తేట తెలుగు – తేనె వంటి తెలుగు

ఇది ముగింపు కాదు

ఆగష్టు 26, 2007 · 1 వ్యాఖ్య

గోకుల్ ఛాట్ లో సమోసా రగడా తినడం, సాయంకాలపు చిరుగాలిలో హుస్సేన్ సాగరం వీక్షించడం.. నాకున్న చిన్నపాటి సంపదలు. తీపి జ్ఞాపకాలు. ఇవేమీ ఎవ్వరినీ హాని కలిగించేవి కావే ! వీటిని ప్రేమించడమే పాపమైపోయిందా ?

నిన్నటి న్యూసులో చదివినది ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నలభై మంది అకాలమరణం చెందారు. ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నవారు మరెంతోమంది. శరీరానికి కాకపోయినా, మనసుకి గాయాలైనవారు ఇంకెంతమందో !

ఏమిటీ అఘాయిత్యం ! మొన్నటికి మొన్న మక్కా మసీదులో బాంబులు. ఇప్పుడు నగరమంతా పేళుల్లు. ఎక్కడికి పోతోంది మన భాగ్యనగరం ? భారతదేశం ఆధునిక యుగంలోకి ముందడుగు పెట్టే కుడికాలు ఈ హైదరాబాదు నగరమని కలలు కన్నామే. ఈ కాలుని నరికేద్దాం అనుకుంటున్నారా ? ఎవ్వరు ఈ రాక్షసులు ?

మన నాయకులందరు కులాలు అంటూ ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటున్నారు. కమ్మ, రెడ్డి, కాపు .. ఎవిరికివారు వేరు పత్రికలు, వేరు రాజకీయ పార్టీలు, వేరు సినీ తారలు. వీటితో చాలదన్నట్టు మతం కోసం పార్టీలు (మజ్లిస్, భాజపా) తెలంగాణాఅంటు ఇంకొకళ్ళు (తెరాస) అమెరికాని ఎదిరించాలంటూ ఇంకొకళ్ళు (కమ్యూనిస్టులు) మన నాయకత్వ శిఖామణులు ఏమి సాధిస్తున్నారు ? ఎవ్వరిని సాధిస్తున్నారు ?

ఎక్కడో గుజరాతులో ఎలక్ట్రానిక్సు చదువుకుంటూ హైదరాబాదుకి టూరు వేసుకుని వచ్చారు విధ్యార్థులు కొందరు. అందులో నలుగురు మృతి. ఇంజనీరింగులో రాంకు తెచ్చుకుని, కాలేజీలో సీటు ఖరారు చేసుకుని అకాలంగా చనిపోయినవాడు ఇంకొకడు. మెడిసిను పూర్తి చేసుకుని దేశానికి వైద్యసేవలందించాల్సినవాడు ఇంకొకడు మృతి. రాఖీ కొనుక్కుందామని వెళ్ళిన అన్నాచెల్లెళ్ళు ఇద్దరు. కోఠీలో పుస్తకాలు కొనుక్కుందామని వెళ్ళి బలైన విద్యార్థులు ఇంకొందరు. సరదాగా గోకుల్ ఛాట్ తిందామనుకోవడమే పాపమైపోయిందా ? ఇలాంటి పసివాళ్ళను, భావి భారత ఆశాకిరణాలను చంపేసారు ఎవ్వరో ఈ రాక్షసులు !!

ఎవ్వరు మనకి ఈ ప్రప్రథమ శత్రువులు ? సర్వమత సామరస్యానికి వేదికై, పేదవాళ్ళు కూడా ప్రజాస్వామ్యం నిలుపుకోగలరు అని నిరూపించిన మన భారతదేశం అభివృద్ధిని చూసి ఓర్వలేని ఈ రాక్షసులు ఎవ్వరై ఉంటారు ? నాయకులమని చెప్పుకుంటున్నవారు కొంత బుర్రపెట్టి ఆలోచించాలి.
ఇది ఒక యుద్ధం. మన భారతదేశానికి స్వాతంత్ర్యం తేరగా రాలేదు. ఇప్పుడు ఆర్థిక అభివృద్ధి, పేదరిక నిర్మూలిన కూడా తేరగా రాబోదు. రాబందులలాంటి శత్రువులు ఎప్పటికీ కాపేసి ఉంటారు. ఈ బాంబు పేళుల్లు ముగింపు కాదు, ఇలాంటివింకెన్నో కష్టాలు మనం భరించక తప్పదు.

కులాలు, మతాలు లాంటి వేషమ్యాలు విడిచిపెట్టి మనం కొంత స్వాతంత్ర్య స్ఫూర్తిని చూపించాలి. ముఖ్యంగా హైదరాబాదులో ఉన్న ముస్లిం సోదరులని దగ్గర చేసుకోవాలి. ఇస్లాంకి రెండు పార్శ్వాలు ఉన్నాయి. ఒకటి అంతరంగానికి సంబంధించిన మతం. రెండోది పరుషమైన రాజకీయ రంగం. ఈ రెండింటినీ విడదీయాలి. ఇస్లాంతో రాజకీయం చేస్తున్నవారు అందరూ పాముతో చెలగాటమాడుతున్నవాళ్ళు. ఈ పార్టీలను వెంటనే నిర్మూలించాలి – మజ్లిస్ లాంటి పార్టీలను, స్టూడెంటు పార్టీలను, లైబ్రరీలు అంటూ చెప్పుకుంటూ ప్రచారం చేస్తున్న పార్టీలను అందరినీ నిర్మూలించాలి. ముస్లిం ప్రజలను ప్రథాన రాజకీయ స్రవంతిలోకి తీసుకురావాలి. ముస్లిం అవ్వడం భారతీయతకు ఏమాత్రం అవరోధం కాదని, వారందరూ పదహారణాల భారతీయులని నమ్మకం కలిగించాలి. లేదంటే ముస్లిం చంచా పార్టీలు – వెనకాల ఊపందించే పాకిస్తాను, బంగ్లాదేశు – ఆ చెంచాలకి పాలుపెట్టి పోషిస్తున్న అరేబియ, చైనా ఇంకా మిగతా దేశాలు – వాటికి ఆకర్షితులవుతారు. ఇది చెయ్యలేని పార్టీలు ఉండి దండగ. కులాలు అంటు కొట్టుకోవడం తప్ప నిజమైన శత్రువులని ఏమాత్రం ఎదిరించలేని చేతగాని దద్దమ్మలు మన రాజకీయ నాయకులు.

ఒకనాటి స్వాతంత్ర్య పోరాటంలో కులాలు అంటూ కొట్టుకుని వుంటే బ్రిటీషువారిని ఎప్పటికైనా ఎదిరించగలిగి ఉండేవాళ్ళమా ? టంగుటూరి ప్రకాశం, బులుసు సాంబమూర్తి, అల్లూరి సీతారామరాజు లాంటివాళ్ళు కావాలి మనకి నాయకుల క్రింద.

వర్గాలు రాజకీయం
Tagged: , ,

1 స్పందన so far ↓

వ్యాఖ్యానించండి