కాశ్మీరు కాదు, కాశ్మీరీలు మన సంపద
ఆగష్టు 27, 2008 · అభిప్రాయములు
→ 10 Commentsవర్గాలు జాతి భావం · సమాజం
సహనం సంస్కృతికి ఆధారం
జులై 24, 2008 · అభిప్రాయములు
మనిషికి అతిపెద్ద శత్రువులు అరి షడ్వర్గాలు అని మన పురాణాలు చెబుతాయి. కోపం, కామం వగైరా .. అట్లే, క్రైస్తవంలో 7 అతి పెద్ద పాపాలున్నాయంటారు.
కానీ, రచయిత ఫ్రాంజ్ కాఫ్కా ఏమని చెబుతాడు అంటే “మనిషికి గల పాపాలు కేవలం రెండే – అసహనం, అత్యాశ. అత్యాశ ద్వారా అతడు స్వర్గానికి దూరమయ్యాడు. అసహనం వల్ల అతను ఎప్పటికీ స్వర్గం చేరలేకపోతున్నాడు.” ఇలా చెప్పిన వెనువెంటనే కాఫ్కా అంటాడు. “కాదు, అసలు మనిషికి గల పాపం ఒక్కటే – అసహనం. అసహనం ద్వారానే అతను స్వర్గానికి దూరమయ్యాడు, అసహనం ద్వారానే తిరిగి స్వర్గం చేరలేకపోతున్నాడు”.
జీవితంలో ఏమి సాధించాలన్నా సహనం కావాలి. సహనశీలి అయినవాడు మనుషుల్లో అత్యుత్తముడు. ఓర్పుగలవాడు మేరుపర్వతంతో పాలసముద్రాన్నే మధించగలడు.
మనదేశ సంస్కృతిలో అతి గొప్ప విషయం మన సహనం. ఈ సహనం ఉండవల్లే భిన్న మతాలు, భాషలు, కళలు, సంగీతాలతో మనదేశం వెలుగొందుతోంది. ఇంతటి అద్భుతం ప్రపంచం మొత్తంలో ఎక్కడా మీకు కనపడదు. సహనానికి సరైన సూత్రం మన దేశచిహ్నంలోనే ఉంది. “సత్యమేవ జయతే”, అనే ఈ వాక్యం ముండక ఉపనిషత్తు నుండి సంగ్రహించి మన దేశ చిహ్నంలో పొందుపరిచారు. “సత్యం ఎల్లప్పుడూ గెలుస్తుంది, నువ్వు నిశ్చింతగా ఉండు, దేనికీ తొందరపడకు”, అని దీని అర్థం.
మనకు నిజంగా ఈ వాక్యం పై నమ్మకం ఉంటే “ఏదో ఆకాశం వచ్చి మీదపడిపోతోంది, మన సంస్కృతి నశించిపోతోంది, చీడపురుగులని తగలబెట్టాయాలి”, అంటూ ఆవేశపడిపోము. ఈ ఆవేశమే అన్ని అనర్థాలకు మూలదాయకం. “హుస్సేన్ కళాచిత్రాలు మన సంస్కృతిని కించపరుస్తున్నాయి.”, అని ఒకడు. “తస్లీమా నస్రీన్ మా మతాన్ని కించపరుస్తోంది”, అని ఇంకొకడు, ఇలా మనం రెచ్చిపోము.
సహనం అంటే ఏమిటి ? ఇది అర్థం చేసుకోవడం చాలా సుళువు. బయట ప్రపంచం మీ ఆలోచనలకి అనుగుణంగా లేదు, కలియుగమో ఏమో కానీ అంతా తల్లకిందులవుతోంది. మీ మాట ఎవ్వరూ వినట్లేదు. మీరు అనుకున్నట్టు, ప్రయత్నిస్తున్నట్టూ ఏమీ జరగట్లేదు. మీకు చిర్రెత్తుకొస్తోంది. ఈ సమయంలో మౌనంగా ఉండి చిరునవ్వు నవ్వడమే సహనం అంటే.
ఈ సద్గుణం మీకు ఉంటే మిగిలిన మనుషులు ఏమి చేసినా మీ మనోనిర్మలం చెదరదు. చెప్పడానికి సుళువుగానే చెప్పేసినా ఇది ఆచరించడం అంత సుళువు కాదు.
మీరు మిమ్మల్ని సహనశీలురు అని అనుకున్నా, కొన్ని హద్దులు దాటి ఉండలేరు. ఉదాహరణలు :
- మీ అమ్మాయి తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్ళిచేసుకుంటాను అంది.
- పోనీ, మీకు కులం మీద పట్టింపు లేదు అనుకుందాం, మీ అమ్మాయి ఒక అవిటివాడిని ముసలివాడిని, బీదవాడిని ప్రేమించింది. అప్పుడు, మీరు ఒప్పుకోగలరా ?
- మీ అమ్మాయి నాకు పెళ్ళి ఇష్టం లేదు, నా బ్రతుకు నన్ను బ్రతకనివ్వండి అంది. అప్పుడు మీరు ఒప్పుకోగలరా ?
- మీ అబ్బాయి మతం మార్చుకుని, వేరే దేశం అమ్మాయిని పెళ్ళిచేసుకుంటాను అన్నాడు. ఒప్పుకుని ఆశిర్వదించగలరా ?
- మీ అబ్బాయి స్వలింగ సంపర్కం తప్ప స్త్రీలపై ఇష్టం లేదు అని చెప్పాడు. అప్పుడు ఒప్పుకోగలరా ?
- మీ తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. వారిని మీరు ఆదరించగలరా ?
- మీ చెల్లెలు పెళ్ళికి ముందు గర్భవతి అయ్యింది. ఆదరించగలరా ?
మన సమాజంలో ఇటువంటి ప్రశ్నలు రోజూ ఎదురుపడుతున్నాయి. ఇవి ఏమీ ఇష్టం లేకపోయినా వీటిని అధిగమించి మనుషలని ప్రేమించగలడం చాలా కష్టం. మనుషుల్లో అత్యుత్తములే దీనిని చెయ్యగలరు. వీళ్ళు ఏసుక్రీస్తుకు, గౌతమ బుద్ధునికి, మహ్మద్ ప్రవక్తకి, శ్రీరామునికి ప్రతిబింబాలు.
ఇంతటి కఠినమైన ప్రశ్నలు రాకపోయినా, చిన్నవాటికే అసహనం తెచ్చుకునే వారు కోట్లమంది ప్రజలు. వీరు రెడ్లు అయితే కమ్మవారంటే పడదు. వీరు హిందువులైతే ముస్లిములంటే పడదు. ఎవ్వరైనా బట్టలు కురచగా వేసుకునే స్త్రీలంటే పడదు. ఇంగ్లీషు మాట్లాడేవాళ్ళంటే పడదు, తెలుగు మాట్లాడే వాళ్ళంటే పడదు. వేరే ప్రదేశం నుండి వలస వచ్చిన వాళ్ళంటే పడదు. స్వలింగ సంపర్కులంటే పడదు.
అన్ని రకాల వారు వచ్చి సమాజాన్ని కలుషితం చేసేస్తున్నారని ఒకటే టెన్షను. నిజానికి అసలు సమస్య బయట వాళ్ళ దగ్గర కాదు, మన మెదడులోనే ఉంది, అదే అసహనం.అసహనం అనేది ఒక వ్యాధి వంటిది. ఈ తెగులు పట్టిన సమాజం అక్కడే ముగిసిపోతుంది.
సహనం అనేది కళకి, సంస్కృతికి ములాధారం. కొత్తని స్వాగతించాలి, అప్పుడే కొత్త కొత్త కళలు, సంగీతాలు పుడతాయి. పుట్టినవన్నీ గొప్పవి కాకపోవచ్చు, కానీ వేలలో ఒకటి మంచిది బయటకి వస్తుంది. కానీ, ఇది రావాలి అంటే ముందు అన్నింటికీ స్వాగతం చెప్పాలి.
ఆధునిక యుగంలో లోకం వెనువేగంగా మారిపోతోంది. ప్రతి రోజు ఒక కొత్త ఆవిష్కరణ వచ్చి సమాజాన్ని ముంచెత్తుతోంది. మన గమ్యం ఎటు పోతున్నామో ఏమీ అర్థం కాదు. ఇటువంటి విచిత్రమైన పరిస్థితి మనిషికి ఇంత తీవ్రంగా ఎప్పుడూ ఎదురు కాలేదు. ఇటువంటి సమయంలో సహనం యొక్క అవసరం మరింత పెరిగి ఉంది. అంతేకాక, సహనం కోల్పోతే దారుణమైన ప్రాణహాని చెయ్యడానికి సరిపోయే తుపాకులు, బాంబులు అందరికీ అందుబాటులో ఉన్నాయి. కనుక, మనం మరింత జాగ్రత్తతో ఉండాలి.
చదువుకున్నవారు కూడా సమాజం ఎంతవేగంగా మార్పు చెందుతోందో అంచనా వెయ్యలేకపోతున్నారు. నేను చెప్పేవి ఏవో సైన్సు ఫిక్షనులాగ అనిపించవచ్చు, కానీ ఇవన్నీ మన జీవితకాలంలోనే జరుగుతాయి.
- వర్చువల్ రియాలిటీ ద్వారా సుదూర ప్రాంతాల నుండే స్త్రీపురుషులు సెక్సు అనుభవించగలుగుతారు. అప్పుడు భార్య-భర్త అన్న పదాలకి నిర్వచనం ఏమవుతుంది ?
- జన్యు టెక్నాలజీ ద్వారా పుట్టబోయే బిడ్డ ఎలా ఉండాలో, ఎలాంటి రోగాలకి నివారణ ఉండాలో తల్లిదండ్రులు ముందే డిసైను చెయ్యగలుగుతారు. అప్పుడు జాతి, ఆచారాలకి అర్థం ఏముంటుంది ?
- ఒక బిడ్డ జన్యువులు కేవలం తల్లి నుండి, తండ్రి నుండే కాక మొత్తం మానవ జీనోము నుండీ వస్తాయి. అప్పుడు తల్లి, తండ్రి అన్న సంబంధానికే అర్థం ఏముంటుంది ? మానవజాతి మొత్తం బిడ్డకి తల్లి కాదా ?
- ఒక స్త్రీ చిత్రం / వీడియో చూసి, ఆమె నగ్న సౌందర్యం ఎలా ఉంటుందో అంచనా వెయ్యగలిగే సాఫ్టువేరు తయారవ్వుతాయి. అప్పుడు ఆడపిల్లలు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చర్చకి అర్థం ఏమిటి ?
- మీరు ఒకసారి వీడియోలో మాట్లాడితే, మిమ్మల్ని మరో మనిషిగా మార్చివేసి అతడు మాట్లాడాడు అని మోసం చెయ్యగల సాఫ్టువేరు వస్తుంది. ఈ పరిస్థితిలో ఎవ్వరు చెప్పేది నిజమో. అతడు నిజంగా అనుకున్న మనిషో కాదో, ఎలా తెలుసుకోగలం ?
నేను చెప్పింది నమ్మకపోతే మీరు సెర్చిచేసి తెలుస్కోండి. (4) ఇప్పటికే తయారయ్యి ఉంది, నేను వెళ్ళబోయే కాంఫరెన్సులో ఒక విద్యార్తి దీనిపై తన పరిశోధనని సమర్పించబోతున్నాడు. ఇక (5) మీద నేను స్వయంగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఈ టెక్నాలజీ 7-8 కెమేరాలు ఉండే ఒక గదిలో పనిచేస్తోంది. మరో ఐదేళ్ళలో సాధారణ వీడియోపై పనిచెయ్యగలదు.
మేము పనిచేసే చిన్నపాటి టెక్నాలజీలతోనే ఇన్ని పెద్ద మార్పులు వస్తుంటే ప్రపంచం మొత్తం శాస్త్రవేత్తలు పనిచేస్తున్న టెక్నాలజీలు అన్నీ ఎలాంటి మార్పులు తేగలవో ఊహించగలరా ? ఇలాంటి టెక్నాలజీలు మనల్ని ముంచెత్తినప్పుడు మనకి మరో మార్గం ఉండదు. అందుకని, ఇప్పటినుండే సహనం అలవర్చుకోవడానికి ప్రయత్నిద్దాం.
→ 6 Commentsవర్గాలు అభివృద్ధి · భవిష్యత్తు · సంస్కృతి
నగరాలు వర్ధిల్లాలి
జులై 6, 2008 · అభిప్రాయములు
నాగరికత తొలిగా బుడి బుడి అడుగులు పెట్టిన దేశం మనది. నాగరికత అంటే నగరాలలో నివశించడం. అతి పురాతనమైన హరప్పా నాగరికతలో మన పూర్వీకులు సామాజిక జీవనం చేసారు. ఈజిప్టు, మెసోపొటామియా నాగరికతలకి హరప్పా తోబుట్టువు. కానీ మిగతా నగరాలలో మహారాజులు పిరమిడ్లు కడితే హరప్పాలో పౌరప్రజలు సామాజిక ధాన్యాగారాలు, స్నాహ్నశాలలు కట్టారు. సామరస్యానికి మొదటి పుట్టినిల్లు ఈ భూమియే. హరప్పా నాగరికతలోని నగర నిర్మాణం చూస్తే ఇప్పటి ఇంజనీర్లకే కళ్ళు మిరుమిట్లు గొలుపుతాయి. అతిచక్కగా ఆలోచించి అన్ని అవసరాలనూ తీర్చేటట్లు మన పూర్వీకులు నగరాలు నిర్మించారు.
వీరికి మనం ఇప్పుడు వారసులు కావాలి. మన జనాభాని అతివేగంగా నగరాలలోకి మళ్ళించాలి. అద్భుతమైన ప్లానింగుతో మహానగరాలు నిర్మించాలి.
ఈ మధ్యన చాలామంది పత్రికలలో, బ్లాగులోకంలో నగరాలు వచ్చి మన పల్లెటూళ్ళను చెడగొడుతున్నాయని వాపోతున్నారు. పచ్చని పంటచేలు, పిచ్చుకలు అంటూ కవిత్వం చెబుతున్నారు. నగరాలు వచ్చి అన్నింటినీ మంట కలిపేస్తున్నాయి అని గోలచేస్తున్నారు. విచిత్రంగా పర్యావరణవాదం ముందుకి తెస్తున్నారు. ఈ అపోహని చూసి ఇక బ్లాగు వ్రాయక తప్పదని నేను నిర్ణయించుకున్నాను.
పర్యావరణానికి ప్రాణస్నేహితులు ఎవరో తెలుసా ? నగరాలు.
పర్యావరణానికి అతిపెద్ద శత్రువు ? వ్యవసాయం.
ఇదేమి నేను చెప్తున్నది కాదు. ప్రపంచంలోని పర్యావరణవేత్తలు అందరూ మూకుమ్మడిగా చెప్తున్న విషయం. నమ్మకం కుదరకపోతే గ్రిస్టు సైటులోకి వెళ్ళి శోధించండి.
పర్యావరణంలోని జీవవైరుధ్యం అతి భయంకరంగా హత్య కావించబడినది మనిషి వ్యవసాయం చెయ్యడం నేర్చిన తరువాత. అడవులు నరికివేసి వన్యప్రాణులని అంతం చేసాడు మనిషి. అభివృద్ధి చెందిన దేశాలలో పల్లెటూళ్ళలో ఇంధన వినియోగం చూస్తే కళ్ళు తిరుగుతాయి. నగరప్రజలకి పది రెట్లు ఎక్కువ ఇంధనం వాడుతారు అక్కడ. దీనిద్వారా కాలుష్యం, గ్లోబల్ వార్మింగు మరింత పెరిగిపోతాయి.
మనుషులందరూ ఆకాశహర్మ్యాలలో నివశిస్తూ, ఇంధనానికి సోలార్ విద్యుత్తును వినియోగించుకుంటూ, కొద్దిపాటి భూమిలో వారి వ్యవసాయ అవసరాలు తీర్చుకుంటూ, మిగతా భూమినంతటినీ వన్యప్రాణులకి వదిలిపెడితే ఎలాగ ఉంటుందో ఊహించుకోండి !
ఇదే మనకి కావలిసిన భవిష్య నాగరికత. ఇదే పర్యావరణవాదం. నగరాలు దీనికి జీవనాధారం.
భారతదేశం పల్లెటూళ్ళలో నడుస్తుంది అని, మన సంస్కృతి పల్లెటూళ్ళలో క్రోడీకృతమై ఉంది అని చాలామంది ప్రచారం చేస్తుంటారు. ఇది పచ్చి అబద్ధం.
ఇప్పటి నగరాలలో ప్రపంచానికే అతిప్రాచీనమైనది వారణాసి. ఇది మా ఇంటిపేరు, నేను భారతీయుడిని. పల్లెటూరి వాదాన్ని పటాపంచలు చెయ్యడానికి ఇది సరిపోతుందా ?
పల్లెటూళ్ళని పొగుడుకునే వారు ఒక ముఖ్యమైన విషయం మరిచిపోతుంటారు – మన దేశ జనాభా. వేదాలు వ్రాసినప్పుదు మన జనాభా 40 వేలు, కాళిదాసు కాలానికి 40 లక్షలు, స్వాతంత్ర్య సమయానికి 30 కోట్లు, ఇప్పుడు 110 కోట్లు. దీనిని ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అని అంటారు. మన సంస్కృతి అంటూ చిలక పలుకులు చెప్పేముందు ఒకసారి దీనిగురించి ఆలోచించాలి.
ఇంతమంది జనాభాని పల్లెటూళ్ళలో పెడితే నెమళ్ళకి, చిరుతపులులకి, ఎలుగుబంట్లకి స్థలం మిగలదు ! జనాభా పెరుగుదల కూడా పల్లెటూళ్ళలో ఎక్కువగా ఉంటుంది, వ్యవసాయ పనులకి పిల్లలు పనికివస్తారు కనుక. నగరాల్లో పిల్ల సైన్యం అవసరం ఉండదు కనుక ఎక్కువ పిల్లలని కనరు. ప్రజలందరినీ తీసుకొచ్చి నగరాలలో పెడితే జనాభా పెరుగుదల ఆటోమేటిక్కుగా ఆగిపోతుంది.
న్యూక్లియర్ విద్యుత్తుని వ్యతిరేకించేవారు కూడా మన జనాభా గురించి మరిచిపోతుంటారు. పారిశ్రామిక యుగంలో సుఖజీవనానిికి ప్రతి మనిషికి ప్రతి రోజుకి 125 KWH కావాలి అని డేవిడ్ మెకేయ్ లెక్కగట్టారు (ఆయన బ్లాగులో, పుస్తకంలో పర్యావరణం గురించి వింత సూచనలు చేసే వారి చెవి గిల్లిపెట్టారు. చదివి ఆనందించండి). 110 కోట్లమందికి సోలార్ విద్యుత్తుతో ఇంధన అవసరాలు సమకూర్చాలంటే మనదేశం మొత్తం గాలిమరలతో, సోలార్ పానెళ్ళతో నింపెయ్యాలి. అప్పుడు కానీ, దేశ పర్యావరణం మొత్తం సర్వనాశనం కాదు.
అందుకే ముక్కు మూసుకుని మనం ప్రస్తుతం న్యూక్లియర్ విద్యుత్తు వినియోగించుకోవాలి. ప్రజలందరినీ నగరాలకి రప్పించి ఆకాశ హర్మ్యాలు కట్టాలి. మన ప్రజలందరికీ 20 వేల ఏళ్ళకు పైగా సరిపడే థోరియం నిల్వలు మన దేశంలో ఉన్నాయి. వీటితో విద్యుత్తు తెచ్చుకుని మన పనులు చేయపించుకుంటే కాయకష్టం చెయ్యవలసిన అవసరం ఏ భారతీయుడికి ఉండదు.
ఒకసారి ధనికులమైనాకా, జాగ్రత్తగా ఓ 500 ఏళ్ళలో మన జనాభాని 10వ వంతుకి తగ్గించుకోవచ్చు. అప్పుడు ఇంక మనకి న్యూక్లియర్ విద్యుత్తు అవసరమే ఉండదు . కేవలం సోలర్ విద్యుత్తుతోటే గడపవచ్చు !
ఈ ఆధునిక భారతీయ నాగరికత మన ఆశయం కావలి. అప్పుడే మనం మన పూర్వీకులకి వారసులం అని అనిపించుకోగలం.
→ 6 Commentsవర్గాలు అభివృద్ధి · ఇంధనం · భవిష్యత్తు
వింత పశువుల వీధిపోరాటాలు
జులై 6, 2008 · అభిప్రాయములు
ఆంధ్రజ్యోతి పత్రిక పైకి కృష్ణ మాదిగ అనుచరులు దాడికి దిగడం, తరువాత ఎడిటర్ని పొలీసులు అరెస్టు చెయ్యడం వంటి పరిణామాల వల్ల ఈ మధ్యన బ్లాగులోకంలో దళిత హక్కులపై చర్చ జరుగుతోంది. దళిత రక్షణ చట్టం ఎలా అపహాస్యం చేస్తున్నారో తాడేపల్లి గారు నిర్మొహమాటంగా వివరించారు. మహేశ్ కుమార్ గారు దీనికి ప్రతిగా సమాధానమిచ్చారు.
మరో ప్రక్క పొలీసులను నక్సలైట్లు హత్యచెయ్యడంపై చదువరి, మహేశ్, దిలీప్ గారి బ్లాగులలో కథనాలు వచ్చాయి.
మన సమాజంలో సమానత లేదు. ఇటువంటి పరిస్థితిలో, అణగారిన వర్గాలు పోరాటం చేసి వారి హక్కులను సంపాదించుకొంటారు అని మనం చాలామంది నమ్ముతున్నాం.”నేను దళిత పక్షపాతిని” అని అంటే “నేను బడుగువర్గాల పోరాటాన్ని సమర్ధించుతాను” అని అర్థం. కానీ, ఈ పోరాటమనేది ఎంతవరకూ నిజం ?
నా దృష్టిలో ఈ పోరాటాలకు అర్థం లేదు. విద్యలేని వాడు తన హక్కుల గురించి ఎలా తెలుసుకోగలడు ? ఏది సాధ్యమో తెలియకుండా, ఎటువంటి ఆశయం అర్థవంతం అయినదో తెలియకుండా, ఎవరన్నా పోరాటం చెయ్యగలరా ? వీధిలో పశువులు ఒకదానితో ఒకటి కలబడి కుమ్ముకోవడానికి ఈ పోరాటాలకి తేడా ఏమిటి ?
“విద్యలేనివాడు వింత పశువు” అని మన నానుడి. పశువులకి కూడా బుర్ర ఉంటుంది, మెదడు ఉంటుంది. మనిషికీ పశువుకీ తేడా ఎక్కడ అంటే విజ్ఞానం వద్ద. పరిపూర్ణ మానవత్వం సంపాదించుకోవాలంటే విద్యావంతులు అయివుండాలి. ఇటువంటి కనీస మానవత్వం కూడా మన దేశపౌరులకి మనం ఇవ్వకుండా ఇంకేమి హక్కుల గురించి అడగగలం ? నా దృష్టిలో విద్యకి దూరం చెయ్యడమే అతిపెద్ద మానవహక్కుల ఉల్లంఘన. మన ప్రభుత్వం దీనికి పరిపూర్ణ నైతిక బాధ్యత వహించాలి. చదువులేని పశువులకి కులం తప్ప మరేదీ కనపడదు.
దళిత ఉద్యమ మేధావులని చెప్పుకుంటున్నవారు వారి మందీ మార్బలంలో విద్యావంతులు ఎంతమందో చెప్పగలరా ? లేదు. వారే కాదు, రాజకీయ నాయకులని తిరుగుతున్నవారిలో ఎవ్వరూ వారి అనుచరగణంలో విద్యావంతులు ఎందరో చెప్పరు. నక్సలైట్లలోనూ ఇదే సంగతి. వీరి వెనక ఉన్న దండు మనుషులందరివీ గొర్రె-బుర్రలు. “డూ డూ బసవన్న” అని డబ్బుతో పిలిస్తే డూ అని తలాడించే తలకాయలు. మన సమాజంలో అతిపెద్ద గౌరవం తెచ్చిపెట్టేది ధనబలం. ప్రజలు విద్యావంతులు కానంతవరకూ ఇదిలాగే సాగుతుంది.
కృష్ణమాదిగకి వ్యతిరేకంగా రాసినంతమాత్రాన ఆంధ్రజ్యోతి దళిత వ్యతిరేకి అయిపోతుందా ? డబ్బులేని దళితుల జీవితం ఎలావుంటుందో పరిశీలించాలి. భూస్వాముల కింద నొక్కితే నొక్కినట్టు పడి ఉండాలి వీళ్ళు. పిలిస్తే వచ్చి లెట్రిన్లు కడిగిపెట్టాలి. వాళ్ళ అమ్మాయిలని అల్లరిచేస్తే మూసుకుని పడివుండాలి. కించపరిస్తూ జోకులు వేస్తే “అహహో” అని నవ్వాలి. ఒక తెలివైన విద్యార్థిని జాతి పేరుతో వెకిళి చెయ్యడం కంటే దరిద్రమైన విషయం నేను చూడలేదు. పేదవాళ్ళైన దళితులు ఎన్నిసార్లు ఇది అనుభవించారో లెక్కలేదు. ఏ దళిత హక్కుల చట్టం వీరిని కాపాడుతుంది ? డబ్బు, చదువే వీరిని కాపాడగలవు. దీనినే కామన్ సెన్సు అంటారు.
డబ్బున్న దళితులు ఎన్ని అవమానాలు భరించివుంటారు జీవితంలో ? ఏవో అరాకొరా, అసలు కొరగావు. డబ్బు ఉన్న దళితులు చేసే ఇబ్బందులు సాకుగా చూపించి దళితులందరినీ ఒక్కగాటన కట్టివేసి తాడేపల్లి గారు సంబోధిస్తున్నారు. ఇది అసలు సమంజసమేనా ?
బడుగువర్గాలని సమర్ధించే వారు కూడా విద్య యొక్క ఆవశ్యకతని పట్టించుకోవట్లేదు. మనిషిని పశువు కంటే ఎక్కువ చేసేది శ్రమ కాదు, విద్య. సమాజంలో మార్పు తీసుకురావాలంటే వచ్చేది శ్రామిక వర్గం నుండి కాదు, విద్యావంతుల నుండి. ప్రపంచం ఏమిటో తెలియకుండా, విజ్ఞానం లేకుండా తుపాకీలిచ్చినంత మాత్రాన ఎవ్వరు హక్కులు తెచ్చుకోగలరు ?
మనిషి శ్రమజీవి అంటారు. ఇంధనంతో ఇంజనులు నడపడం నేర్చిన తరువాత మనిషి శ్రమకి కాలం చెల్లింది. ఏ విధమైన శారీరిక శ్రమ చెయ్యకుండానే ప్రపంచంలోని మనుషులందరూ గడపవచ్చును. దీనికి సరిపడ ఇంధనం మన వద్ద ఉంది (ప్రస్తుతానికి న్యూక్లియర్ విద్యుత్తు, మన జనాభా తగ్గించుకుంటే కేవలం సోలార్ విద్యుత్తు). ఉండవలసినది సరైన దిశా నేతృత్వం, పట్టుదల మాత్రమే. విద్యుత్తుతో ప్రతీ పనిని చేయపించి మనిషులందరూ విశ్రాంతి తీసుకోవచ్చును. ఇదే తరువాతి యుగం.
పారిశ్రామిక విప్లవం అనేది మనిషిని పశువునుండి పూర్తిగా వేరుచేసింది. శ్రమకి అవసరం తీసివేసింది. కానీ, ప్రస్తుతం ఈ ఫలితాలను కేవలం కొంతమంది మాత్రమే అనుభవిస్తున్నారు. వీరిని ధనిక వర్గాలు అంటారు – ఏ పనీ చెయ్యకుండా కులాశాగా గడపుతున్నారు వీళ్ళు.
గమ్మత్తైన విషయం ఏమిటంటే ఇదేవిధంగా ప్రతి మనిషీ ఉండవచ్చును. పారిశ్రామిక విప్లవం తరువాత మొదటి సారిగా కొన్ని సమాజాలలో పేదరికం నిర్మూలింపబడింది. ప్రజలందరికీ సమానంగా వైద్య, ఆహార సదుపాయాలు దొరికాయి. మునుపటి సమాజంలో కేవలం కొందరికే ఇది దక్కింది. ప్రపంచంలోని మానవ సమాజాలన్నింటినీ పారిశ్రామికం చెయ్యడం ద్వారా మనం మరో యుగంలోకి వెళ్తాం. ఇప్పటి సమస్యలు ఆ యుగంలో హాస్యాస్పదంగా ఉంటాయి.
మనిషి బుద్ధి జీవి. ప్రతి మనిషీ ఈ విధంగా ఉండగలిగేటట్లు మనం ప్రయత్నించాలి. ఇదే అసలైన మానవత్వం. దానికి కనీస అవసరం ప్రజలందరినీ విద్యావంతులు చెయ్యడం. దీనిని గుర్తించక అడ్డదిడ్డమైన ఆశయాలకోసం పనిచెయ్యడం కాలయాపన, మూర్ఖత్వం.
→ 3 Commentsవర్గాలు రాజకీయం · సమాజం
పెట్రోలు ధరలపై నీచ రాజకీయం
జూన్ 10, 2008 · అభిప్రాయములు
మీలో ఎవ్వరైనా పెట్రోలు ధరల పెరుగుదలకి వ్యతిరేకంగా రోడ్డుపై నిరశన ప్రదర్శనలు జరిపారా ? అయితే, తక్షణంగా ఈ పోస్టు చదవండి.
రాష్ట్రంలో జరుగుతున్న నీచ రాజకీయాలు చూసి నాకు కొంత మాట మూగవోయింది. రాయాలనుకున్న పోస్టు రాయలేకపోయాను. కానీ “పర్ణశాల” బ్లాగులో ఒక కామెంటు వ్రాసాను. ఇప్పటికి దీనితో సరిపుచ్చుతాను.
పర్ణశాల బ్లాగులో క్రూడు పెట్రోలు ధర లీటరుకి 25 రూపాయలు, శుద్ధికి 2 రూపాయలు, రవాణాకి 10 రూపాయలు కలుపుకున్నా 37 రూపాయలే ఉంటుంది. మిగిలిన సొమ్మంతా ప్రభుత్వం పన్నులుగా దండుకుంటోంది అని వ్రాసారు. గుండెలు మండుతున్నాయి అని వ్రాసారు. మొన్న నీచ రాజకీయాలకి ప్రతిరూపమైన ఈనాడు పత్రికలోనూ ఇదే విధంగా సంపాదకీయం వచ్చింది.
ఒకసారి నిజాలని వెలికి చూద్దాం.
1 లీటరు క్రూడు ఆయిలు శుద్ధిచేసిన తరువాత 1 లీటరు పెట్రోలు వచ్చేస్తుందా ? రాదు. కొంత భాగం పోతుంది. శుద్ధి చేసిన పెట్రోలు ధర ఎక్కువ ఉండడానికి కారణం అది.
అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలు ధర పెరగడానికి కారణం డాలరు విలువ క్షీణించడం (పెట్రోలు అమ్మకాలన్నీ డాలర్లలో నడుపుతున్నారు అమెరికా ఒత్తిడి మూలంగా).
ఫ్యూచర్ ట్రేడింగు ద్వారా పెట్రోలు ధరలని స్పెక్యులేటర్లు విపరీతంగా పెంచేస్తున్నారు. ఇంకో రెండేళ్ళలో క్రూడు ధర బేరెల్ కి 200 డాలర్లు చేరుకుంటుందని ఉవాచా (అంటే పెట్రోలు ధర రెట్టింపు అవుతుందన్నమాట).
ప్రభుత్వం పన్నులన్నీ తీసిపడేసినా పెట్రోలు ధరలు పెరగడం ఖాయం. దీనికి మూలకారణం మన భూమిలో శిలాజ ఇంధన నిల్వలు చాలా పరిమితంగా ఉండడమే (మహా వస్తే పెట్రోలు మరో 60 ఏళ్ళు, బొగ్గు మరో 200 ఏళ్ళు వస్తాయి). దీనికి తోడు గ్లోబల్ వార్మింగు బెడద పొంచి ఉంది.
పెట్రోలు ధరలపై పన్ను అధికంగా ఉండడం వల్ల ఇతర ఇంధనాల వినియోగం ప్రోత్సహించగలుగుతాము. మన భవిష్యత్తుకి ఇది అత్యవసరం. పన్ను విధించడం ద్వారా ప్రభుత్వం పెట్రోలు లాభాలని కొంత ప్రజలకి తిరిగి మళ్ళించగలుగుతోంది (అవినీతితో ఈ డబ్బులు హుళుక్కి అయిపోతున్నది వేరే విషయం). సమాజంలో ధనిక వర్గాలు పెట్రోలుని మరింత ఎక్కువగా వినియోగించుతారు. సామాన్య ప్రజానీకంతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇందుకని పెట్రోలు భారం పడేది ధనిక వర్గం పైనే, మధ్యతరగతి వర్గంపై కూడా కొంత పడుతుంది. కానీ పేదవర్గంపై అతి తక్కువ. థియరీలో, ప్రభుత్వం వసూలు చేసిన పన్నులు పేదలపై ఖర్చు పెట్టవచ్చు.
బుర్ర ఉన్న కమ్యూనిస్టులు ప్రభుత్వం పన్నులు తగ్గించాలని ఎందుకు డిమాండు చేస్తారు ? పేదలపై ప్రేమ ఉంటే ధనికులకి సబ్సిడీ ఇవ్వడమేమిటి ? వాతావరణాన్ని నాశనం చెయ్యమని డబ్బు బాబులకి ప్రోత్సాహం ఎందుకు ? ప్రస్తుతం అంతా సిగ్గులేని రాజకీయం నడుస్తోంది.
ప్రజలపై పెట్రోలు భారం తగ్గించాలంటే అత్యవసరమైన పని రైలు నెట్వర్కుని ఆధునీకరించడం. మొత్తం విద్యుత్తుతో నడిపిస్తే పెట్రోలు భారం సరుకుల రవాణాపై పడదు. అప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు పెరగవు. ద్రవ్యోల్పణం అదుపులోకి వస్తుంది. దీర్ఘకాలికంగా, మన దేశానికి ఇది అత్యవసరం.
ఇది జరగాలంటే విద్యుత్తు ఉత్పత్తి అతివేగంగా పెరగాలి. దీనికి రెండే మార్గాలు – ఒకటి బొగ్గు, రెండు న్యూక్లియర్ విద్యుత్తు. బొగ్గు 200 ఏళ్ళు మాత్రమే వస్తుంది. మన దేశ అవసరాలకి లక్ష ఏళ్ళు సరిపడేంత థోరియం నిల్వలు మన దేశంలో నిమిడి ఉన్నాయి. థోరియం వినియోగించుకుంటే ప్రపంచంలోనే మనదేశం అతి ధనిక దేశం అన్నమాట. సౌదీ అరేబియాకి తాతలం మనం. గ్లోబల్ వార్మింగుపై మనం నిజాయితీగా ఉంటే బొగ్గుని మనం విడిచిపెట్టి న్యూక్లియర్ విద్యుత్తుని ప్రోత్సహిస్తాము. ఈ విషయం లోనూ కమ్యూనిస్టులు ప్రజా శ్రేయస్సుకి రివర్సులో పనిచేస్తున్నారు.
ప్రభుత్వం వద్ద ఉన్న డబ్బులన్నీ (పెట్రోలుపై లక్షల కోట్లు నష్టాపోతోంది ప్రభుత్వం) సబ్సిడీలంటూ చివరకి ధనిక, మధ్యతరగతి వర్గాలకి అప్పగిస్తే ఇంక భవిష్యత్తు సంగతేమిటి ?
→ 10 Commentsవర్గాలు ఇంధనం · రాజకీయం
హైదరాబాదుకి వస్తున్నా, మిత్రులు కలుద్దామా ?
మే 3, 2008 · అభిప్రాయములు
శెలవులు దొరికి మొత్తం మీద భారతదేశం వచ్చాను. మూడు రోజుల క్రితం శంషాబాదులో దిగాను. ఓ నెల రోజులపాటు కుటుంబం, చుట్టాలు, పాత మిత్రులు అందరినీ కలవాలని నా ప్లాను. ఈ సారి సరదాగా, నా బ్లాగు మిత్రులని కూడా కలిస్తే ఎలా ఉంటుంది అని ఐడియా వచ్చింది.
మా అమ్మనాన్న ఉండేది తూర్పుగోదావరి జిల్లాలో కనుక నాకు సాధారణంగా కుదరదు. కానీ, కాలేజీ స్నేహితులని కలవడం కోసం హైదరాబాదు, బెంగుళూరు ట్రిప్పులు వేస్తున్నాను. హైదరాబాదుకి 11వ తారీఖు ఆదివారం వద్దామని నా ప్లాను. ఒక మూన్నాలుగు రోజులు అక్కడుంటాను.
మరి 11వ తారీఖు సాయంత్రం, సరదాగా కలవడానికి మీలో ఎవ్వరికన్నా వీలు దొరుకుతుందా ? ఎక్కడా, ఏమిటి అనేది కలిసి నిర్ణయించుకుందాం.
→ 7 Commentsవర్గాలు Uncategorized
నీరు, న్యూక్లియర్ విద్యుత్తు రిఫరెన్సులు
ఏప్రియల్ 18, 2008 · వ్యాఖ్యానించండి
జాన్ మెక్కార్థీ స్టాంఫోర్డు యూనివెర్సిటీలో ప్రొఫెసరు. ఈయన కృతిమ మేధస్సు రంగంలో చాలా కృషిచేసారు (LISP భాషను ఈయనే కనుగొన్నారు). ప్రస్తుతం మానవాళి భవిష్యత్తు మీద రచనలు చేస్తూ విజ్ఞానాన్ని ప్రజలకి అందిస్తున్నారు.
ఈయన స్వచ్ఛమైన నీటి అందుబాటు గురించి ఇక్కడ వివరిస్తున్నారు.
న్యూక్లియర్ విద్యుత్తును ఈయన చాలా ప్రోత్సహిస్తున్నారు. దీనిపై ఎంతో వివరంగా ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈయన మిత్రుడు, యూనివర్సిటీ ఆఫ్ పిట్స్ బర్గులో ఫిజిక్సు ఆచార్యుడు అయిన బెర్నార్డు కోహెన్ గారు న్యూక్లియర్ విద్యుత్తు గురించి మరింత వివరంగా ఒక పుస్తకం రచించారు. దీంట్లో ప్రజల భయాలకు నివృత్తిగా ఎంతో సమాచారం పొందుపరిచారు. ఈయన ప్రకారం మన భూమిలోని న్యూక్లియర్ నిల్వలు కొన్ని బిలియన్ సంవత్సరాలు మనుషుల అవసరాలకు సరిపోతాయి !
శాస్త్రవేత్తలు ఇలాగ గణాంకాలతో శ్రద్ధగా వివరిస్తారు. రాజకీయవేత్తలు ప్రజలను భయపెట్టడమేగానీ ఇచ్చే వివరాల్లో నిజాయితీ ఉండదు. ఏది ఏమైనా, మనిషి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అంకెలతో ఆలోచించాలి గానీ ఫీలింగులతో కాదు.
→ Leave a Commentవర్గాలు అభివృద్ధి · ఇంధనం · నీరు · భవిష్యత్తు
Tagged: ఇంధనం, నీరు, భవిష్యత్తు
ఎమర్జెన్సీ రూములో విద్యా రంగం
ఏప్రియల్ 13, 2008 · అభిప్రాయములు
మా అమ్మనాన్నలిద్దరూ ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు. పచ్చని గోదావరి జిల్లాలలో పనిచేస్తున్నారు. ఇక్కడ అక్షరాస్యత శాతం కేవలం 70% (అంటే 30% మందికి చదవడం, వ్రాయడం కూడా చేతనవదు అన్నమాట). మా అమ్మనాన్నలు పనిచేసే స్కూళ్ళలో తరగతికి 100 మందికి పైబడి విద్యార్థులు. ఇక్కడ కూర్చోడానికి బల్లలు లేవు. పిల్లలకి తినడానికి సరైన ఆహారం లేదు. ఏమాత్రం వర్షాలొచ్చినా స్కూలు ప్రాంగణం బురదమయం. వ్యవసాయంలో కోతపనులు జరిగేటప్పుడు చాలామంది పిల్లలు వాళ్ళ ఇళ్ళలో సాయంచేయడానికి స్కూలు ఎగ్గొడతారు. ప్రతి తరగతికి ఒక 10% మంది పై తరగతికి వెళ్ళకుండానే బడి మానేస్తుంటారు. చివరికి పదవ తరగతి పాస్ అయ్యేది కేవలం సగం మంది మాత్రమే. ఆడపిల్లలో అయితే చాలామంది పదవ తరగతికి ముందునే పెళ్ళిల్లు చేసుకుంటారు. మా అమ్మనాన్నలకి పెళ్ళి శుభలేఖలు వస్తుంటాయి.
మా అమ్మగారి స్కూలులో చాలామంది హాస్టలు పిల్లలు. చాలా వెనకబడిన సామాజిక తరగుతులనుండి వచ్చినవారు. హాస్టలులో నడిచే రాజకీయాలు, అవకతవకలు చాలా ఎక్కువ. చదువుపై శ్రద్ధ లేకపోవడం వలన ఈ పిల్లల ఉత్తీర్ణతా శాతం చాలా తక్కువ. ప్రభుత్వం అందించే టెక్స్టు పుస్తకాలని వీరిలో కొందరు బ్లాక్ మార్కెట్లో అమ్మివేస్తుంటారు. ఇలాంటి పిల్లలు ఇంజనీరింగు, వైద్యం లాంటి వృత్తి విద్యలను చేజిక్కించుకోగలరా ? ప్రవేశ పరీక్షలలో గెలుపొందగలరా ? మనదేశంలో 90% పిల్లలు ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నారు.
రిజర్వేషన్లను విమర్శించేముందు ఒకసారి ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. వీటివల్ల వచ్చే లాభనష్టాలను బేరీజు వేసేముందు, మనదేశంలో విద్యారంగాన్ని సమూలంగా అభివృద్ధిచెయ్యడానికి మనకి ఒక ఐడియా కావాలి.
విద్య – మనదేశానికి ఆఖరి ఛాన్సు :
మన దేశ జనాభాలో పెక్కుమంది యువతరం. వీరికి సరైన విద్యనందిస్తే దేశం పెనువేగంగా అభివృద్ధి చెందుతుంది. జనాభా పెరుగుదల మందగించగానే, సమాజంలో వృద్ధులు మరీ ఎక్కువైపోతారు. మనం వృద్ధులమయ్యాక మనకి పెన్షన్లు ఇవ్వడంకోసమై మన తరువాతి తరం వాళ్ళు పనిచెయ్యాల్సి వస్తుంది. దేశ ఆర్థిక ప్రగతి విపరీతంగా కుంటుపడుతుంది.
చైనాలో ఇప్పుడు ఇదే ప్రోబ్లం వస్తోంది. కానీ, ఆ దేశం ఇప్పటికే విద్యారంగంలో బాగా పెట్టుబడి పెట్టి 100% అక్షరాస్యత సాధించింది. అభివృద్ధి రేసులో చివరి అంకంలో వారి ఆర్థిక వృద్ధి రేటు 10%గా మరికొంత కాలం కొనసాగుతుంది.
మనదేశంలో చాలామందికి అర్థంకాని విషయం ఏమిటంటే, మనంకూడా రేసు చివరి అంకంలో ఉన్నాం. రాబోయే 30 ఏళ్ళలో మనం పేదరికాన్ని నిర్మూలించలేకపోతే, వృద్ధుల శాతం పెరగడం వల్ల, మనదేశం చిరకాలం పేదదేశంగా మగ్గిపోతుంది. మాలవాడు కానీ, బ్రాహ్మణుడు కానీ – చదువు విడిచిపెడుతున్న ప్రతి చిన్నారికి మన గుండె కళుక్కుమనాలి. ఈ విషయంలో మన తరం ఒక్కరిని కూడా అలక్ష్యం చెయ్యడానికి వీలులేదు.
మనదేశంలో విద్య దౌర్భాగ్యం :
రాజ్యాంగంలో విద్యకి బడ్జెట్లో కనీసం 6% ఇవ్వాలి అని రాసివుంది. నా దృష్టిలో విద్య అనేది అతి ముఖ్యమైన సమస్య, కనీసం 10% ఖర్చుపెట్టాలి. ఎంత ఎక్కువ ఖర్చుపెడితే అంత, ఎంత వేగంగా అయితే అంత – మన ప్రజలని విద్యావంతులని చెయ్యాలి. కానీ ఎప్పుడూ మనదేశ బడ్జెట్లో 4% మించి విద్యకి డబ్బులు కేటాయించలేదు. ఇప్పటి కేంద్రీయ బడ్జెట్లో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యకోసం అంతా కలిపి ఇచ్చినది 24,115 కోట్ల రూపాయిలు. అదే రక్షణకోసమై 1,00,0000 కోట్ల రూపాయిలు. రైతులకి వ్యవసాయ రుణాల మాఫీపై ఇచ్చిన సబ్సిడీ 60,000 కోట్ల రూపాయిలు.
విద్య అంటే ఇంత నిర్లక్ష్యం ఉండడం వలననే మనదేశానికి స్వతంత్రం వచ్చి 60 ఏళ్ళయినా ప్రతి భారతీయునికి ప్రాథమిక హక్కైన విద్యని అందించలేకపోతున్నాం.
100 మంది పిల్లలకి కనీసం ఒక ఉపాధ్యాయుడు కూడా లేడు. ఇంతమంది విద్యార్థులను పర్యవేక్షించడం మన ఉపాధ్యాయులకి చేతగాని పని. ఎన్నికలకి, ప్రభుత్వ పండగలకి ఈ ఉపాధ్యాయులచే వెట్టిచాకిరీ చేయిస్తున్నారు. పబ్లిక్ పరీక్షలప్పుడు వేలకొద్దీ జవాబుపత్రాలను దిద్దిస్తుంటారు. ఇంతటి ఒత్తిడి తట్టుకుని పనిచెయ్యడం అసాధ్యం. చాలామంది టీచర్లు అందుకనే వారి ఉద్యోగ ధర్మాన్ని మొత్తంగానే అలక్ష్యం చేస్తున్నారు.
మన ప్రభుత్వ విద్యా బడ్జెట్టు 90% టీచర్లకి జీతాలివ్వడానికే సరిపోతోంది. ఇంత తక్కువమందికి చాలీచాలని జీతాలిస్తూంటేనే, ఉన్న డబ్బులు అయిపోతున్నాయి. అంటే విద్యకి ఎంత తక్కువ ఖర్చుపెడుతున్నామో అర్థం చేసుకోవచ్చు. చాలా స్కూల్లలో త్రాగునీరు, టాయిలెట్ సదుపాయాలు లేవు. ఆటస్థలం ఉండదు. కొన్నిసార్లు చెప్పుకోవడానికి ఒక భవనం కూడా స్కూలుకి ఉండదు. దేశంలో 9.54% స్కూళ్ళలో స్కూలు మొత్తానికీ ఒకటే గది ! దేశంలో 10 కోటి స్కూళ్ళు ఉండగా, లక్ష స్కూళ్ళలో బ్లాక్ బోర్డు లేదు. 20 వేల స్కూళ్ళలో ఒక ఉపాధ్యాయుడు కూడా లేడు. మరి వీటిని స్కూలు అని పిలవడం ఎందుకో.
ప్రాథమిక విద్య కందకం లోతుల్లో కొట్టుమిట్టాడుతుంటే, ఉన్నత విద్య పాతాళంలోనే అఘోరిస్తోంది.
మన దేశ జనాభాలో పట్టభద్రులు 0.5%. వీరిలోనే సగం మంది ఏ విధమైన ఉద్యోగానికి పనికిరాని వారు. మిగిలిన 0.25% మందిలో ఇంటర్నెట్టు ఉపయోగించడం తెలిసినవారు కేవలం 5%, అంటే మొత్తం జనాభాలో 0.01% అన్నమాట. దేశంలో సాఫ్టువేరు పరిశ్రమ వెలుగు జిలుగులు చూసి సంబరపడిపోయేముందు తెలుసుకోవలసింది ఏమిటంటే ఇది ఉపాధి కల్పించేది కేవలం 0.01% జనాభాకి అని. రాబోయే పదేళ్ళలో కంప్యూటరు పరిశ్రమకి సరిపడే మనుషులు దొరక్క కంపెనీలన్నీ ఫిలిప్పీన్సు, చైనా లాంటి దేశాలు తరలిపోగలవని నాస్కాం ఇప్పటికే హెచ్చరికలు మోగిస్తోంది. మనుషుల కొరత వలననే సాఫ్టువేరు కంపెనీ ఉద్యోగుల జీతాలు కూడా అసాధారణంగా 20% పెరుగుతున్నాయి.
మన దేశంలో 10,000 మందికి ఒక డాక్టరు ఉన్నాడు. అమెరికాలో అయితే ఇంతమందికి 546 డాక్టర్లున్నారు. మనం 1/500 అన్నమాట. అర్జెంటుగా మనదేశానికి 6 లక్షల డాక్టర్లు కావాలి.
ఏ పరిశ్రమ చూసినా చదువుకున్న నిపుణుల కొరత మన దేశంలో అత్యధికంగా ఉంది. ఇలాంటి దేశంలో పరిశ్రమలు నెలకొల్పడానికి ఎవ్వరు ముందుకు వస్తారు ? పరిస్థితి ఇలావుంటే, విద్యలో నాణ్యత తగ్గిపోతోంది అంటూ వృద్ధాచార్యులు పేపర్లలో సంపాదకీయాలు వ్రాస్తున్నారు – ‘కాలేజీలు ఇష్టమొచ్చినట్లు కట్టేస్తున్నారు, వీటి నాణ్యత మరుగుపడిపోతోంది” అని. నాణ్యత అదేవస్తుంది, ముందు సాధ్యమైనన్ని వృత్తివిద్య కాలేజీలు కట్టాలి.
నేను రీసెర్చి విద్యార్థిని గనుక, చివరిగా కొంత పరిశోధనా రంగం గురించి కూడా చెబుతాను. మన దేశంలో అన్నిరకాల ఇంజనీరింగు విభాగాలు కలిపి పీ.హెచ్.డి పట్టా పొందేవారు ఎంతమందో తెలుసా ? ఏడాదికి 400 ! ఇందులో అత్యధికులు సరైన పరిశోధనా పత్రాలు సమర్పించకుండానే పట్టా పొందుతున్నారు. ఐ.ఐ.టీ లాంటి మేటి సంస్థలలో కూడా అంతర్జాతీయ ప్రమాణాలు గలిగిన పరిశోధనా పత్రాలు అతి తక్కువ. చైనాను గమనిస్తే, ఈ దేశం ఇప్పటికే అమెరికా కంటే ఎక్కువ పీ.హెచ్.డి పట్టాలను తయారుచేస్తోంది. పరిశోధన నైపుణ్యంకూడా అంతర్జాతీయ ప్రమాణాలలో ఉంది.
ప్రజాస్వామ్యానికి విద్య అవసరం :
చైనా కంటే మనం ఎందులో గొప్ప, అని అడిగితే ఠక్కున చెప్పే జవాబు – మనం అతిపెద్ద ప్రజాస్వామ్యం అని. కానీ అబ్రహాం లింకన్ అన్నట్లు “విద్య లేని ప్రజాస్వామ్యం మితం లేని వంచన”. ప్రజాస్వామ్యమనేది పనిచెయ్యాలంటే ప్రజలకి చదువు వచ్చి ఉండాలి. ప్రపంచంలో ఎక్కడా నిరక్షరాస్యులతో ప్రజాస్వామ్యం పనిచెయ్యలేదు. పైకి షోకు చెప్పుకోవడమే కానీ, మనదేశంలో నిజంగా నడుస్తున్నది కులస్వామ్యం. ఒకరకమైన ఫ్యూడల్ రాజ్యం. ప్రజల్లో 100% అక్షరాస్యత వచ్చేవరకు ప్రజాస్వామ్యపు ఆలోచనలు వారికి అర్థం కావు.
ప్రపంచంలోని పెనువిప్లవాలు అన్నీ విద్య-సమాచారం ఆధారంగా వచ్చాయి.
- వ్రాత అనేది కనుగొనేముందు సమాజంలో అక్షరాస్యుల శాతం 0%. మనుషుల ఆలోచనలన్నీ తిరిగినవి జాతి, తెగ, గోత్రం మీదనే.
- వ్రాత కనుగొన్న తరువాత మతం పుట్టింది. రాజ్యం పుట్టింది. డబ్బు అనేది పుట్టింది. సమాజంలో అక్షరాస్యుల శాతం 5%. సమాజం ఫ్యూడల్ పద్ధతిపై నడిచేది.
- పుస్తకాలు ముద్రించడం మొదలు పెట్టిన తరువాత ప్రజలలో అక్షరాశ్యత మొదటిసారిగా 100% అయ్యింది. ఈ దెబ్బకి రాచరికం పోయింది. ఫ్యూడల్ ప్రభువులు పోయారు. ప్రజాస్వామ్యం వచ్చింది. పెట్టుబడిదారీ సమాజం తయారయ్యింది.
మనదేశంలో కులం ప్రకారం పార్టీలు తయారవుతున్నాయి. రాజకీయ నాయకులు మత ఉద్రేకాలను రెచ్చగొడుతున్నారు. ప్రజలు గొర్రెలవలే ఓట్లు వేస్తూ తోడేళ్ళ లాంటి నాయుకులను కుర్చీలనెక్కిస్తున్నారు. ఇవన్నీ ఏమీ ఆశ్చర్యం కలిగించే అంశాలు కావు. వ్రాత తెలియని వాడు జాతి-కులం గురించే ఆలోచిస్తాడు. పుస్తకాలను ఎరగని వాడు మతాన్నే నమ్ముతాడు.
జ్ఞాన యుగంలోకి 100% మంది అడుగుపెడితే, అటువంటి సమాజం ఆలోచించే విధానమే తేడాగా ఉంటుంది. మనం బ్లాగర్లు కనుక అటువంటి సమాజంలో ఉన్నాం అనుకోవచ్చు. కానీ, తప్పు. మనం జీవితంలో 60% నుండి 99% వరకు అజ్ఞానులతో సంభాషణ సాగిస్తున్నాం. ఈ ప్రభావం మన ఆలోచనా-సరళిపై ఉంటుంది. నేను సమాజాన్ని మార్చాలనుకుంటున్నాను. సంపూర్ణమైన సహనం, స్వేఛ్ఛ కలిగిన మనుషులమధ్య ఉండాలనుకుంటున్నాను. ఇది జరగాలంటే, ఒకటే మార్గం. ప్రజలందరూ విద్యావంతులు కావాలి. అసలైన విప్లవం ఇదే. కమ్యూనిస్టులదీ కాదు. ప్రాంతీయవాదులదీ కాదు. మతోద్రేకులదీ కాదు.
అతివేగంగా భారతీయులను విద్యావంతులను చెయ్యడం ఎలా ?

చరిత్రలో సమాచారం చేరవెయ్యడానికి కొత్త మార్గాలు కనుగొన్న ప్రతిసారీ, విద్యా రంగంలో ఒక విప్లవం వచ్చింది.
వేదాలు వల్లించే కాలంలో వ్రాత కనుగొనబడలేదు. అందుకని, వేదం మొత్తం బట్టివేసేవారు. వ్రాత కనుగొన్న తరువాత, మొదటిసారిగా టీచరు అనే వృత్తి అవతరించింది. కానీ, గ్రంథాలయాలు ఎక్కడనో కానీ ఉండేవి కావు. బట్టీవెయ్యడం అనేది ఇంకా కొనసాగింది. పుస్తకాలు ముద్రించిన తరువాత మొదటిసారిగా ఒక టీచరు వివిధ సబ్జెక్టులని వివరించడం మొదలయ్యింది. విద్యాబోధనలో పుస్తకాలని సంప్రదించగలిగిన తరువాత తప్పులకి ఆస్కారం తక్కువ. యూరపు-అమెరికా విద్యలో పుస్తకాల ఇంపార్టెన్సుని గుర్తించింది. చారిత్రిక కారణాల వల్ల మనదేశంలో ఇంకా గుర్తించలేదు. ఉదాహరణకి, అమెరికాలో ఓపెన్-బుక్ పరీక్షలు ఎక్కువ (పరీక్షలో నువ్వు నీకు కావలసిన పుస్తకం పట్టుకు వెళ్ళవచ్చు). మనదేశంలో బట్టీవెయ్యగలిగిన వాడే పరీక్షలో నెగ్గగలడు.
ప్రస్తుతం మనం పుస్తకాలని కూడా వెనక్కి పెట్టేసి ఒక సరికొత్త ఇంటర్నెట్టు యుగంలోకి అడుగుపెట్టాము. విద్యార్థికి ఇప్పుడు తరగతి గదిలో కూర్చుని పాఠం నేర్చుకోవలసిన అవసరం లేదు. ఇంటర్నెట్టులో సెర్చి చేసి అనేక విషయాలను తనంతట తానే తెలుసుకోగలుగుతున్నాడు.
డబ్బులు ఎక్కువగా లేని మనదేశంలో విద్యని పెంపొందించడానికి సాధ్యమైనంత పదునుగా బాణాలు సంధించాలి. ఉన్న డబ్బుని అతిజాగ్రత్తగా ఖర్చుపెట్టాలి. ఇప్పుడు దేశంలో మంగళివాడు మొదలుకొని పాలవాడివరకూ సెల్ ఫోన్లు వాడుతున్నారు. ఇదే విధమైన విప్లవం విద్యలో కూడా కలిగించాలంటే ఏది మార్గం ?
ప్రతి గ్రామానికి ఆప్టికల్-ఫైబరు కలిపితే అయ్యే ఖర్చు, రోడ్లు వెయ్యడానికి అయ్యే ఖర్చులో 1%. ఇంటర్నెట్టు వాడుకకి మనదేశంలో ముఖ్య సమస్య విద్యుత్ సరఫరా. సరైన కరెంటు ఉన్నంతకాలం ప్రజలు దీనిని అద్వితీయంగా ఉపయోగించుకోగలరు.
ప్రస్తుతం డిజిటల్ వీడియో కెమారాల వలన, ఉపాధ్యాయులు పాఠం చెబుతున్నప్పుడు దానిని వీడియోలో బంధించడానికి అయ్యే ఖర్చు అతి తక్కువ. హార్డు డిస్కులు చవుక గనుక, ఇటువంటి వీడియోలు సేకరించి, సర్వర్లలో పొందుపరచడం కూడా చాలా సుళువు. మన స్కూళ్ళలో టీచర్లు విపరీతమైన కొరతలో ఉన్నారు. చాలా మందికి విద్యాబోధనలో అలక్ష్యం. వారి సబ్జెక్టు మీద వారికే సరైన అవగాహన లేదు. ఇటువంటి పరిస్థితిలో, ఈ వీడియోలు అద్భుతంగా పనికివస్తాయి.
ఆప్టికల్ ఫైబరు లేనంతవరకూ, పట్టణాలలో ఔత్సాహికులు ఇటువంటి వీడియోలను సీ.డీ.ల్లో భద్రించి పల్లెటూళ్ళకి తిరిగి స్కూళ్ళకి అప్పగించవచ్చు. వికిపీడియా నిర్మించడానికి మన తెలుగు బ్లాగర్లు కృషిచేసినట్లే, ఒక వీడియో వికిపీడియాని ఆవిష్కరించవచ్చు.
కానీ, వీడియోలు చూపించినంత మాత్రాన చదువు ఎవ్వరికీ అబ్బదు. విద్యార్థులతో ఎల్లప్పుడూ ఇచ్చిపుచ్చుకుని సంభాషణ నడపగలిగే మెంటర్లు కావాలి. విద్యార్థులకొచ్చే సందేహాలను నివృత్తి చెయ్యగలుగుతూ ఉండాలి. ప్రశ్నలకి “వీడియో/వెబ్ వికిపీడియాలలో” సమాధానాలు ఎలా వెతుక్కోవచ్చో పిల్లలకి నేర్పగలగాలి.
కార్నెగీమెలన్లో ఆచార్యులుగా పనిచేస్తున్న ప్రొఫెసర్ రాజ్ రెడ్డిగారు ఈ విషయంపై ఇప్పటికే చాలా ఐడియాలు ఆచరణలోకి పెట్టారు. కొంతకాలం ఆయన స్టుడెంటుగా పనిచేసిన అదృష్టం నాది. ఈ విద్యాబోధనని “లెర్నింగ్ బై డూయింగ్” అంటారు.
ప్రస్తుతం “21వ శతాబ్ది గురుకులం” అని మన రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు నడుస్తోంది. ఈ ప్రాజెక్టులో కంప్యూటర్ పర్జిజ్ఞానాన్ని మాస్టర్ డిగ్రీగా అందిస్తున్నారు. ఒకసారి డిగ్రీ పుచ్చుకున్న తరువాత, ప్రతీ విద్యార్థి మెంటరు క్రింద పనిచెయ్యవచ్చు. టిచర్ల కొరతని కొంతవరకూ ఇలా భర్తీ చెయ్యవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు మనదేశంలోని కంప్యూటర్ నిపుణుల కొరతని అరికట్టవచ్చు.
ఇదేవిధమైన ఆలోచనలు పాఠశాల-కళాశాల లెవల్లో కూడా మనం అమలు జరపాలి.
→ 4 Commentsవర్గాలు భవిష్యత్తు · విద్య · సంస్కృతి
Tagged: భవిష్యత్తు, విద్య
150 కోట్ల భారతీయులకి నీరు ఎక్కడ ?
ఏప్రియల్ 8, 2008 · అభిప్రాయములు
కర్ణాటక, తమిళనాడు సినీతారలు ఒకళ్ళినొకళ్ళు తిట్టుకుంటున్నారు. తెలంగాణకి నీరందనివ్వకుండా ఆంధ్రా వాళ్ళు కాజేస్తున్నారని కొందరు గొంతు చిచ్చుకుంటున్నారు. మహానగరాల్లో ప్రజలు నీరు లేక బిందెల వెనక బిందెలు పెట్టీ ఎదురుచూస్తున్నారు. భారతదేశంలో ఈ ఏడాది అందరికీ నీరు దొరుకుతుందా ? ఉగాది రోజున పంచాంగం ఈ ప్రశ్నకి సమాధానం చెబుతుందేమో చూద్దాం.
నీటి కొరత పరివృత్తి :

మనిషికి గాలిలోని ఆక్సిజన్ తరువాత అతి ముఖ్యమైనది నీరు. శరీరంలో 65% నీరే. త్రాగడానికి మాత్రమే కాదు, పారిశుద్ధ్యానికి, ఆహారం కోసం వ్యవసాయానికి, పరిశ్రమలకు, విద్యుత్ ప్లాంట్లకు – అన్నింటికీ స్వచ్ఛమైన నీరే కావాలి. ఒక మనిషి ఏడాది జీవించడానికి సరిపడా ఆహారం, త్రాగునీరు, పారిశుద్ధ్యం సమకూర్చడానికి 1700 క్యూబిక్ మీటర్ల స్వచ్ఛమైన నీరు అవసరం. మన భారతదేశంలో ప్రస్తుత జనాభా 100 కోట్లకి పైమాటే. అయినా, ప్రస్తుతం మనదేశంలో ఉన్న స్వచ్ఛనీటి వనరులు ప్రతి ఒకరికి ఏడాదికి 1800 క్యూబిక్ మీటర్లు సమకూరుస్తున్నాయి. నీటి విషయంలో మన దేశం అత్యద్భుతమైన ధనిక దేశం అన్నమాట.
ఈ నీటి ధనరాశుల వల్లే చరిత్ర శాంతం మనదేశంలో నాగరికత పరిడవిల్లింది. చరిత్ర అంతా, ప్రపంచంలో 1/5 మానవజాతి భరత ఖండంలోనే నివశించేవారు. మన దేశ వైశాల్యం చిన్నదైనా ఇలాగ జరగడానికి కారణం మన నీటి సంపద. మన దేశంలో వ్యవసాయానికి యోగ్యమైన సాగుభూమి 558,080 చదరపు కిలోమీటర్లు. దీంట్లో మనం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉన్నాం. ఉదాహరణకు, చైనాలో 545,960 చ.కిలు, అమెరికా సమ్యుక్త రాష్ట్రాలలో 223,850 చ.కిలు, అతిపెద్ద దేశమైన రష్యాలో 46,000 చ.కిలు. మన దేశ వైశల్యంలో కళ్ళు చెదిరేటట్లు 48% భూమి పంటలకు యోగ్యమైన భూమి – దీనికి కారణం మన నదీ సంపద.
కానీ, రానున్న ఏళ్ళలో ఒక ఉపద్రవం ముంచుకు రాబోతోంది. జనాభా పెరుగుదల వల్ల ఒక మనిషికి కనీస అవసరమైన 1700 క్యుబిక్ మీటర్ల నీటిని ఇక మన నదులు,వర్షపాతాలు సమకూర్చలేవు. తరువాయి 20 ఏళ్ళలో సగటు మనిషికి లభ్యమయ్యే నీరు 1000 క్యుబిక్ మీటర్లకి కుదించుకుపోతుంది. 21వ శతాబ్ది మధ్యమానికి మన దేశజనాభా 150 కోట్ల నుండి 180 కోట్ల మధ్య స్థిరపడుతుంది. అప్పుడు మనదేశం తీవ్రమైన 30% నీటికొరతని ఎదుర్కోబోతోంది.
నీటి కొరత వల్ల ప్రత్యక్ష పరిణామం దప్పిక కాదు, ఆకలి. ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్న ఆహార ధరలు ఇక కిందకి దిగిరావు, పైగా మరింత పెరుగుతాయి.
మన నీటి అవసరాలలో అత్యధిక భాగాన్ని మింగివేసేది వ్యవసాయమే – ఉదాహరణకి యమునా నదిలో 85% నీరు వ్యవసాయ భూములకే వెళుతోంది. దీనివలన, ఢిల్లీ నగరంలోని జలాశయాలకి యమున నీరు ఇవ్వలేకపోతోంది. మన రాజధానిలో పారిశుద్ధ్యానికి సరిపడా నీరులేక విపరీతమైన కుళ్ళు, కాలుష్యం మోతబడుతున్నాయి. ఇదే కథ ప్రతీ మహానగరంలోనూ పునరావృతమవుతోంది. పారిశుద్ధ్యం లేకపోవడం వలన చాలా రోగాలు మరలా మనదేశంలో విజృంభించుతున్నాయి.
నదులకు సంస్కృతికి సమానతను గుర్తించిన దేశం మనది. పురాతనమైన సరస్వతీ నదీ తీరాననే మొహెంజొదారో నాగరికత వెలసింది. ఈ నాగరికత వెలసింది సింధులోయలలో కాదు సరస్వతీ తీరాన. భౌగోళిక మార్పుల వల్ల ఆ మహానది ఎండిపోయింది. నాగరికత అంతా ధ్వంసమైపోయింది. కానీ, భారతీయులు ఈ నదిని మరచిపోకుండా తమ విద్యా దేవతకి సరస్వతి అని పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు, మన తరంలో నదులు ఎండిపోవడం వలన ఇండియానే అంతరించిపోయే ప్రమాదంలో పడింది. అలనాటి సరస్వతీ-నాగరికతకి వారసులు తప్పులు తెలుసుకుంటారో, లేదో మరి !
నీటి కొరతకి కారణాలు :
ప్రథమ కారణం జనాభా యొక్క విచ్చలవిడి పెరుగుదల. వేదాలు రచించిన కాలంలో మన దేశ జనాభా 40వేలు. స్వతంత్రం నాటికి 25 కోట్లు. గత 60 ఏళ్ళలో ఇది అతి ఘోరంగా 100 కోట్లయ్యింది. మరో 50 ఏళ్ళకి 180 కోట్లు కాబోతోంది. ఈ పెరుగుదల చిత్రాన్ని బీ.బీ.సీ లో గమనించండి. మొదట్లో మన జనాభాకి సరిపడే ఆహారం అందివ్వడానికి భూమి సరిపోదనుకునేవారు. కానీ, హరిత విప్లవం వల్ల పంట రాబడి బాగా పెరిగింది. భూమి కొరత ప్రస్తుతానికి ఒక అంశం కాదు. కానీ, నీటి కొరత ఖచ్చితంగా దెబ్బకొట్టబోతోంది.
మనదేశంలో నీరు సరిసమానంగా లేదు. మేఘాలయలో 2818 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండగా, రాజస్థానులో 100 మిల్లీమీటర్లే. ఈ వైవిధ్యం వలన నీటి కొరత ఇప్పటికే దేశంలో చాలా చోట్ల ఎదురవుతోంది.
నీటి సమస్యపై మన దేశంలో సరైన అవగాహన లేదు. ఢిల్లీలో మంచి నీటి పంపులలో కన్నాల వల్ల 40% నీరు నేలపాలవుతోంది. ఇదే ధోరణి చాలా చోట్ల ఎదురవుతోంది. ప్రజలు కూడా నీటిని వృధాగా పారబోస్తున్న ఉదంతాలు చాలా ఎక్కువ.
జనాభా పెరుగుదలతో పాటు నీటి లభ్యతని దెబ్బతీస్తున్న మరో అంశం గ్లోబల్ వార్మింగు. భూమి ఉష్ణోగ్రత పెరగడం వలన హిమనదాలు కరిగిపోతున్నాయి. జీవనదులకి నీరు తగ్గిపోతోంది. భూమిలోని నీటిలో మరింత భాగం ఆవరి రూపంలో ఉండిపోతోంది.
ఆర్థిక వృద్ధి వలన మధ్య తరగతి ప్రజలు తినే ఆహారం విషయంలో కూడా మార్పులు వస్తున్నాయి. మునుపటికంటే ప్రజలు మరింత ఎక్కువ మాంసాహారం తింటున్నారు. మాంసానికి అవసరమయ్యే నీరు శాకాహారానికంటే చాలా ఎక్కువ (6-7 రెట్లు ఎక్కువ). ఉదాహరణకి, ఒక కిలో గొడ్డుమాంసం తయారి చెయ్యడానికి 15,500 లీటర్ల నీరు పడుతుంది. మాంసాహారం తింటున్నప్పుడు ప్రజలు ఈ విషయం గమనించరు.
నీటి కొరత వల్ల రాజకీయ పరిణామాలు :
ప్రస్తుతం ప్రపంచంలోని యుద్ధాలలో పెక్కువాటికి నీటి కొరతే కారణం. ఇజ్రాయెలు-పాలస్తీను సమస్య మూలం జలాశయాల ఆజమాయిషీ రాజకీయంలో ఉంది. సుడానులోని మారణకాండ వెనుకా ఇదే కారణం. ఆఫ్రికాలో వర్షపాతం తక్కువ నమోదు అయినప్పుడు యుద్ధాలు ఖచ్చితంగా పెరుగుతున్నాయని సామాజిక శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
పాకిస్తాను, బంగ్లాదేశు, చైనాలతో ఇప్పటికే నీటి వినియోగంపై గొడవలు ముదురుతున్నాయి. దీనికంటే తీవ్రంగా, విపరీతమైన వైవిధ్యం ఉన్న మన దేశంలో నీటికొరత భయంకరమైన విచ్ఛిన్నతలకి దారితీసి దేశాన్ని ముక్కలు చెయ్యగలదు.
జనాభా పెరుగుదల మనదేశంలో సమానంగా లేదు. దక్షిణాన, కుటుంబంలో సగటున 2.2 పిల్లలను కంటుండగా, ఉత్తరాన కొన్ని రాష్ట్రాలలొ 6 పిల్లలను కంటున్నారు. దీనికి, మూల కారణం నిరక్షరాస్యత, విద్యలేమి. ఉత్తరప్రదేశ్, బీహారు రాష్ట్రాలలో ఇప్పటికే జనాభా మించిపోయి ఉండడంతో ఎందరో ఉపాధి కోసమై ముంబాయికి, పంజాబుకి, దక్షిణానికి తరలి వస్తున్నారు. ఈ కాందిశీకుల వల్ల రాజకీయాల్లో చాలా అసూయ, అలజడి పుడుతోంది. ముంబయి లోని రాజ్ థాకరే అల్లర్లకి ఇదే కారణం. ఇలాంటి గొడవలు మరీ ఉధృతమవ్వగలవు.
టెక్నాలజీ పరిష్కారాలు :
దేశంలో నదులని అనుసంధానం చెయ్యడం వలన నీటి కొరతని కొంతవరకు తగ్గించుకోగలమని కొంతమంది శాస్త్రవేత్తల అంచనా. దీని కోసం ప్రభుత్వం ఇప్పటికే భారీ మొత్తంలో నిధులని మంజూరు చెయ్యడం మొదలు పెట్టింది. వరదల సమయంలో తేరగా సముద్రంలో కలుస్తున్న నదీ జలాలను మిగతా నదులకి మళ్ళించాలనేది క్లుప్తంగా దీని ఐడియా.
కానీ పర్యావరణం అనేది చాలా క్లిష్టమైనది. ఒకదానితొ మరెన్నో అంశాలు ముడివడి ఉంటాయి. ఉగ్రమైన బ్రహ్మపుత్ర, గంగా వరదల వల్ల బంగాళాఖాతంలో స్వచ్ఛమైన నీరు ఎంతో చేరుతోంది. దీని వలన సముద్రం యొక్క ఆవిరి మబ్బులు ఏర్పడడం జరుగుతోంది. ఈ వరదలు కలగకపోయినట్లైతే, ఈ మబ్బులు ఉండకపోవచ్చు. మనదేశంలో ఋతుపవనాలు దెబ్బతినవచ్చు. ఈ విషయంపై పర్యావరణ శాస్త్రవేత్తలకు ఇంకా సంపూర్ణ అవగాహన లేదు.
భూమిలోపల నిలవ ఉండే ఇంకుడు నీళ్ళు మరొక పరిష్కారం. వీటిని మరింత అనువుగా ఉపయోగించుకోవాలి. వర్షపు నీరు భూమిలోకి సరిగ్గా ఇంకేటందుకు శాస్త్రీయమైన ఇంకుడు గుంటలు తవ్వించాలి. నదులలోని నీటి కొరతను కొంత అప్పుడు తట్టుకోవచ్చు.
పంట పొలాలలో మనం ప్రస్తుతం నీటిని సరిగ్గా వాడటంలేదు. పెక్కుభాగం వృధా చేస్తున్నాము. ఎరువులు, పురుగుమందులు విచ్చలవిడిగా కలపడం వలన చాలా నీరు పనికిరాకుండా పోతోంది. మేలైన పద్ధతుల ద్వారా దీనిని కొంతవరకూ తగ్గించవచ్చు. ఇజ్రాయెల్ దేశంలో ప్రతీ నిటిబొట్టుని డ్రిప్ ఇర్రిగేషన్ పద్ధతి ద్వారా సమర్దవంతంగా ఉపయోగించుతున్నారు. ఈ విధానాలలో మనదేశం నేర్చుకోవలసినది చాలా ఉంది.
విద్యుత్ అవసరాలకు స్వచ్ఛమైన నీరు అవసరం. హైడ్రో-ఎలక్ట్రిక్ ప్లాంట్లలో నీటిని పునర్వినియోగించే సదుపాయాలు చెయ్యాలి. న్యూక్లియర్ ప్లాంట్లలో విడుదలయ్యే వేడిని చల్లబరచడం కోసం ప్రస్తుతం స్వచ్ఛమైన నీటిని వాడ్తున్నారు. ఈ వేడి నీటిని వెనువెంటనే నదులలో కలుపుతున్నారు. ఇలా చెయ్యడం నదుల జీవరాశికి ఏమంత మంచిది కాదు. బొగ్గు-విద్యుత్ కేంద్రాలలో కూడా స్వచ్ఛమైన నీటినే వాడుతున్నారు. ఈ ప్లాంట్లలో స్వచ్ఛమైన నీటిని బదులు ఉప్పునీరు, లేదా కలుషితమైన నీరు వాడేందుకు ప్రయోగాలు చెయ్యాలి. తద్వారా, న్యూక్లియర్ ప్లాంట్లలో విడుదలయ్యే వేడిని తెలివిగా త్రాగే నీరు తెచ్చుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. ఈ విధమైన మార్పులు చేస్తే, ప్లాంట్ల నిర్మాణ ఖరీదు మరీ పెరుగుతుంది. కానీ, ఈ విధమైన దిశగా మనం అడుగులు వెయ్యక తప్పదు.
చివరగా, జన్యు మార్పులు చెయ్యడం వలన నీటిని మరింత సమర్ధవంతంగా వాడే వంగడాలు సృష్ఠించవచ్చు. దీనిపై, శాస్త్రవేత్తలు కృషిచేస్తున్నారు. కొత్త పద్ధతులైన బయో-టెక్నాలజీ, ఇంఫర్మేటిక్సు లనే కాక పాత పద్ధతులైన స్టెం-కల్చరు తో కూడా మనం ప్రోత్సహించాలి. పాత పద్ధతులని ఉపయోగించే ఒక 50% దాకా మార్పులు తీసుకురావచ్చు
సామాజిక పరిష్కారాలు :
నీరు అనేది బంగారంతో సమానం అని ప్రజలు గుర్తించాలి. సాధ్యమైనంత పొదుపుగా వాడాలి.
మాంసాహారం బదులు వీలైనంత ఎక్కువగా శాకాహారం భుజించాలి. నీటిని ఎక్కువగా వాడే వరి బదులు రాగి, జొన్నలు వంటి పంటలను ప్రోత్సహించాలి.
నీటి వినియోగం ఎక్కువగా ఉండే ఆహారాలను ఉత్పత్తి చెయ్యడం తగ్గించి దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టాలి.
అన్నింటికన్నే ముఖ్యంగా, జనాభా నియంత్రణకు నడుం బిగించాలి. ఉత్తరాది రాష్ట్రాలలో మరింత విస్తృతంగా ప్రచారం చెయ్యాలి.
(గణాంకాలు నేచర్ పత్రిక మార్చి 20, 2008 సంచిక నుండి స్వీకరించబడినవి)
→ 10 Commentsవర్గాలు అభివృద్ధి · నీరు · భవిష్యత్తు
Tagged: నీరు, భవిష్యత్తు
ఇంధనాల భవిష్యత్తు
ఏప్రియల్ 3, 2008 · అభిప్రాయములు
మన దేశ భవిష్యత్తుకి 3 ప్రధాన అడ్డంకులున్నాయి : ఇంధన కొరత, నీటి కొరత, విద్య కొరత. నా బ్లాగులో ఈ మూడింటిపైన మూడు పోస్టులు వ్రాద్దామని నిశ్చయించుకున్నాను. నా మాట ఎంతమందికి వినపడుతుందో తెలియదు, కానీ నా చేతనయ్యింది నేను చెయ్యాలి కదా.
మొదటగా ఇంధన కొరత గురించి వ్రాస్తాను.

ఇంధనం ధరలు మార్కెట్లో అన్ని ధరలని నియంత్రిస్తాయి. సరుకులని రవాణా చెయ్యాలంటే ఇంధనం కావాలి. ఫ్యాక్టరీలు నడపాలంటే ఇంధనం కావాలి. విద్యుత్తు ఉత్పత్తి చెయ్యాలంటే ఇంధనం కావాలి. ఆధునిక ప్రపంచం ఇంధనం లేకుండా నడవలేదు. మనదేశం అభివృద్ధి చెందాలంటే ఇంధన వనరులు పుష్కలంగా కావాలి.
కానీ, సంప్రదాయ ఇంధన వనురులు అంతరించిపోతున్నాయి. పెట్రోలు ధర రోరోజుకీ పెరుగుతుంది తప్ప తగ్గదు. మనం వాడుతున్న రేటులో పెట్రోలు వాడుకుంటూ పోతే మరో వందేళ్ళలో అంతా హరించుకుపోతుంది. కానీ ధరలు ఆకాశాన్నంటడానికి అంతవరకూ ఆగనక్కర్లేదు. సంవత్సరానికోసారి ధర రెట్టింపు అవుతుంది.
దీని దెబ్బ పడేది సామాన్యుడి పైనే. రోజువారీ వస్తువులు లారీల్లో మునుపటిలాగా రవాణా చెయ్యలేరు, కారణంగా ధరలు ఆకాశాన్నంటుతాయి. ఈ దెబ్బకి దేశాలు అతలాకతోలమైపోతాయి, ప్రభుత్వాలు పడిపోతాయి. ప్రజల్లో అశాంతి పెరిగిపోతుంది.
శిలాజ ఇంధనాలు :
మన భూమిలో మిగిలి ఉన్న శిలాజ ఇంధనాలు ఇంచుమించు ఇంత (ZJ : జిలియన్ జౌల్సు)
- పెట్రోలు – 18.4 ZJ
- నాచురల్ గ్యాసు – 15.7 ZJ
- బొగ్గు – 290 ZJ
పోలికకి 2004లో ప్రపంచం మొత్తం వినియోగించిన ఎనర్జీ మొత్తం 0.5 ZJ. ఇందులో, శిలాజ ఇంధనాల వాటా 86.5%, అందులోనే పెట్రోలు వాటా 37%. ఇది త్వరలో మరింత పెరుగుతుంది (చైనా, ఇండియా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి కనుక).
వీటిలో పెట్రోలు మాత్రమే ప్రస్తుతం వాహనాలు నడపడానికి డైరెక్టుగా పనికివస్తుంది. ఈ మధ్యన కొన్ని రకాల బస్సులను, కార్లను గ్యాస్ తో నడుపుతున్నారు. కానీ, అంతిమంగా ఇవన్నీ రద్దు చెయ్యక తప్పదు. బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చెయ్యవచ్చు, దానిపై కరెంటుతో నడిపగలిగిన వాహనాలు ట్రెయిన్లు, కొన్ని కొత్త మోడల్ కార్లు. ఇవి మరింకొంతకాలం నడపవచ్చు, ధరలు ఆకాశాన్నంటే ముందు.
పెట్రోలు ధరలు పెరగడంతోనే మిగిలిన ఇంధన ధరలు కూడా వెనువెంటనే పెరిగిపోతాయి. ఎందుకంటే, చివరకి అన్ని రకాల ఇంధనం ఒకే రకంగా వాడతాం కాబట్టి. ప్రపంచం మొత్తం ఈ శిలాజ ఇంధనాల ఆధారంగా పనిచేస్తోంది కనుక ఈ వనరులు ఉన్న దేశాలు ఆడింది ఆటగా పాడింది పాటగా చెలామణీ అవుతోంది. వీటిలో తమ వాటా రక్షించుకొనేందుకు అమెరికా మధ్య-ఆసియా మొత్తం కన్నువేసి ఉంచగా, చైనా సుడాను, వెనిజులా దేశాలను మచ్చిక చేసుకొంటోంది. మన భారతదేశం వీటిపై పెద్దగా ఆలోచించట్లేదు ఇంకా. మనదేశంలో కొద్దిపాటుగా బొగ్గు ఉంది, మరింకేమీ లేదు. అటు ఇరానుని, ఇటు బర్మాని కొంత సాయమడగాలని మనవాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ఈ ఇంధన వనరులు పుష్కలంగా ఉన్నదేశాలన్ని మానవ హక్కులను రెండుకాళ్ళతో నొక్కి నేలకు రాస్తున్నాయి. మిగతా ప్రపంచం నోరు మూసుకుని గప్-చుప్ అంటోంది.
కానీ చివరికి ఈ శిలాజ ఇంధన వనరులను ఏ దేశమైనా నమ్ముకోలేదు.
శిలాజ ఇంధనాలు వాడడం వలన మరో ప్రమాదం గ్లోబల్ వార్మింగు. బొగ్గు కావచ్చు, గ్యాస్ కావచ్చు, పెట్రోలు కావచ్చు – భూమిలో ఇంధనరూపంలో మగ్గుతున్న కార్బన్ నిల్వలని మనం ఆకాశంలో కార్బన్ డయాక్సైడుగా హుష్ కాకీ అని ఊదేస్తున్నాం. ఇది వాతావరణాన్ని వేడెక్కించేసి, ప్రపంచంలో పెనుమార్పులు తెస్తోంది. శిలాజ ఇంధనాలు మొత్తం వాడేసే ముందుగానే, గ్లోబల్ వార్మింగు రూపంలో మానవాళికి ముప్పు వాటిల్లవచ్చు.
గాలి-నీరు-వెలుతురు తో విద్యుత్తు :
సరుకుల రవాణాకు వీలైనంతగా కరెంటు ట్రెయిన్లు, కరెంటు కార్లు వాడుకుంటే విద్యుత్తుని మరికొన్ని విధాలుగా ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ మార్గాలు ఎల్లప్పిటికీ తెరిచే ఉంటాయి, ఎందుకంటే సూర్యుడు ఉన్నంతకాలం వీటికి డోఖా ఉండదు కాబట్టి. వీటితో గ్లోబల్ వార్మింగు బెడద కూడా ఉండదు.
కానీ వీటితో మనం తెచ్చుకోగల విద్యుత్తు అతి పరిమితమైనది. మన అవసరాలకు కనీసం 5% కూడా సరిపోదు. గాలిమరలు, సూర్యరశ్మి-పానెల్లు కట్టడానికి చాలా ఖర్చుతో కూడినవి. నీటి విద్యుత్తు ముఖ్యంగా భారీ డ్యాముల ద్వారా వస్తుంది. కట్టడానికి వీటి ఖర్చు ఎక్కువే, అదిగాక వీటివలన ప్రజలు నిరాశ్రయులవుతారు, పర్యావరణానికి చెట్టు చేమకు ఎంతో హాని.
ఏచూరి సీతారాం గారు మొన్న పార్లమెంటులో అమెరికాతో న్యూక్లియర్ ఒప్పందానికి విరుద్ధంగా ప్రసంగిస్తూ జల విద్యుత్తును 3 రెట్లు మెరుగ్గా ఉపయోగించుకోవాలి అని సూచించారు (ప్రస్తుతం మనం 3వ వంతు మాత్రమే ఉపయోగిస్తున్నాం). అంటే 3 రెట్లు మరిన్ని డ్యాములు నిర్మించాలని వారి ఉద్దేశ్యం. ఒకవేపు నర్మదా-బచావో-ఆందోళన చేస్తున్నవారితో సై అంటారు, మరొకవేపు ఇలాంటి సూచనలు చేస్తారు.
వారి ప్రసంగంలో వెల్లడించిన వివరాలు : భారతదేశం ఏడాది కరెంటు వాడకం (కేవలం కరెంటు మాత్రమే, పెట్రోలు మొదలైన ద్రవ ఇంధనాలు కాదు)
- ప్రస్తుతం 2007 : 127 GW(గిగావాట్లు) (1ZJ = 30,000 GW)
- 2016-17 నాటికి మన అవసరాలు : 330 GW
- 2007 నీటి విద్యుత్తు ఉత్పత్తి : 33 GW
- మొత్తం ఉపయోగించుకోగల నీటి విద్యుత్తు వనరులు : 150 GW
- మిగులు విద్యుత్తు (330-127=173 GW)ఎలా తెచ్చుకోగలం : నీరు (150-33=117GW) మరింత బొగ్గు కాల్చడం (173-117=56GW)
వారి ఉద్దేశ్యంలో బొగ్గు విద్యుత్తు అన్నింటికన్నా చవక గనక, నీటి విద్యుత్తు బదులు బొగ్గునే వీలైనంత ఎక్కువ కాల్చెయ్యాలి. కానీ ఎంతకాలం ఇలా మనం కంటిన్యూ అవగలమో ఆయన మాట్లాడలేదు.
బయో ఇంధనాలు :
పంటల ద్వారా కార్బనుని తయారు చేసి దానిని ఇంధనంగా వాడవచ్చు. ప్రస్తుతం ఎక్కువగా చెరుకు, జొన్న పంటలనుండి బయో-ఇథనాలు (పెట్రోలు లాంటి ద్రవ ఇంధనం) తయారు చేస్తున్నారు. దీని వలన గ్లోబల్ వార్మింగు ఉండదు. ఎందుకంటే, ఉత్పత్తి చేసిని కార్బన్ డయాక్సైడు ని తిరిగి పంటమొక్కలు కార్బనుగా వాతావరణం నుండి వెనక్కి తీసుకుంటాయి.
బయో-ఇంధనాల కోసం పంటలు పెంచడం వలన పంట భూమి హరించుకుపోయి ఆహార ధరలు పెరిగిపోతాయని పలువురు హాహాకారాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది కొంతవరకూ నిజమే.
కానీ, బయో-ఇంధనాలను పండిస్తున్నది ముఖ్యంగా అభివృద్ధి చెందిన సంపన్న దేశాలు. వాటికి ఆహార కొరత లేదు. అమెరికా, ఫ్రాన్సు, ఇంగ్లండు, జపాను మొదలైన దేశాలలో రైతులకి విపరీతమైన సబ్సిడీలనందించి పంటలు పండిస్తున్నారు. ఇది ఒక రకంగా విపరిమాణం. ఈ సబ్సిడీలను పుచ్చుకోవడం వలన (ముఖ్యంగా దండుకొనేది చిన్న రైతులు కాదు, భారీ ఫార్మింగు సంస్థలు) ఈ దేశాలలోని ఆహారం మిగిలిన దేశాల కంటే చౌకగా తయారయ్యింది. అతి విచిత్రంగా అభివృద్ది చెందిన దేశాలు ఆహారాన్ని పేద దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి.
పేద దేశాలలో ఖర్చులు తక్కువ గనక ఇక్కడి పంటలు సహజంగానే తక్కువ ఖరీదు ఉంటాయి. ధనిక దేశాలు సబ్సిడీలను ఇవ్వకపోయినట్లైతే పేద దేశాలే వాటికి ఆహారం ఎగుమతి చెయ్యగలవు. పంటలు వెయ్యడానికి భారీ పెట్టుబడి అవసరం లేదు గనక, ఇది సుళువుగా పేద దేశాలకు విదేశీ మారక ద్రవ్యం తేవగలదు. ఈ డబ్బుతో పేద దేశాలు మరింత అభివృద్ధి అవగలవు. కానీ, ప్రస్తుతం ఇలా జరగట్లేదు.
పేద దేశాలే ధనిక దేశాలపై ఆహారం కోసం ఆధారపడుతున్నాయి. ఉదాహరణకి, మెక్సికో జొన్న కోసమై అమెరికా పై ఆధారపడుతోంది. అమెరికాలో జొన్నని బయొ-ఫ్యూయెల్ చేస్తే సహజంగానే మెక్సికోలో జొన్న ఖరీదు పెరుగుతుంది. దీనివలన విపరీతమైన చెడు ప్రచారం వచ్చింది. మొన్న, ఆంధ్రజ్యోతి పత్రికలో బయో-ఫ్యూయెల్స్కి విరుద్ధంగా ఘాటుగా వ్యాసం వ్రాసేసారు.
కానీ వెనక్కి నక్కి ఉన్న విషయమేమిటంటే, పేద దేశాల్లో పంట భూములని సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు. ఉదాహరణకి, మన భారతదేశంలో ఎకరా భూమికి వచ్చే దిగుబడి అమెరికాతో పోలిస్తే సగమే ! దీనికి ముఖ్య కారణం వ్యవసాయ రంగంలో పెట్టుబడులు లేకపోవడం వలన, ఆధునిక పద్ధతులని మనం అనుసరించకపోవడం వలన. మన వ్యవసాయ ఉత్పత్తులని ధనిక దేశాలకి ఎగుమతి చేసే అవకాశం వస్తే, సహజంగానే వ్యవసాయ రంగం బాగా వృద్ధి చెందుతుంది. ఇది మనలాంటి దేశానికి చాలా మంచిది. బయో-ఫ్యూయెల్స్ వలన మనకి చివరికి మంచే గానీ చెడు కాదు.
మన ప్రపంచంలోని భూములను సరిగ్గా ఉపయోగించుకుంటే, ప్రపంచ జనాభాకి అందరికి ఆహారం తీర్చడంతో పాటు 20% ఇంధన అవసరాలను కూడా మన పంట భూములు తీర్చగలవు. ఈ దిశగా మనం పావులు కదపాలి, వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టాలి, ఈ సంధి-దశలో ఎక్కడా ఆకలి చావులు లేకుండా జాగ్రత్త పడాలి.
చెరకు వంటి పంటలను కాకుండా, భవిష్యత్తులో సెల్లులోజు పంటలచే బయో-ఇంధనాలను తయారు చెయ్యడానికి జన్యు-రసాయన శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. వీటి వలన బయో-ఇంధనాలు మరింత సమర్థవంతమవుతాయి. పంట భూముల బదులు, సముద్రంపై ఆల్గేను పెంచి, వాటితో బయో-ఫ్యూయెల్స్ తాయారు చేసేందుకు కూడా కృషి జరుగుతోంది.
న్యూక్లియర్ విద్యుత్తు :
న్యూక్లియర్ విద్యుత్తు ఒక్కటే ప్రపంచ ఇంధన అవసరాలను సంపూర్ణంగా తీర్చగలిగే వనరు. మన భూమిలో ఉన్న యురేనియం నిల్వలు 2500 ZJ (బొగ్గు కంటే 10 రెట్లు ఎక్కువ !) వీటికి థోరియం నిల్వలు కలుపుకుంటే మరింత ఎక్కువ. ప్రపంచం మొత్తానికి వేయి, 2వేల సంవత్సరాలు నిక్షేపంగా విద్యుత్తు సరఫరా చెయ్యగల నిల్వలు ఇవి. ఈ అనంతమైన కాలంలో మన శాస్త్రవేత్తలు మరెన్నో ఆవిష్కరణలు చేస్తారు. ఇతర గ్రహాలలో మానవులు నివాసాలు కడతారు.
న్యూక్లియర్ విద్యుత్తు గ్లోబల్ వార్మింగు చెయ్యదు. వాతావరణంలో డైరెక్టుగా కాలుష్యం వెదజల్లదు. కానీ, దీనికున్న అతిముఖ్యమైన సమస్య – రేడియో ఏక్టివ్ చెత్త. ఈ చెత్తని చాలా జాగ్రత్తగా పదిలపరచాలి. ఎక్కడైనా బయటకి కలిస్తే పర్యావరణానికి, మానవాళికి విపరీతమైన హాని కలుగుతుంది. అంతేకాక, ఈ టెక్నాలజీ ఉంటే ఆటం బాంబులు తయారు చెయ్యడం కూడా అతి సుళువు. రేడియో ఏక్టివ్ చెత్త నుండి కూడా బాంబులు చెయ్యవచ్చును. ప్రపంచమంతా ఏకమై ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే తప్ప ఇలాంటి సున్నితమైన సమస్యలను పరిష్కరించలేము. ఇది మన భవిష్యత్ తరాలకి ఒక ఛాలెంజి.
ఒకప్పుడు న్యూక్లియర్ విద్యుత్ కేంద్రాలు చాలా ప్రమాదభరితంగా ఉండేవి (చెర్నోబిల్ ఉపద్రవం గురించి అందరికీ తెలుసు). ప్రస్తుతం ఆధునిక శాస్త్ర పద్ధతుల వల్ల ఇది చాలా మారింది. భావి తరాలకి ఇంధన అవసరాలను సమర్ధంగా తీర్చగలిగే సాధనం ఒక న్యూక్లియర్ విద్యుత్తు మాత్రమే. ఫ్రాన్సు దేశం ఈ విషయంలో ఎంతో ముందడుగు వేసి తన విద్యుత్ అవసరాలలో 79% న్యూక్లియర్ విద్యుత్నే వాడుకుంటోంది (ఫ్రాన్సులో నేను ఈ బ్లాగు వ్రాయడానికి, నా కంప్యూటరు కూడా న్యూక్లియర్ కరెంటునే వాడుతోంది) . మన భారతదేశం ప్రస్తుతం కేవలం 3% అవసరాలకు న్యూక్లియర్ విద్యుత్ను వాడుతోంది.
దీనిని త్వరగా మనం చాలా పెంచుకోవలసిన అవసరం ఉంది. సరుకుల రవాణాకు కూడా కరెంటు ట్రెయిన్ల వాడకం పెంచాలి. లేదంటే, భవిష్యత్తులో సామాన్య పౌరుడు పెట్రోలు ధరలను తట్టుకోలేడు.
మొదట్లో, న్యూక్లియర్ విద్యుత్ కేంద్రాలను ఏర్పరచడం ఖర్చుతో కూడిన వ్యవహారమే. కానీ దూరాలోచనతో యోచిస్తే, ఇది ఎంతో భేషైన పని. మన కమ్యూనిస్టులు అమెరికా వ్యతిరేకతతో మరొకసారి మూర్ఖంగా ఈ అవకాశానికి అడ్డు తగిలారు.
న్యూక్లియర్ విద్యుత్తును ప్రస్తుతం ఫిషన్ (విచ్ఛేధన) ప్రకారం తెచ్చుకుంటున్నాము. పరిశోధన బాగా నడిపితే భవిషత్తులో ఫ్యూజన్ (సమ్మేళనం) పద్ధతిలో కూడా తెచ్చుకోవచ్చు. ఇది పర్యావరణానికి మరింత అణువైనది, అంతేగాక ఇంధన వనరులు (హైడ్రోజన్ అణువులు) ఎప్పటికీ తరగవు ! ప్రస్తుతానికి ఇది ఇంకా పరిశోధనలోనే ఉంది కానీ విజయవంతమైతే ఇదొక అనంతమైన శక్తి యంత్రము. మన భారతదేశం ఈ దిశలలో ఆలోచించాలి.
→ 9 Commentsవర్గాలు అభివృద్ధి · ఆర్థిక · ఇంధనం · భవిష్యత్తు
Tagged: ఆర్థిక, ఇంధనం, భవిష్యత్తు
“దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్”, అన్నాడు మహాకవి గుఱజాడ. ఈ మహాసత్యం గుర్తుచేసుకుని ఆచరిద్దాం. కాశ్మీరులో జరుగుతున్న అత్యాచారాలకు స్వస్తి చెబుదాం. అక్కడి మన సోదరులకి సరైన గౌరవం ఇద్దాం.
ఏమిటి మనకి కాశ్మీర్ భూమిపై ఉన్న హక్కు ? అక్కడే పుట్టి, బ్రతుకుతున్న కాశ్మీరీలకంటే ఎక్కువ హక్కు ఉందా మనకి ? వాళ్ళకి కావలసింది ఏమిటొ వాళ్ళు నిర్ణయించుకుంటారు. అక్కడికి సైనికులని పంపి, కర్ఫ్యూలని పెట్టి, వాళ్ళ ముక్కు పిండి మనం ఏమి సాధించాలి ? ఇదా మన భారత ప్రజాస్వామ్యం ?
అరవై ఏళ్ళుగా సగం భూమి భారత్ లో సగం భూమి పాకిస్తానులో వుండి కుటుంబాలు చెల్లాచెదురయ్యి వాళ్ళు ఏడుస్తుంటే ఎప్పుడు పట్టించుకున్నాం మనం ?
సొంత గొప్ప చెప్పుకోవడం తప్ప అసలు కాశ్మీరులో ఒక్కసారైనా నిఖార్సైన ప్రజాస్వామ్యం ఏర్పాటు చేసామా ?
ఇప్పుడు అక్కడ టీవీ చానెళ్ళు బందు చేసారు. రేపు ఇంటర్నెట్టు బందు చేస్తారు. ఎవ్వరికి కావాలి కాశ్మీరీల గోడు ?
మన తప్పుని మర్యాదగా ఒప్పుకుని, సరిచేసుకుందాం. లేకపొతే, యుగోస్లావియా దేశం వలే మనదేశం ముక్కచెక్కలయ్యిపోతుంది. మారణహోమం జరిగి లక్షలకొద్ది ప్రజలు చస్తారు. న్యూక్లియర్ యుద్ధం జరగవచ్చు. మూర్ఖత్వం వీడకపోతే అమూల్యమైన మన సంస్కృతిలో ఇక మిగిలేది ఏమీ ఉండదు.
మన భారతదేశం ఒక సంధి దశలో ఉంది. మన భవిష్యత్తు రక్షించుకోవాలంటే మనం కొంత తెలివిగా ఆలోచించి మార్గాలు వెతుక్కోవాలి.