఏర్పడ్డాయి. ఈ ఉద్యమం అతి ఆలస్యముగా మొదలైనను, భాషాస్థిత్వానికి కొసంతన్నా రక్షణగా ఇలా ఒక్క క్రొత్త ఆశ చిగురించింది. మన ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వము వారు కొన్నేళ్ల క్రిందటనే తెలుగుమాధ్యమానికి పూర్తిగా పాడి కట్టాలని యోచన తలపెట్టారు. దానితో పోలిస్తే ఈ భారతీయభాషామాధ్యమం యొక్క చిగురాకులు భాషాభిమానులకు రవ్వంత స్వాంతనము కలుగజేసేవే!
గత వారంలో ఈ భాషోద్యమంలో భాగంగానే మధ్యప్రదేశ రాష్ట్రంలో వైద్యవిద్యలను కూడా హిందీభాషలో అందించుటకు అక్కడి ప్రభుత్వము నడుము కట్టింది. త్వరలోనే వైద్యవిద్యాగ్రంథాలను బోధనాసామగ్రిని హింద్యాది భారతీయభాషలలో అనువదించుటకై కేంద్రప్రభుత్వము నుండి ఉత్తరువులు ఇవ్వబడినవి. ఈ ఉద్యమానికి ప్రజాబాహుళ్యం నుండి అభినందనలు ఆశీస్సులు లభిస్తున్నా, కొన్ని వర్గాల నుండి మాత్రము విపరీతమైన విమర్శలు, నోతివిరుపులు తప్పుట లేదు. ఈ వ్యాసంలో ఈ విమర్శలకు ప్రత్యుత్తరమిచ్చి భారతీయభాషామాధ్యమంలో విద్యాబోధన యొక్క భవిష్యత్తు ఎలా ఎదగగలదో వివరిస్తాను.
మన చేపట్టిన పనిముట్లవలే మనము రూపొందుతాము. ముందుగా మనము మన పనిముట్లను మలుచుతాము. తరువాత అవి మనలను మలుచుతాయి.
భాష మనిషి చైతన్యానికి ప్రతీక మరియు ఆనబద్ద. భాష ద్వారానే భావవివేచనము కలుగుతుంది. మనిషి యొక్క విలువలు, ఆశయాలు మాట్లాడే భాష ద్వారానే రూపొందుతాయి. కనుక భాషనే సర్వ సాంస్కృతిక వికాసానికి పునాది అని అనవచ్చును. కెనడాదేశస్థ తత్వవేత్త యైన మార్షల్ మక్లుహాన్ మనిషి చైతన్యపరిక్రమకు తను వినియోగించే పనిముట్లను ఆనగా పేర్కొన్నాడు. ఈ సాధనసంపత్తిలో సర్వోత్తృష్టమైనది సూక్ష్మాతిసూక్ష్మకారకమైనది భాష. ఈ వివేకము భారతీయజ్ఞానపరంపరలో అనాదిగా పొదిగియున్నది. భర్తృహరి తన వాక్యపదీయములో భాష అనే మాధ్యమం గుండా చైతన్యము యొక్క ఉజ్జీవనము ఎలా జరుగుతుందో విస్తృతముగా వివరించియున్నాడు. ఈ వివేకము జీర్ణించిననాడు వృత్తివిద్యలు ఉన్నతవిద్యలు మాతృభాషలో ఎందుకు ఉండాలి యన్న ప్రశ్నయే ఉదయించదు. ఎందుకనగా భాష కోల్పోయిననాడు మనిషి అస్థిత్వమే అక్కడ ప్రశ్నాస్పదమగుతుందని అభిజ్ఞాతమవుతుంది. కానీ ఈనాటికాలంలో అర్థార్జనే ధర్మానికి ఆద్యంతములన్న మూఢాతిశయసంభ్రమము చెందినవారే అధికులు. కనుక వారి వాదనలకు క్రమానుక్రమంగా ప్రతివాదనలు ఇవ్వక తప్పదు.
ఆంగ్లమాధ్యమంఆర్థికప్రగతికిఅవసరము: ఈ వాదన చేస్తున్నవారు ప్రపంచములో ఆర్థిక ప్రగతిని గడించిన తూర్పు ఆసియా దేశాలను పట్టించుకోరు. వారంతా తమ స్వీయమాతృభాషలలోనే వృత్తివిద్యలనభ్యసించి యాంత్రీకరణము, ఎగుమతులనందించే పరిశ్రమలు, సేవారంగములు యావత్తూ తమ స్వంతభాషలలోనే నడుపుకుంటున్నారు. మన భారతదేశంలో ఉన్నతపరిశ్రమలు ఆంగ్లములో నడుపుతున్న కారణాన 90% ప్రజలు వీటిలో పాలుపంచుకోలేకపోతున్నారు. ఆంగ్లములో మాట్లాడగలువారు సైతము భాషాప్రతిభ లేని కారణాన తమ కార్యనిర్వహణలో సృజనశీలురుగా రాణించలేకపోతున్నారు. ఇది స్వీయ తప్పిదమే! మన ఆర్థికప్రగతి గతిలో కనీసము 3-5% పాళ్లు ఈ ఆంగ్లపు సంకెళ్ల ద్వారా కోల్పోతున్నట్లు మనము గ్రహించాలి. ఇటువంటి భాషాబానిసత్వము తదోత్పన్నమైన ఆర్థికవైకల్యము వలసకారుల వశీకరణకు వశమైన దేశాలనన్నింటిలోను చూడవచ్చును. మన దేశము వీటికి విరుద్ధము కాదు. స్వీయభాషాల సముద్ధరణము నిర్వశీకరణకు అతిప్రధానమైన అంశము.
భాషాబాహుళ్యమున్నమనదేశానికిఅనుసంధానభాషఅవసరము, అదిఆంగ్లమే: ఈ అనుసంధానభాష వృత్తివిద్యలలో ఎటువంటి భాష మాధ్యమముగా ఉండాలన్న అంశానికి లంబకోణముగా సంబంధరాహిత్యముగానున్న అంశము. అనాది చరిత్రగల మనదేశ సాంస్కృతిక పరంపర, సారస్వతవారసత్వము ఇటువంటి అనుసంధానభాష లేకనే వచ్చాయా? పరాయి భాషలైన ఆంగ్లము, పారశీకము ప్రజానీకాన్ని సాంతము అనుసంధానింపగలవా? ఇది మూఢాతిమూఢమైన వాదన, కానీ భావదాస్యము వలన మేధావులు అనేకులు ఇలా ఆంగ్లపక్షపాతులై వాదిస్తున్నారు. మన దేశానికి నిస్సందేహముగా అనుసంధానభాష సంస్కృతము. దానికి తోడుగా కాలానుగతముగా ఏదో ఒకానొక ప్రాకృతము పండితపామరబేధము లేకుండా ప్రజలనందరినీ కలుపుతూ వచ్చింది. ఈనాటి కాలంలో ఇది నిస్సందేహముగా కౌరవీ ప్రాకృతము, అనగా హిందీ భాష. ఈ హిందీ-సంస్కృత భాషాద్వయము చేతనే యావత్భారతము అనుసంధానింపబడగలదు. కానీ మునుపు వాదించినట్లు ఈ అనుసంధానభాష విద్యామాధ్యమభాష కానేరదు. సర్వ ప్రజలు తమ తమ మాతృభాషలలోనే అత్యున్నత విద్యాప్రతిభ పొందగలరు, ఆపై వివిధ ఆర్థికరంగములలో ఆచారవ్యవహారములలో రాణించగలరు.
ప్రభుత్వపరంగాసమస్యలనుపరిష్కరించుటకుదేశవ్యాప్తముగాసామరస్యముపొందుటకువృత్తివిద్యలయందుఏకభాషనేఉండవలెను: ఇది సంపన్నహీనమైన రాజ్యములయందు ఒకానొక కాలములో చెల్లుబాటైన వాదనే, కానీ ఈనాటి మన ఆర్థికపరిపుష్టికి అందుబాటులోనున్న సంగణక సాంకేతికసాధనాసామాగ్రికి సమయోచితము కాదు, కేవలము జంకుబాటు. ప్రపంచములో అనేక దేశములలో ప్రభుత్వయంత్రాంగము న్యాయవాదయంత్రాంగము బహుభాషామాధ్యములలో లభ్యమవుతున్నాయి. మేలైన ఉదాహరణ స్విస్ దేశము, అక్కడ మూడు భాషలు సమానాధికారము కలిగి సర్వప్రభుత్వసదుపాయాలను పౌరులకు అందిస్తున్నాయి. అట్లే ఐరోపా ఐక్యసమితిలో వివిధ ఐరోపాభాషలలో ప్రజలకు సేవలు అందుతున్నాయి. మనదేశములో సంస్కృతభాషావారసత్వఫలము వలన ఇది మరింత సులభతరమైన అంశము. ఉచ్ఛన్యాయస్థానాలు, ప్రభుత్వవ్యవస్థలు ఆంగ్లములోనే సేవలనందించడం దాస్యభావన మాత్రమే. ఇది ఇప్పటికీ కొనసాగడము, వృత్తివిద్యలు మాతృభాషల్లో అందలేకపోతుండము మన దౌర్భాగ్యము. ఇది మూర్ఖత్వము తప్ప మరేదీ కాదు.
భాషోద్ధారణముమంచిదే, కానీపాఠ్యపుస్తకాలేవి? విద్యావనరులులేకుండాభారతీయభాషామాధ్యమాలలోవృత్తివిద్యలుప్రవేశపెట్టుటమూర్ఖసాహసము: ఇది సహేతుకమైన వాదనే, కానీ విజయవంతముగా స్వీయభాషామాధ్యమాలలో వృత్తివిద్యలను నడుపుకుంటున్న ఐరోపావాసులు లేదా తూర్పు ఆసియావాసులు ఎలా పాఠ్యపుస్తకాలను విద్యావనరులను తమ భాషల్లో తెప్పించుకుంటున్నారు, ఆ ప్రక్రియలు మన భారతీయభాషలకు కూడా అన్వయించుకోవచ్చునా అని పరిశీలించాలి. ఆశ్చర్యావహమైన విషయమేమిటంటే పాఠ్యపుస్తకాలు ఎల్లప్పుడూ విద్యావ్యవస్థ మాతృభాషల్లో మల్లిన తరువాతనే వస్తాయి, మునుపున కాదు. విశ్వవిద్యాలయాల్లో విద్యాక్రమము నడుస్తుండగా, ఆచార్యులు ఉపన్యసిస్తుండగా, విద్యార్థులు తమ విద్యావిభాగాలలో పరీక్షలు మరియు పరిశోధనాపత్రాలు వ్రాస్తుండగా, ప్రయోగశాలలో పరిశోధనలు జరిగి శాస్త్రీయపత్రాలు విషయసమీక్షలు సర్వము మాతృభాషల్లో జన్మిస్తుండగా, ఇలా కాలక్రమేణా పాఠ్యపుస్తకాలు కూడా మాతృభాషల్లో ప్రచురింపబడుతుంటాయి. సంగణనశాస్త్రం సూక్ష్మజీవాణుశాస్త్రం వంటి ప్రచండవేగంతో ఉద్గమిస్తున్న వైజ్ఞానికరంగాలలో నూతన పాఠ్యపుస్తకాలు కాలానుక్రమముగా వస్తూ ఉండాలి. మొదట ఇటువంటి పుస్తకాలు ఆంగ్లములోనే ఉన్నా విద్యాబోధనము మాత్రము స్వీయభాషలలో నడుస్తుంది. ఒకసారి పాఠ్యపుస్తకాలు ప్రచురింపబడిన పిదప కూడా వివిధ ఆంగ్లగ్రంథాలు, శాస్త్రీయపత్రాలు సంప్రదింపుకై విద్యార్థులకు సూచింపబడుతూ ఉంటాయి. విద్యార్థులు కూడా ఆంగ్లములో ప్రవేశము కలిగియున్నప్పటికీ భావవ్యక్తీకరణలో సౌలభ్యము కొరకు తమ మాతృభాషలనే మెగ్గుచూపుతూంటారు. ఈ బోధనాపద్ధతులు, వ్యవహారాలు ఆంగ్లేతర సమాజంలోని ఎటువంటి దేశానికి వెళ్లి దర్శించినా అవగతమవుతుంది. దురదృష్టవశాత్తూ మన “మేధావులకు” ఇటువంటి ఆంగ్లేతర విశ్వవిద్యాలయందు పరిచయము అత్యల్పము. నేను పదిహేనేళ్లకు పైగా ఐరోపాలో నివశించుట వలననూ, ఫ్రెంచి జర్మన భాషలలో విద్యాబోధనావిధానములను సునిశితముగా చూసినవలననూ ఇది నాకు తేటతెల్లముగా వ్యక్తమగుతున్నది. గత నాలుగేళ్లుగా వైకల్పితవాస్తవికము, కృత్రిమమేధ వంటి అతిపురోగతమైన పాఠ్యాంశాలను స్వయముగా జర్మనభాషలో జర్మన విద్యార్థినీవిద్యార్థులకు బోధించిన మూలముగా ఈ విధానాలు స్వీయాచరణచే కూడా నాకు తెలిసి వచ్చాయి. కానీ ఈ దృష్టి రావడానికి నాకు కూడా పదేళ్లు పట్టినది. ఇక ఆంగ్లభాషాదాస్యములో మునిగితేలుతున్న మన మేధావులకు ఈ స్పృహ కలుగకపోవుటలో ఏమాత్రము ఆశ్చర్యము లేదు.
భాషోద్ధారణమనగాఏభాషలకు, మాండలికాలకుచెయ్యాలి? ఆంగ్లముబదులుమరొకరిభాషనురుద్దడముసామాజికఅన్యాయముకాదా?: ఈ వాదన బ్రిటిషువారి కపట రాజనీతి వలన మన దేశములో చొచ్చుకువచ్చిన కులకుంపటి వలన మరీ చెలరేగిపోతున్నది. అంబేద్కరు వంటి మహాశయుడు కూడా ఆంగ్లమును సామాజిక పురోగమనానికి సమానత్వానికి వారధిగా చూసాడు. అది మన దురదృష్టము, నిజచరిత్రలో ఆంగ్లేయుల అమానుషాలకు అణగారిన నిమ్నవర్గాల స్మృతికి ఇటువంటి వాదనము అపరాధము. కానీ అంబేద్కరు విశిష్టమేధావి గనుక ఆయన అదే క్రమంలో సంస్కృతమును ద్వేషభావనతో చూడలేదు, దేశ సామరస్యానికి సారస్వతవారసత్వానికి నిజాయితీయైన దేశభాషగా సంస్కృతమొక్కటే మనగలదని ఆయన విశ్వసించాడు. కానీ ఆంగ్లేయులు రుద్దిన మరొక జాడ్యము ఆర్యుల వలస సిద్ధాంతము. మూలముగా పచ్చి జాత్యహంకారము నుండి బయలుదేరిన ఈ సిద్ధాంతము బిషప్ కాల్డ్వెల్ వంటి జాతివాదుల చలువ చేత భాషాశాస్త్రములో కూడా అడుగిడింది. పెరియార్ మొదలుకొని అనేకులైన ద్రవిడజాతీయవాదులను ప్రభావితం చేసింది. నిజానికి సంస్కృతశబ్దకోశములో ఇతర ప్రాపంచికభాషల పాలు అత్యల్పము. దాక్షిణాత్యభాషలలో క్రియాపదాలు సహితము శబ్దకోశమంతా సంస్కృతముతో పెనవేసుకుని ఉన్నది. ఈ శబ్దజాలమంతా భారతభూభాగంలో జనించినదే, మునుపు చెప్పినట్లు ఐరోపాభాషలతో సహసాంగత్యము కల పదాలు వ్రేళ్లతో లెక్కించబడునట్లవి. కనుక ఆర్యులు ఎక్కడనుండి వచ్చారన్న విషయం భారతీయభాషా పరంపరకు సంబంధించినంత వరకు సందర్భాతీతమైనది. ప్రపంచంలోనే అత్యుత్తమమైన శాస్త్రకావ్యసంపత్తి మన భాషలకు సొంతము, ఆ పరంపరను చూస్తే మన భాషలన్నింటా సంస్కృతము యొక్క ప్రభావము, ఇచ్చిపుచ్చుకలు అనాదికాలం నుండి కనపడుతాయి. కనుక ఇది క్రొత్త విశేషమేమీ కాదు. స్వభావతః మనము భారతీయులము సంస్కృతము యొక్క పుత్రులము. ఈ నైజమునే నూతన శాస్త్రీయ వైజ్ఞానిక శబ్దనిర్మాణమునకు రప్పించడము అతి సహజమైన విషయము. అలాగని దేశ్యగ్రామ్య పదజాలాలను చులకన చూడనవసరము లేదు. ఇవన్ని పదాలు మన సంస్కృతి యొక్క చిహ్నాలే, మన పూర్వీకుల నుండి వచ్చిన వారసత్వమే. ఇది మంచిది అది కాదు అని గిరి గీసుకోవడమే వెఱ్ఱితనము. ఎటువంటి భాషలోనన్నా సందర్భానుసారముగా పర్వతాల వంటి ప్రౌఢమైన శబ్దజాలమో, పైరగాలి వంటి తేలికైన మాటలనో వాడతాము. ఈ రెంటినీ రంగరించి సొంపైన మాటల కూర్పు చేయువాడే సుకవి. ఇది ఆంగ్లములోనూ కనపడుతుంది, కానీ శాస్త్రీయ పరిభాషను దినదినము ఆంగ్లములో వినుట వలన గ్రీకు లాటిను ఇత్యాది వారి పారంపరిక భాషల నుండి జనితమైన ఆ శబ్దాలు మనకు మొరటుగా ఆనవు. మన భాషలోనే పుట్టించిన శబ్దాలు మొదటితనం మూలముగా కరుకుగానో మోటగానో అనిపిస్తాయి: అవి దేశ్యశబ్దముల నుండి జన్మించినా, శ్రేష్టసంస్కృతసమములైనా. ఈ మొదటిదనపు ఎడబాటును దాటి భాషాప్రవాహానికి కంచె తీయాలి. అప్పుడు అన్ని దేశీయ భాషలు, అన్ని మాండలికాలు పైకి లేస్తాయి. ప్రామాణికమైన ప్రౌఢమైన భాష సహజముగానే ఒకటి స్థిరపడుతుంది. కానీ భాషను మాట్లాడే ప్రతివాడు తన స్వీయదృష్టిని వ్యక్తీకరణాస్వేచ్ఛను ప్రదర్శించకపోడు. ఇందులో కొందరు అక్కడక్కడా పరభాషాపదాలను కూడా వాడవచ్చు, తప్పేమీలాదు. కానీ స్వీయవారసత్వాన్ని కాలదన్నడము, సంస్కృతము ద్వారా భారతీయభాషల మధ్యనున్న అన్యోన్యతను గుర్తించకపోవడము సొంత అమ్మను దూషించడం వంటివి. ఈ వెఱ్ఱివేషాలను భాషాభిమానులు మానుకోవాలి.
మాతృభాషమాధ్యమంలోవిద్యాబోధనప్రాథమికవిద్యలోనేఅవసరము, ఉన్నతవిద్యలకువృత్తివిద్యలకుఅనవసరము. అంతగాకల్పించాలనుకుంటేసాంఘికశాస్త్రాలలోనోసాహిత్యశాస్త్రవిభాగాలలోనోపెట్టాలి, యంత్రనిర్మాణవైద్యశాస్త్రాలలోపెడితేవిద్యాప్రమాణాలుదెబ్బతింటాయి: ఈ వాదన చేసేవారు కూడా అత్యధికులు ఆంగ్లేతర దేశాలలో విశ్వవిద్యాలయాలు పనిచేసే తీరును దర్శించినవారు కాదు. కేవలం ప్రాథమిక విద్యాభ్యాసం మాతృభాషలో ఉండినట్లైతే విద్యార్థులకు సహజముగానే తమ మాతృభాషపై న్యూనతాభావము ఏర్పడుతుంది. సమాజములో గుర్తింపుకు, ధనార్జనకు పనికొచ్చే వృత్తివిద్యలు ఏ భాషలో లభ్యమవుతుంటే ఆ భాషకు మర్యాద లభిస్తుంది. స్వాభిమానం కల ఏ జాతియైనా యోచించవలసిన విషయమేమిటంటే తమ మాతృభాషకు ఎందుకు ఆ మర్యాద దక్కలేదు అని. ముఖ్యముగా కోట్లాది ప్రజలు మాట్లాడు భాషలు, సమృద్ధమైన ప్రాకృతికసంపత్తి, ఆర్థికప్రతిపత్తి గల భాషలు అన్ని వృత్తివిద్యలను శ్రేష్టాతిశ్రేష్టమైన విశ్వవిద్యాలయాలను కలిగియుండాలి. అవి లేవు అంటే ఆ భాషను మాట్లాడే ప్రజల న్యూనతాభావనకు భావదాస్యానికి నిదర్శనలు. ఇజ్రాయెల్ దేశంలో ప్రాచీన హీబ్రూ భాషను పునరిద్ధరించినప్పుడు, మాట్లాడే ప్రజల సంఖ్య ఎంతనో లేకున్ననూ ఆ దేశపు అత్యున్నత విద్యాస్థానమైన టెక్నియాన్ యంత్రనిర్మాణవిద్యావిభాగాలను హీబ్రూభాషలో రూపొందించింది. యాంత్రీకరణ ద్వారా దేశం ఆర్థికప్రగతి సాధిస్తూండగా, ఈ భాషాప్రవాహం అన్ని సాంస్కృతిక విభాగాలకు, వాణిజ్యవిభాగాలకు చేరింది. మన భారతీయభాషల పునరుద్ధరణ మరింత సులభతరమైన కార్యము. కానీ ఇదే విధంగా పారిశ్రామీకరణము, ఆర్థిక పురోగతి సాధించుటకు మూలసాధనాలైన అన్ని విద్యావిభాగాలయందు అత్యున్నత స్థాయిలో అత్యున్నత విశ్వవిద్యాలయందు మాతృభాషలో విద్యాబోధన జరగాలి, కనీసం ప్రత్యుమ్నాయంగా లభ్యమౌతూ ఉండాలి. లేదంటే ఆత్మన్యూనత, స్వాభిమానలోపము వలన పౌరులందరిలో మాతృభాషాపాటవము కృశించి క్రమక్రమముగా ఆంగ్లపుటెంగిలి చొరబడుతుంది. ఇదే వైపరీత్యాన్ని ఈనాడు మనము మన ఉన్నతవర్గాలవారియందు అంతటా గమనిస్తున్నాము. కానీ ఇదేమీ మన పూర్వకర్మనిర్దేశితము కాదు, స్వంత చేష్టలతో చేజేతులా మనమే కల్పించుకున్నది. మిగతా దేశాలవారు అనేకులు మనలాగ మూఢులు కాదు. మనం కూడా వారిలాగే భాషలో చేతనత్వం రప్పించుకోగలము. వెనువెంటనే రాకున్నా క్రమంగా కొన్ని దశాబ్దాలకు రాగలదు. ఆ దిశలో శుభం భూయాత్ !
ప్రపంచ నియమవిధి (వర్ల్డ్ ఆర్డర్) అను జపానదేశ సంగీతబృందం గాయకుడు గెంకీ సూడో చే సమకూర్చబడింది. సమకాలీన విషయాలపై ఆలోచనలు రేకెత్తించేలా ఉంటాయి వీరి గీతాలు. సంగీతానుక్రమంగా విశ్మయాస్పదమైన అద్భుత సమపాదగతితో నాట్యం చేస్తారు ఈ బృందం.
లేదు అసలేదీ లేదు లేదు నాకు పరితాపం లేదు వాళ్ళు నాకు చేసిన మంచిని కాని కీడుని కాని, అదంతా నాకు సమానమే
లేదు అసలేదీ లేదు లేదు నాకు పరితాపం లేదు అదంతా భరించాను, తుడిచిపెట్టేసాను, మరిచిపోయాను గతమంటే వెఱ్ఱి, నాకు లెక్కలేదు
నా జ్ఞాపకాలతో నిప్పు రాజేస్తాను నేను నా దుఃఖాలతో, నా సుఖాలతో వాటిమీద అవసరంలేదు నాకు తుడిచిపెట్టేసి ప్రణయాలన్నీ వాటి అలజడులన్నీ ఎప్పటికీ తుడిచిపేట్టేసి సున్నాపై మొదలౌతాను నేను
లేదు అసలేదీ లేదు లేదు నాకు పరితాపం లేదు వాళ్ళు నాకు చేసిన మంచిని కాని కీడుని కాని, అదంతా నాకు సమానమే
లేదు అసలేదీ లేదు లేదు నాకు పరితాపం లేదు ఎందుకంటే నా జీవితం, నా ఆనందం ఈరోజు మొదలౌతోంది నీతోనే
ఎదిత్ పియాఫ్ అను మహాగాయని 1956వ సంవత్సరంలో ఫ్రెంచిభాషలో పాడిన “నోన్, జ న రెగ్రెత రియాన్” (లేదు, నాకు పరితాపమేదీ లేదు) అను ఈ పాట ఫ్రాన్సుదేశంలోనేకాదు, విశ్వవ్యాప్తంగా అతిప్రాచుర్యంలోకి వచ్చిన గీతాలలో ఒకటి. ఈ పాటని చార్ల్ ద్యుమోన్ అను సంగీతకారుడు ఎదిత్ పియాఫ్ కోసమనే కృతిచేశాడు. అప్పటికే ఆమె బాగా పేరొందిన గాయని. మొదట్లో ద్యుమోన్ ని కలవడానికి సమయంలేదని, శరీరం నీరసపడివుందని నిరాకరించిన పియాఫ్ ఈ పాటని ఆయన పియానోపై వాయిస్తే ఒకసారి విని, “మహాద్భుతం, కచ్చితంగా ఈ పాటని పాడతాను. కచ్చితంగా ఈ పాటతోనే ప్రజలందరి మనసుల్లోను గుర్తుండిపోతాను” అని అందట. ఆమె గొంతుతో, లోలోపల నుండి వచ్చిన శక్తితో నిజంగానే ఈ పాటని మధురాతిమధురంగా ఆలపించింది. ఫ్రెంచిభాషలో రెగ్రెత్ అంటే పశ్చాత్తాపం. కానీ, “జె న రెగ్రెత్ రియాన్” (నేను పశ్చాత్తాపపడట్లేదు) అంటే పదాల వెనుక ఇంకో భావం ఉంది. నేను తప్పుచేసాను అనిగాక, ఇతరులు చేసిన పనులు నాకు ఇబ్బంది కలిగించవు అని. అందుకని “పరితాపమేదీ లేదు” అను నేను తెలుగులో అనువదించాను.
ఎదిత్ పియాఫ్ జీవితంపై ‘ల మోమ్” (కుర్రది) అను ఒక సినిమా కూడా 2007వ సంవత్సరంలో విడుదలయ్యింది. పియాఫ్ పాత్రని మారియోన్ కోతియార్ అను ప్రముఖమైన ఫ్రెంచి అభినేత్రి పోషించింది. ఎదిత్ పియాఫ్ జీవితంలో ఎన్నెన్నో ఒడిదుడుకులను, బాధలను, ఉల్లాసాలను, అలల్లాంటి అలజడిగా సాగిన వైనాలను హృద్యంగా చిత్రీకరించారు ఈ చిత్రికలో. పాటలు కూడా ఆవిడే పాడింది. ఈ సినిమాలో “నోన్ రియాన్ ద రియాన్” అను పాటను ఆవిడ తిరిగి జీవంపోసిన వైనం క్రింద చూడవచ్చు.
రాత్రి బాధలన్నీ కమ్ముతుండగా గుండెనిండుగా ప్రేమిస్తాం ఎప్పటికీ మాయమైపోవనివి నల్ల సీతాకోకచిలుకలు నల్ల సీతాకోకచిలుకలు నల్ల సీతాకోకచిలుకలు
వేరే అమ్మాయిలు నిన్ను కవ్విస్తున్నారు వేల దివ్వెలతో, జిగేలుమనే నగలతో రాత్రినడుమన ఆకర్షిస్తున్నాయి నల్ల సీతాకోకచిలుకలు నల్ల సీతాకోకచిలుకలు నల్ల సీతాకోకచిలుకలు
మసకగా ప్రొద్దుటి వేకువ వెలుగున అద్దంలో కదలాడే అలజడి జలాన ఆకస్మికంగా నిన్ను నువ్వు కలిసినప్పుడు మొత్తమంతా నల్లగా మొత్తమంతా నల్లగా మొత్తమంతా నల్లగా
ఆపై నీ చొక్కాపై చూశావు నువ్వు నీ గుండెకి దగ్గరగా పెట్టిన చొక్కాపై కోటు వేసుకునే ముందున జేబుపై నల్ల సీతాకోకచిలుకని నల్ల సీతాకోకచిలుకని నల్ల సీతాకోకచిలుకని
సార్జ్ గేన్స్బూర్ అను ఫ్రెంచి గాయకుడు, కవి వ్రాసిన “లే పాపియ్యోన్ నువార్” (నల్లటి సీతాకోకచిలుకలు) అను ఈ పాట 1966వ సంవత్సరంలో విడుదలయ్యింది. ఈ పాటని గేన్స్బూర్తో కలిసి ఆలపించింది మిచేల్ ఆర్నో అను గాయని. ఈమె మునుపు ఫ్రాన్సుదేశం తరుపున యూరోవిజన్ అను ఐరోపాస్థాయి గానస్పర్ధాకార్యక్రమంలో పాల్గొంది. ఈ పాట ఈ గాయనీగాయకులిద్దరికీ ఎంతో పేరు తెచ్చిపెట్టింది. గేన్స్బూర్ అప్పటికే పేరొందిన సంగీతకారుడిగా, కవిగా గుర్తింపులోకి వచ్చాడు. ఇతని పాటలు పొరలుపొరలుగా నిమిడిన గూఢమైన సాహిత్యంతో, వివిధ ప్రాసాలంకారాలతో ఫ్రెంచిభాష పాటవ్యాన్ని ప్రదర్శిస్తుంటాయని అభిమానుల ప్రశంస. ఈ నల్లటి సీతాకోకచిలుకలు అన్న పాట వివాహేతర రంకుసంబంధాన్ని నిగూఢంగా వర్ణిస్తోంది. సీతాకోకచిలుకలు ప్రణయానికి, వైవాహికబంధానికి ఐరోపాసంస్కృతిలో చిహ్నం. అటువంటిది నల్లటి సీతాకోకచిలుకలు అంటే ఏదో తప్పు పని చేస్తున్న సమయానికి కలిగే భావనలకు చిహ్నంగా గేన్స్బూర్ సూక్ష్మంగా సూచిస్తున్నాడు.
ఇదే పాట “బిజూ” (మణి, ప్రేమికుడు) అను ఒక సంగీతబృందం కూడా గేన్స్బూర్ తో కలిసి పాడింది. ఆ ఆలాపనని క్రింద చూడవచ్చు.
నా వయసులోని అందరు అమ్మాయిలు అబ్బాయిలు వీధిలో నడిచిపోతున్నారు కలిసి ఇద్దరిద్దరు నా వయసులోని అందరు అమ్మాయిలు అబ్బాయిలు ఆనందంగా ఎట్లుండాలో వారికి బాగా తెలుసు ఆ కళ్ళల్లో కళ్ళుంచి, ఆ చేతిలో చేయుంచి కలిసి పోతున్నారు, ప్రేమికులై, మర్నాడంటే భయంలేక ఔను, కానీ నేను ఒంటరిగా పోతాను ఆ వీధుళ్లో, గుండెదిగులుగా ఔను, కానీ నేను ఒంటరిగా పోతాను, నన్ను ప్రేమించేవాడు లేడుగనుక
నా రోజులు ఎలాగో నా రాత్రులు అలాగే రెండూ అన్నివిధాలా ఒకటే రెండూ ఉల్లాసంలేక ఎంతో విసుగెత్తి నా చెవిలో “నిన్ను ప్రేమిస్తున్నా” అని గుసగుసలాడరు ఎవరూ
నా వయసులోని అందరు అమ్మాయిలు అబ్బాయిలు కలిసి కడుతున్నారు భవిష్యత్తుకి పథకాలు నా వయసులోని అందరు అమ్మాయిలు అబ్బాయిలు తెలుసు వారికి బాగా, ప్రేమించడం అంటే ఏమిటో ఆ కళ్ళల్లో కళ్ళుంచి, ఆ చేతిలో చేయుంచి కలిసి పోతున్నారు, ప్రేమికులై, మర్నాడంటే భయంలేక ఔను, కానీ నేను ఒంటరిగా పోతాను ఆ వీధుళ్లో, గుండెదిగులుగా ఔను, కానీ నేను ఒంటరిగా పోతాను, నన్ను ప్రేమించేవాడు లేడుగనుక
నా రోజులు ఎలాగో నా రాత్రులు అలాగే రెండూ అన్నివిధాలా ఒకటే రెండూ ఉల్లాసంలేక ఎంతో విసుగెత్తి నాకోసం ఎప్పుడు ప్రకాశిస్తాడు, దిండుగా మరి సూరీడు?
నా వయసులోని అమ్మాయిల్లాగ అబ్బాయిల్లాగ తెలుసుకుంటానా మరి ప్రేమంటే ఏమిటో? నా వయసులోని అమ్మాయిల్లాగ అబ్బాయిల్లాగ అనుకుంటున్నా ఎప్పుడు వస్తుండా ఆ రోజని ఆ కళ్ళల్లో కళ్ళుంచే, ఆ చేతిలో చేయుంచే గుండే నిండుగా ఆనందంగా, మర్నాడంటే భయంలేక నా గుండె దిగులుగా అసలు ఉండనే ఉండని రోజు నన్ను కూడా నిండుగా ప్రేమించే ఎవరో కలిగుండే రోజు
1962వ సంవత్సరంలో ఫ్రాన్సువాజ్ హార్డీ అనే గాయని పాడి విడుదల చేసిన “తూ లె గార్సోంజె లె ఫియ్ ద మోనాజ్” (నా వయసులోని అందరు అబ్బాయిలు అమ్మాయిలు) అన్న ఫ్రెంచిపాట ఇది. ఆ 60వ దశకంలో ఫ్రాన్సుదేశంలో వచ్చిన ఈ సంగీతాన్ని యే-యే సంగీతం అంటారు. పడుచు అమ్మాయిలు పాడిన ఈ యే-యే పాటలు అమెరికాదేశం నుండి వస్తున్న సంగీతపద్ధతులను, జావళీలను ఫ్రెంచిభాషలో ఫ్రెంచి సంస్కృతికి అన్వయించాయి. ఎందరో మంచి గాయనులు అప్పుడు వెలుగులోకి వచ్చినా, అందులో ఫ్రాన్సువాజ్ హార్డీకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈమె ఎన్నెన్నో దశాబ్దాలుగా మధురమైన పాటలు ఆలపించి ఎందరో అభిమానులను చేగొంది.
ఓం వజ్రసత్వ సమయమనుపాలయ వజ్రసత్వత్వేన ఉపతిష్ఠదృఢో మే భవ సుతోష్యో మే భవ సుపోష్యో మే భవ అనురక్తో మే భవ సర్వసిద్ధిం మే ప్రయచ్ఛ సర్వకర్మసు మే చిత్తశ్రేయః కురు హూం హ హ హ హ హోః భగవాన్ సర్వతథాగత వజ్ర మా మే మూంచ వజ్రీ భవ మహాసమయసత్వ ఆః
సర్వకర్మసుచ మే చిత్తశ్రేయః కురు హూం హ హ హ హ హోః భగవాన్ సర్వతథాగత వజ్ర మా మే మూంచ వజ్రీ భవ మహాసమయసత్వ ఆః
తెలుగులో అన్వయం:
ఓం వజ్రసత్వ సమయమనుపాలయ ఓం వజ్రశక్తినిగలవాడా (ఇంద్రుడా) సాధకునికి దేవునికి మధ్యన గల యజ్ఞబంధమనే ఒప్పందాన్ని అనుపాలించు (పాటించు)
వజ్రసత్వత్వేన ఉపతిష్ఠదృఢో మే భవ నీ వజ్రశక్తినిగలిగిన తత్వంతో నాతో దృఢంగా కలిసివుండు
సుతోష్యో మే భవ నాయందు సంతుష్టుడై ఉండు
సుపోష్యో మే భవ నాయందు సుపోషకుడివై ఉండు
అనురక్తో మే భవ నాయందు అనురాగివై ఉండు
సర్వసిద్ధిం మే ప్రయచ్ఛ అన్ని సిద్ధులు నాకు కల్పించు
సర్వకర్మసు మే చిత్తశ్రేయః కురు అన్ని కర్మలయందు నాయందు శ్రేయస్సు (నిర్మలత్వము) కలిగిన చిత్తము (మనస్సు) కల్పించు
హూం హ హ హ హ హోః
భగవాన్ సర్వతథాగత వజ్ర మా మే మూంచ ఓ భగవంతుడా, అన్ని స్థితులయందు తఠస్థతతో నిండిన బౌద్ధతత్వం కల్పించు వజ్రతత్వముగలవాడా, నన్ను విడనాడకు
వజ్రీ భవ మహాసమయసత్వ యజ్ఞబంధమనే ఒప్పందము ద్వారా వజ్రతత్వము కలిగి నాకు ప్రత్యక్షమవ్వు
ఆః
సర్వకర్మసుచ మే చిత్తశ్రేయః కురు అన్ని కర్మలయందు నా చిత్తము నిర్మలముగా చేయి
హూం హ హ హ హ హోః
భగవాన్ సర్వతథాగత వజ్ర మా మే మూంచ భగవంతుడా, సర్వ తథాగత గుణంతో వజ్రతత్వం కలిగినవాడా, నన్ను విడనాడకు
వజ్రీ భవ మహాసమయసత్వ మహాసమయసత్వముతో (యజ్ఞబంధముని అనుసరించిన తత్వముతో) వజ్రతత్వముగలవాడై నన్ను అనుగ్రహించు
ఆః
చీనేయగాయని సా-డింగ్-డింగ్ 2007వ సంవత్సరంలో విడుదలచేసిన “వాన్వూషెంగ్” (జీవించి ఉండడం: ఆంగ్లంలో “ఎలైవ్”) అను సంగీతముద్రణలోని ఒక సంస్కృతశ్లోకం ఇది. ఈ శ్లోకం శతాక్షర వజ్రసత్వమంత్రం అను బహుప్రసిద్ధమైన బౌద్ధమంత్రం. దీనిని గానరూపంలో ఈమె పాడి అలరించింది. ఈ మంత్రంలో వజ్రతత్వంకలిగిన ఇంద్రుని అనుగ్రహం సాధకుడు అడుగుతున్నాడు. వజ్రం ఇంద్రుని ఆయుధం కదా. ధ్యానచింతనలో ఈ “వజ్రం” అంటే ప్రగాఢమైన జ్ఞానాన్ని మనసులోకి ప్రత్యక్షింపజేసే అంతర్దృష్టి. అజ్ఞానాన్ని ఛేదించి మనోపలకాలపైన దివ్యమైన కాంతిరూపంలోని జ్ఞానాన్ని మెరుపులా ప్రత్యక్షింపజేసేదే ఈ వజ్రాయుధం. బౌద్ధమతంలో ఈ వజ్రశక్తిని కలిగిన దేవతను వజ్రసత్త్వుడని పిలుస్తారు. తనని ఒక ఉత్కృష్ఠమైన బుద్ధావతారంగా కొలుస్తారు. అటువంటి దేవతను సాధకుడు యజ్ఞబంధం అనుసరించి, నిష్ఠగా ధ్యానంచేసిన భక్తునిపై కచ్చితంగా అనుగ్రహించు అను వేడుతున్నాడు. బౌద్ధమతంలో అత్యున్నత ధ్యానతత్వాన్ని “తథాగత” అంటారు. “తఠత” అంటే ఎట్లు ఉన్నదో తఠస్థంగా అట్లే మనసులో అంగీకరించడం అని, మనోవికారాలు ఏమీ లేకుండా అన్నింటిపైన వైరాగ్యంతో కూడిన నిర్మలతత్వంతో ఉండడం అన్నమాట. మరి “గత” అంటే కదులుతూ ఉండడం, ఈ స్థితి నిదానంగా ఉండేది కాదు. ఋతుక్రమంలో కదులుతూ సమయం ముందుకువెళ్తున్నా మనస్చిత్తం మాత్రం నిర్మలంగా అట్లే ఉంటూ కదలడం అన్నమాట. అందుకని బుద్ధుడిని “తథాగతుడు” అని కూడా పిలుస్తారు.
చీనేయగాయని పాడిన స్వరాలలో సహజంగానే సంస్కృతోచ్ఛారణలో అపస్వరాలు దొర్లుతాయి, కానీ వాటికి ఇబ్బందులు పడకుండా పాటని, అనుబంధమైన చిత్రికను ఆస్వాదించండి.
ఎడమచేయి భూమిని పట్టుంది కుడిచేయి ఆకాశాన్ని పట్టుంది నా అరచేతిరేఖలపై బద్దలయ్యింది అన్నివైపులా మెరుపులాడుతూ కాలమనే కెరటాన్ని ఏరుకుని సంవత్సరాలుగా ఇట్టే పూతపోసి మూడువేల జన్మలు సాంతం గడిచినా ఇంకా మనం కలుసుకోలేదన్నట్టుగా
ఎడమచేయి ఒక పువ్వుని త్రెంచింది కుడిచేయి ఒక ఖడ్గాన్ని ఆడించింది ఆ కనుబొమ్మలకి మధ్యన జారింది ఓ వేయి సంవత్సరాల మంచురేఖ ఒక అశ్రుబిందువు ఆహా ఆహా నేను అవతరించాను ఆహా ఆహా
ఎడమచేయి తాళం మ్రోగించింది కుడిచేయి వీణాస్వరాలని మీటింది మరుపు అనే ఓ మహానది జలాలపై ఒక నావ తేలుతూ వెళ్తోంది దుఃఖపులోతుల్లోనుండి కూడా ఒక అరుణపద్మం పుట్టగలదు ఆగవద్దు, నా మనసును కదుపు లోలోపల పెనవేసుకున్న భావాలని
ఎడమచేయి చంద్రునివైపుకు చూపిస్తోంది కుడిచేయి విధి యొక్క ఎర్రటిదారాలని చుడుతోంది మనం కోరుకున్న ప్రేమని దేవతలు నీకూ నాకూ వరమందించుగాక మిణుకులాడుతున్నా ఈ వెన్నెలలో ఆహా ఆహా నువ్వూనేనూ ఒకటై కలిసిపోగా ఆహా ఆహా
ఎడమచేయి ఒక ఈకలాగ మారింది కుడిచేయి ఒక చేపమొప్పులాగా కొన్ని జీవితాలు ఆకాశంలో మబ్బులవాటున కొన్ని జీవితాలు కారడవుల్లోని నీడలచాటున సంతోషంగా నిన్ను అనుసరిస్తాను ఒక చిన్నటి మట్టినలకలా మారుతాను ఈ మనుష్యలోకపు సంసారంలో అన్ని అంచులనా తేలుతూ సాగుతూ
ఎడమచేయి నిన్ను గట్టిగా పట్టుంది కుడిచేయి నిన్ను వదిలివేసి పోనిచ్చింది నా చేతులు గుప్పిట్లో బిగిస్తే నీ రూపం తిరిగి నా హృదయంలోకొస్తుంది ఒక సాంబ్రాణి ధూపంలా ఆహా ఆహా నువ్వూ నేను ఐక్యమయ్యాం అవిచ్ఛిన్నంగా అనంతంవరకూ
సా-డింగ్-డింగ్ అను చీనేయ గాయని పాడిన “జువోషు జీ యువే” (ఎడమచేయి చంద్రునివైపుకి) అన్న ఈ పాట “షియాంగ్మీ చెంచెన్ జిన్రూ షువాంగ్” (ప్రేమయొక్క భస్మాలు) (ఆంగ్లంలో: ఏషెస్ ఆఫ్ లవ్) అనే చీనాదేశపు టివీ కథా కార్యక్రమంలో ప్రచురిచతమయ్యింది. ఈ కథలో అమరలోకంలో ఒక దేవతాకన్యగా జన్మించిన జిన్మీ అనే పూలదేవతకి షుఫెంగ్ అను ఒక అగ్నిదేవతాకుమారునికి మధ్యన ప్రణయగాథ నడుస్తుంది. పదివేల ఏళ్ళవరకూ ఈ ఇద్దరూ అనేకానాక ఘట్టాల నడుమ ప్రేమని ఐక్యంచేసుకోలేకపోతారు. వివిధ దేవదానవమానవరూపాలలో జన్మనెత్తుతారు. చివరికి విధినిక్షేపితమైన ప్రేమని అందుకొని ఐక్యం అవగలుగుతారు. మన భారతదేశపు సంస్కృతివలనే చీనా సంస్కృతిలో కూడా ప్రాకృతికదేవతా ప్రభావం, కర్మసిద్ధాంతము, జన్మ-పునర్జన్మలతో నిండిన సంసారము, అంతిమంగా మోక్షసాధన .. వీటన్నింటిపైనా నమ్మకాలు ఉన్నాయి. ఇటువంటి పోలికలు అనాదికాలం నుండీ ఈ రెండు సంస్కృతులలోనూ ఉన్నా, బౌద్ధమతం చీనాలో వ్యాపించిన తరువాత అనేక భారతీయ సాంస్కృతిక చిహ్నాలు కూడా అక్కడ నెలకొన్నాయి.
చంద్రుడు అనగా అమరత్వానికి, మోక్షప్రదమైన పరమానందానికి చిహ్నం. ఈ చిహ్నం చీనా సంస్కృతిలో ఉన్నట్టే, మన భారతదేశంలో కూడా ఉంది (సోమరూపంలో చంద్రుడిని చూసినప్పుడు). మన భారతదేశం యొక్క అసలు పేరు “ఇందు” అని, ఈ పేరు కొన్నిచోట్ల పలకలేక “హిందు” అంటారని, కానీ ఈ అసలు పేరు యొక్క అర్థం “చంద్రుడు” అని షువెన్ ఝాంగ్ (హ్యువెన్ త్సాంగ్) అను భారతదేశంలో పన్నెండేళ్లు గడిపిన చీనా బౌద్ధయాత్రికుడు పేర్కొన్నాడు. ఈ “ఇందు” అన్న పదం వైదికక్రతువులలో సోమరసం పట్టే యూపపాత్ర ద్వారా వచ్చిందని కొందరి విజ్ఞుల అభిప్రాయం. ఈ వైదిక యజ్ఞం ద్వారా ఆకాశంలో నక్షత్రాల గమనాన్ని లెక్కించి, సంవత్సరంలో తిరిగి కాలం పునరారంభం అయ్యే నూతన యుగాది ఘడియను మన జ్యోతిషశాస్త్రం గణిస్తుంది. ఇటువంటి ఖగోళ పరిశీలనలు, నక్షత్రాలు గ్రహాల యొక్క చలనకక్ష్యావిశేషాలు భారతీయశాస్త్రజ్ఞులు అనాదికాలం నుండి గణిస్తూవున్నారు. ఈ నక్షత్రపరిశీలనము కాలగణనము ద్వారానే వ్యవసాయవృత్తిని నడుపుకుని ఆర్థికవృద్ధిని సాధించడము నావికా అన్వేషణం ద్వారా వ్యాపారార్జన చెయ్యడము సాధ్యమయ్యింది. అదే భారతీయ సంస్కృతి, అందువలన “ఇందు” (అనగా చంద్రుని గమన గణనం) మన దేశానికి పేరునే ఇచ్చిపెట్టింది. చీనేయులు మనుష్యులు ఎంతో పుణ్యం సంపాదించిన తరువాతే భారతదేశంలో మానవజన్మనెత్తుతారని, ఈ “ఇందు” దేశం అమరలోకమైన స్వర్గం తరువాత అత్యున్నతమైన లోకమని నమ్మేవారు. ఈ నమ్మకాలు ఇటివలి శతాబ్దాలలో మనదేశం పరాయిపాలనలో బానిసత్వంపాలైన తరువాత లేచిపోయాయనుకోండి, అది వేరే విషయం. పై పాటలో “చంద్రుడు” అని వర్ణించిన చోట వెనుక మోక్షసాధన అన్న అర్థం ఉందని మాత్రం మనం గమనించాలి.
సా-డింగ్-డింగ్ అను చీనేయగాయని పాడిన అనేక పాటలు అక్కడ మహత్ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈమె ఒక సంస్కృతశ్లోకాన్ని కూడా పాటగా మునుపు పాడింది. ఆ పాట రేపు అనువదిస్తాను.
ఈ క్రింద చిత్రికలో టివీ కార్యక్రమంలోని కథలోని కొన్ని అంశాలను ఒక అభిమాని గ్రహించి పాటకు తోడుగా పెట్టాడు. అది కూడా చూడండి.
చీనాభాషను ఇతరదేశాలవాళ్లు పలకడానికి వీలుగా రోమకలిపిని ఆధారంచేసుకుని పిన్యిన్ అను లిపి ఉపయోగిస్తారు. ఆ లిపిలో ఈ పాట సాహిత్యం క్రింద చూడవచ్చు. రోమకలిపిని వారి భాషకి అనుగుణంగా మలుచుకుని, గుణింతాలని పోలిన వివిధ సుడికారాలను ఏర్పరుచుకున్నారు. మన భారతీయభాషలలో కూడా అంతర్జాతీయ సంస్కృతలీపీకరణం (ఐ.ఏ.ఎస్.టి) అను ఒక రోమకలిపి ఉన్నది. ఆ సుడికారాలను (ఏక్సెంట్) మనం తరుచుగా వినియోగించుకుంటే మన భాషలలోని పదాలకు కూడా ఆంగ్లంలో వ్రాసినప్పుడు సందిగ్ధం ఉండదు. దురదృష్టవశాత్తూ భారతీయులు ఈ లిపిని వినియోగించక, మూర్ఖులైన ఆంగ్లేయులు మనపై రుద్దిన బండలిపి అయిన ఆంగ్లలిపిలోనే మనుష్యుల నగరాల పేర్లను వ్రాస్తున్నాము. చీనా మొదలైన అనేక దేశాలవలనే మనం కూడా మనకు సమ్మతమైన రోమకలిపిని త్వరలోనే వినియోగించుకుంటామని నా ఆశ.
అరుగునీడలో సేదతీరుతుండగా మధురమైనక్షణంలో.. నువ్వూనేను ఇద్దరు వ్యక్తులు ఇద్దరి ముఖాలు, కానీ ఒకటే మనసు.. నువ్వూనేను మాయావ్యామోహాలనుండి విముక్తులై బ్రహ్మానందంతో.. నువ్వూనేను నువ్వూనేను, ఈ రెండిటీ అవతల పరమానందంలో ఐక్యమయ్యాము
ఫార్సీ భాషలోని “మన్ ఓ తో” (నువ్వూనేను) అను ఈ కవిత ఎలెక్ట్రానిక్ సంగీతంతో మేళవించి అనూష్ అరాష్ అను ఇద్దరు పారసీక (ఫార్సీ) యువకులు జర్మనీలోని బెర్లిన్ నగరంలో విడుదల చేశారు. ఈ ముద్రణ “ను” అన్ డీజే సంగీతం సమకూర్చగా బెర్లిన్ నగరంలోను, ఆపై ప్రపంచవ్యాప్తంగాను విపరీతమైన ప్రాచుర్యం పొందింది. ఎలెక్ట్రానిక్ సంగీతంపై మమకారంతో ఇరాన్ దేశంలో ప్రభుత్వం చేస్తున్న కట్టడిని తట్టుకోలేక తెగించి దేశం విడిచి జర్మనీకి పలాయనం చేశారు ఈ యువకులు. ఈ కవిత సాహిత్యం ముందుగా ఇరానుదేశపు కవి జలాలుద్దీన్ రూమీ రచించాడట. అతని “దివాన్-ఎ-షంస్” అను కవితాసంపుటినుండి స్వీకృతమయ్యింది. ఈ రూమీ సూఫీ సాహిత్యం విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చిన విషయం అందరికీ విదితమే.
పూర్తి కవితను క్రింద అనువదించుతున్నాను.
అరుగునీడలో సేదతీరుతుండగా మధురమైనక్షణంలో.. నువ్వూనేను ఇద్దరు వ్యక్తులు ఇద్దరి ముఖాలు, కానీ ఒకటే మనసు.. నువ్వూనేను తోటలోని సడి పక్షుల కిలకిల మనకి ప్రాణం నింపుతున్నాయి ఇలా ఈ తోటలోకి అడుగిడగా.. నువ్వూనేను ఆకాశంలో నక్షత్రాలు వస్తున్నాయి, మనల్ని చూద్దామని వారికి ప్రేమబింబమైన చంద్రుడిని చూపిస్తున్నాం.. నువ్వూనేను నువ్వూనేను, ఈ రెండిటీ అవతల పరమానందంలో ఐక్యమయ్యాము మాయావ్యామోహాలనుండి విముక్తులై బ్రహ్మానందంతో.. నువ్వూనేను స్వర్గంలో చిలుకలన్నీ పలకడం మొదలుపెట్టాయి ఈ విధంగా మనం ఒకరితోఒకరు కలిసి నవ్వుతుండగా దానికన్నా విలువైనది నువ్వూనేను ఈ ఏకాంతపు చోట ఒకే క్షణంలో ఇరాక్ లోను ఖొరాసాన్ లోను.. నువ్వూనేను ఇలా ఈ భూమిపై ఈ వ్యక్తిరూపంలో ఉన్నాము, ప్రతివ్యక్తిరూపంలోనూ అనంతమైన స్వర్గంలో ఆనందం నిండిన తలంలో.. నువ్వూనేను
మారో, క్రోకీనామామయ్య కూతురా, మొదటిచూపులోనే మనసిచ్చాను నీకు చెప్పు మరి, నువ్వు లేకుండా ఆనందంగా ఎలా ఉండగలను నేను ఓయి, దుగ్లి దగ్లి దలాలో, పిల్లా, నువ్వూనేను దుగ్లి దగ్లి దలాలో, నా సూరీడూ, నిన్ను ప్రేమిస్తున్నానే
నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను ప్రేమిస్తున్నావు, ఇంక ఇక్కడెలా ఉండేది మనము? పద పోదాం తిబిలీసీకి, అక్కడ కాలేజీకి పోయి చదువుకుందాం ఓయి, దుగ్లి దగ్లి దలాలో, పిల్లా, నువ్వూనేను దుగ్లి దగ్లి దలాలో, నా సూరీడూ, నిన్ను ప్రేమిస్తున్నానే
తిబిలీసీకొచ్చాక, అక్కడొక వాటా అద్దెకి తీసుకుందాం ఎన్నెన్నో జోళ్ళు జిగేళుమనే గాజు దీపాలు కొనుక్కుందాం ఓయి, దుగ్లి దగ్లి దలాలో, పిల్లా, నువ్వూనేను దుగ్లి దగ్లి దలాలో, నా సూరీడూ, నిన్ను ప్రేమిస్తున్నానే
నువ్వు కాలేజీకి పోతే, నేను ఇంటిదగ్గరుంటా సాయంత్రంపూట ప్లెఖానోవ్స్కీ పార్కులో సరదాగా నడుద్దాం ఓయి, దుగ్లి దగ్లి దలాలో, పిల్లా, నువ్వూనేను దుగ్లి దగ్లి దలాలో, నా సూరీడూ, నిన్ను ప్రేమిస్తున్నానే
జార్జియాదేశానికి చెందిన జానపదగీతం “ఎర్తీ నఖ్విత్” (మొదటిచూపులోనే ప్రేమించాను) అన్న పాట ఇది. ఈ పాట పైన వాయించింది చ్వేనేబురేబి అను సంగీతబృందం. చిత్రిక మధ్యలో వచ్చిన అమ్మాయి “త్రియో మందిలి” అనే వేరొక గాయనీబృందంలో ఒకతె. ఈ గాయనీబృందం కూడా ఈ పాటను ఆలపించారు. క్రింద చూడండి. త్రియో మందిలి బృందం పాడిన మరికొన్ని పాటలను నిన్న అనువదించాను.
జార్జియా సంస్కృతిలో చర్చిలో అందరూకలిపి బృందగానం పాడడం ఆనవాయితీ. క్రైస్తవసన్యాసుల మఠాలలో ఈ సంయుక్తగానం పాడే సంస్కృతి మొదలయ్యింది. ఇదే సంస్కృతి జానపదులలో కూడా వ్యాప్తిచెందింది.