తెలుగునేలమీద బ్రతికే కమ్మవాల్లకి నమస్కారాలు,రెడ్డి కులస్తులకి విడిగా వేరొక నమస్కారాలు, కాపులకి నమస్కారాలు, శెట్టి-బలిజ కులస్తులకి నమస్కారాలు. మాలవారికి నమస్కారము, మాదిగలకు విడిగా మరొక నమస్కారము, బ్రాహ్మణులకి (మిమ్మలినెలా మర్చిపోతాము) నమస్కారాలు. చిన్నపాటి సంఖ్యలతో వేగుతూ మెజారిటీ లేని “వగైరా” కులస్థులకి వేవేల ప్రత్యేక నమస్కారాలు.
స్టేజిమీద పెద్దలందరికి పేరు పేరుగా దండాలు చెప్పడం మన సంప్రదాయం కనుక, ఒక బ్లాగుటపా రాసేముందు ఈ విధంగా బ్లాగోదండకం చదవక తప్పదు. క్షమించండి.
ఇక విషయమేమిటంటే, మన ఆంధ్రదేశంలోని రాజకీయకుళ్ళు యొక్క వెగటి వాసనలు ఎక్కడో దేశాలుదాటి బ్రతుకుతున్న మాలాంటివాళ్ళ ముక్కుప్రుటలని కూడా అధరగొట్టేస్తున్నాయి. అస్థిత్వం ఏమిటొ అర్థంకాక “మాజీ తెలుగువాళ్ళం” అయిపోతామేమోనన్న బెంగతో కాలం గడుపుతున్న మాలాంటివాళ్ళ నాలికలకు “అసలు తెలుగు అస్థిత్వం అనేదే లేదురా గురుడా” అనే నిఖార్సైన నిజం చాలా తీపిగా తగులుతోంది.
చిరంజీవి పార్టి పెడతడంట ! మంచిది. రానివ్వండి ముందుకి !! సీ.యెం అయ్యే హక్కు ఒక్క రెడ్డి కులానికి, కమ్మ కులానికి రాసిపెట్టిన హక్కు ఏమీకాదుగదా. దక్షిణాన ఉన్న తమిళనాడులో ఇప్పటికే మూడువేల మున్నేట్ర-కజిగాలు రాజకీయంలో రాటుదేలి ఉన్నాయి. మన ఆంధ్రదేశంలో రెంటితో సరిపెట్టుకోవడం ఎందుకు ?
ఎప్పుడో అరవై ఏళ్ళకిందట, తెల్లవాడిముందు అందరూ సమానంగా సిగ్గుపడింది ఎవ్వడికి గుర్తుంటుంది ? ఆ అవమానాలు భరించడానికి రెడ్డి/కమ్మ/కాపు తారతమ్యం ఏమన్నా అడ్డొచ్చిందా ? మన స్వాతంత్ర్యపోరాటంలో, అందరూ కలిసికట్టుగా ఎదురునిల్చాము గనకే చివరికి ఒక భారతీయత అనేది దక్కింది. ఇంత సాధించిందెందుకు ? అరవై ఏళ్ళ తరువాత కూడా ఇలాగ కులాలంటూ ఎలెక్షను గేములు ఆడుకోవడానికి మరి !
చిన్నప్పుడు “మ్యూజికలు ఛెయిర్సు” అంటూ మూడు ఛైర్ల చుట్టూ నలుగురం పరిగెట్టేవారము. మ్యూజిక్కు ఆగిపోవగానే అందరూ చైర్లమీద పడతారు. ఒక్కడుు అభాగ్యుడు చైరులేక బయటకి పోతాడు. ఈ ఆట ఆడగా ఆడగా, ఒక్క లక్కీ ఫెలోకి రాజభొగ్యం లాంటి ఆఖరి చైరు దొరుకుతుంది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల తమాష ఒక పెద్ద కుల-మ్యూజికలు-ఛైర్సు ఆటలాగ ఉంది. ప్రజాస్వామ్యము అంటూ డాంభికాలు పోవడమే తప్ప, కొద్దిగానన్నా ప్రజలచే పాలన చేయించడం ఇప్పటి సరుకుగాదు. కనీసం ఒక టార్గెట్టు కూడా కాదు.
కళాకారులన్నాక ఒక ఆశయంకోసం పనిచేయడం పాతపద్ధతి. బుర్రలో ఏమీ ఉండనవసరంలేదు. మాటగడసరితనం ఉంటే చాలు, రైటర్లయిపోవచ్చును. భావ వ్యక్తీకరణా లాస్యం అక్కర్లేదు, కొంత ఎర్రగా-బుర్రగా ఉంటే చాలు, ఏక్టర్లయిపోవచ్చును. రాజనీతి తెలియనక్కర్లేదు, సరైన చుట్టరికాలుంటే చాలు, మినిష్టర్లయిపోవచ్చును. ఇదీ ప్రస్తుతం మన తెలుగు సమాజ సంపద.
సినీ అభిమాన సంఘాలు కులసంఘాలు. ప్రవాసాంధ్ర సంఘాలు కుల సంఘాలు. ఇప్పుడు చివరికి న్యూసుపేపర్లు కూడ కుల పేపర్లుగా తయారవుతున్నాయి. ఇలాంటి ఔన్నత్యం వెలగబోస్తున్నందుకు వారి వారసులను చూసి, మన స్వాతంత్ర్య సమరయోధులు గర్వంతో ఉప్పొంగిపోతున్నారు అక్కడ స్వర్గంలో !!
తెలుగువాడినైనందుకు చాలా సిగ్గుపడుతున్నాను. ఈ బ్లాగుముందు, నా నమస్కారాలని అందిపుచ్చుకున్న వారందరికీ ఇందుకని కృతజ్ఞతలు.
కుల అస్థిత్వం చీదరించుకుని నా నమస్కారం పుచ్చికోనివారికి నా ఆలింగనలు.
5 స్పందనలు so far ↓
నేమాని రామక్రిష్ణ // జనవరి 5, 2008 వద్ద 7:01 అపరాహ్నం
చాల బాగా చెప్పారు. రాజకీయకుళ్ళు మరియు కుల కుళ్ళు ప్రవాస భారతీయులను కూడ వదలటం లేదు. తెల్ల దొరల్నుండి స్వాతంత్ర్యం వచ్చింది కాని ఇప్పుడు ఈ నల్ల దొరలు (మన కుళ్ళు రాజకీయనాయుకులు) నుండి స్వాతంత్ర్యం సంపాదించటం అసంభవం.
వరప్రసాద్ // జనవరి 5, 2008 వద్ద 8:51 అపరాహ్నం
ప్రపంచమంతా కొత్త విషయాలు కనుక్కోవడంలో నిమఘ్నమై ఉంటే మనవాళ్ళు మాత్రం కొత్త కులాలను కనుక్కుని ఆ కులాలకు నాయకులను వెతికేపనిలో ఉన్నారు…ఎప్పటికొచ్చేనో మన నాయకులలో మార్పు.
mohanrazz // జనవరి 6, 2008 వద్ద 1:17 పూర్వాహ్నం
కులం కార్డ్ తో వస్తే చుక్కెదురవుతుందని చిరంజీవి కి కూడా తెలుసు. బహుశా చిరంజీవి ‘అందరివాడి ‘ లా వస్తాడేమో కానీ ఒక కులం లెదా ఒక ప్రాంతం కార్డ్ తో రాకపోవచ్చు.
balu // జనవరి 7, 2008 వద్ద 10:16 పూర్వాహ్నం
చిరంజీవి గారి మనస్సులో ఏ ముం దో గానీ అభిమాన సంఘాలూ, కుల గజ్జి గాళ్ళూ కలసి ఆయనని ఒక కుల నాయకుడి గా చిత్రీకరిస్తున్నారు. ఆయన పెట్టబోయే పార్టీ చివరకు కులతత్త్వ పార్టీ గా యధాశక్తి తయారుచేశారు.చిరంజీవి గారు పార్టీ పెట్టాలా వద్దా అన్న సందిగ్దం లో కి నెట్టారు
శ్రీ // జూన్ 11, 2008 వద్ద 2:03 పూర్వాహ్నం
నిజమే, ఈ కులం మన జీవితాలను ఎపుడు వదులుతుందో? మనిషిని మనిషిగా గుర్తించే రోజు నిజంగా వస్తుందా? ఈ యుగంలో వీలవకపోవచ్చు.